*వసంత మండపంలో శ్రీ విష్ణుసాలగ్రామ పూజ
*
తిరుమల (ప్రజా అమరావతి):
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా సోమవారం తిరుమల వసంత మండపంలో శ్రీ విష్ణుసాలగ్రామ పూజ ఘనంగా జరిగింది.
ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ విశేషమైన భగవత్ శాస్త్రంలో చెప్పడినట్లు సాలగ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారని తెలిపారు.
● సృష్ఠి,
● స్థితి,
● లయ కారకుడైన
శ్రీ మహవిష్ణువు కూడా అక్కడే కొలువై ఉంటారన్నారు.
● కృత,
● త్రేత,
● ద్వాపర యుగాలలో...
వేలాది సంవత్సరాలుగా తపస్సు, యజ్ఞ యాగాలు చేయడం వల్ల పొందే ఫలితాన్ని, కలియుగంలో పవిత్ర కార్తీక మాసంలో విష్ణుసాలగ్రామ పూజ చేసిన, దర్శించిన, ఆ మంత్రాలను విన్న అంతటి ఫలితం సిద్ధిస్తుందని వివరించారు.
ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత సాలగ్రామాలకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం సాలగ్రామాలకు ప్రత్యేక వేద మంత్రాలచే ఆరాధన, నివేదన, హారతి సమర్పించారు. చివరిగా క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ పూజ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
వసంత మండపంలో విష్ణుపూజలు :
పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 16, 21, డిసెంబరు 2వ తేదీల్లో తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన విశేష ఆరాధనలు వైఖానసాగమబద్ధంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా
నవంబరు 16న క్షీరాబ్ధిద్వాదశి, కైశికద్వాదశి – శ్రీ తులసీ ధాత్రీ సహిత దామోదర పూజ,
నవంబరు 21న గోపూజ,
డిసెంబరు 2న శ్రీ ధన్వంతరీ జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.