తిరుమల, ఫిబ్రవరి 10 (ప్రజా అమరావతి);
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి
- టిటిడి చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రశంసించిన ఉప రాష్ట్రపతి
భారత ఉప రాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అంతకుముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా మహద్వారం వద్దకు చేరుకున్నారు. గౌ|| ఉపరాష్ట్రపతికి టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తరువాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. గౌ|| ఉపరాష్ట్రపతికి చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని అందజేశారు.
ఇటీవల డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ల్యామినేటెడ్ ఫోటో, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు మరియు ఆరు షీట్ల క్యాలెండర్ ఈవో అందజేస్తూ, వాటి తయారీ, ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతికి వివరించారు.
ఈ సందర్భంగా గౌ. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళికి శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రసాదించాలని ప్రార్థించిన్నట్లు తెలిపారు. టిటిడి అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టడంతోపాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు వెళుతున్నందుకు ఆయన ప్రశంసించారు. గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న తన మనుమరాలు సుష్మకు ఆనందకరమైన వైవాహిక జీవితాన్నిఅనుగ్రహించాలని శ్రీవారిని కోరినట్లు ఆయన తెలిపారు.
చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
DD,Ctr
------------------ *భారతీయ సంస్కృతి, హిందు ధర్మాన్ని కాపాడుకోవాలి – ఉపరాష్ట్రపతి పిలుపు*
*• సాధారణ భక్తులకు దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు చేస్తున్న కృషి అభినందనీయం*
*• ప్రముఖులు ఏడాదికి ఒక్కమారే శ్రీవారి దర్శనానికి రావడం వల్ల సామాన్య భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది*
*• కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి*
*• ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం నుంచి దర్శనానికి అవకాశం ఉన్నా, మామూలు భక్తునిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళి స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి*
*తిరుపతి-తిరుమల, 10 ఫిబ్రవరి 2022*
భారతీయ సంస్కృతి – సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కుమార్తె శ్రీమతి దీపావెంకట్ గారి కూతురు కుమారి సుష్మ వివాహ మహోత్సవం కోసం ఉపరాష్ట్రపతి తిరుమల చేరుకుని సతీమణి శ్రీమతి ఉషమ్మ, కుమారుడు శ్రీ హర్షవర్ధన్, కోడలు శ్రీమతి రాధమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం మహాద్వారం నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా, మామూలు భక్తునిలా వైకుంఠ ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు.
సాధారణ భక్తులకు దర్శనాన్ని కల్పించేందుకు తిరుమల – తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించిన ఉపరాష్ట్రపతి, ఈ విషయంలో ప్రముఖులుసైతం సహకారం అందించాలని సూచించారు. ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఏడాదికి ఒక్కసారే దర్శనానికి రావాలని, సామాన్య భక్తులకు అవకాశం కల్పించాలని సూచించారు.
తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవడం ద్వారా సంతోషం, సంతృప్తి లభిస్తుందన్న ఉపరాష్ట్రపతి దాని ద్వారా ప్రజలకు మరింత సేవ చేసేందుకు స్ఫూర్తి కలుగుతుందన్నారు. ఆధ్యాత్మికత అంటే సేవామార్గమన్న ఆయన, అందరం దీన్ని గుర్తించి ఆచరించాలని సూచించారు. ఆలయ దర్శనమంటే భగవంతుడు చూపిన బాటలో ముందుకు నడవడమేనని, సాటి వారికి చేసే సేవలో నిజమైన భగవద్దర్శనం సాధ్యమౌతుందని తెలిపారు.
addComments
Post a Comment