కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీలను గాలికొదిలేశారు: దిగ్విజయ్
హైదరాబాద్ (ప్రజా అమరావతి): ప్రధాని మోదీ ఆర్థిక విధానాలతో పేదవాళ్లు మరింత పేదలుగా.. ధనికులు మరింత ధనవంతులుగా మారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ఆయన.. అసంతృప్త నేతలతో గాంధీభవన్లో సమావేశమయ్యారు. అసంతృప్తికి గల కారణాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ మాట్లాడారు. రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేసినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం, ధరలు బాగా పెరిగాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా భారాసపైనా ఆయన విమర్శలు చేశారు.
‘‘భారాసకు చెందిన ఇద్దరు ఎంపీలతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేదా? కాంగ్రెస్ లేకుండా రాష్ట్రం ఏర్పడేది కాదు. 2004లో మాట ఇచ్చి 2014లో దాన్ని నిలబెట్టుకున్నాం. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చాలా హామీలు ఇచ్చి గాలికొదిలేశారు. కేసీఆర్కు బలం లేక కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలన్నింటికీ భారాస మద్దతు ఇచ్చింది. కుటుంబ పాలన, అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం మునిగింది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి భారత్ జోడో యాత్రను ఎందుకు ఆపమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మెడికల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసిందా? లాక్డౌన్ పెడుతోందా?’’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు.
addComments
Post a Comment