సామాజిక బాధ్యతగా మొక్కలను నాటాలి.... జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్

 సామాజిక బాధ్యతగా మొక్కలను నాటాలి....

జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్



పెనుగొండ ,డిసెంబర్ 23 (ప్రజా అమరావతి):  సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ బి. బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం పెనుగొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కల్పతరువు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్కేయూ వైస్ ఛాన్స్లర్  ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలను పెంచడంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. కళాశాల ఆవరణంలో మొక్కలను పెంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం తో పాటు ప్రశాంతత లభిస్తుందన్నారు.  ఆర్ డి టి వారి సౌజన్యంతో ఈరోజు కల్పతరువు కార్యక్రమం ద్వారా 751 వివిధ రకాల మొక్కలను నాటడం ఎంతో అభినందనీయమని అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీ య సంస్థ సహకారాలతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి  చేయూత నివ్వాలన్నారు. ప్రతి వ్యక్తి సగటున 8  మొక్కలు నాటినట్లయితే పర్యావరణం పచ్చదనంతో హరితవనం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.  ముఖ్యం గా  జన్మదినోత్సవం వివాహ  వార్షిక దినోత్సవం గుర్తుగా అవసరమైన ప్రాంతాలలో మొక్కలను నాటాలన్నారు. మొక్కలను నాటడంతోపాటు వాటిని కాపాడడమే ప్రధాన ధ్యేయంగా నిశ్చయించుకోవాలన్నారు. పర్యావరణం లక్ష్యం మరియు ప్రాధాన్యత  ను తెలుసుకొని శ్రీ సత్య సాయి బాబా 100 వ జన్మదినం వేడుకల నిర్వహణ నాటికి  శ్రీ సత్య సాయి బాబా పుట్టపర్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు కోటి మొక్కలను   నాటే  కార్యక్రమాన్ని లక్ష్యంగా ఉందని, అలాగే బ్రహ్మకుమారి ఈశ్వరియ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మొక్కలను నాటే విధంగా నిర్దేశం చేసుకున్నందున ఈ కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థ లు భాగస్వాములై కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం పచ్చదనం ఉందని జిల్లాలో కేవలం 9% ఉన్నందున లక్ష్యానికి చేరుకునే విధంగా మొక్కలను విరివిగా నాటాలన్నారు.

ఎస్ కే యూ వై ఛాన్స్లర్ ప్రొ. రామకృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ కార్తిక్ వేరువేరుగా మాట్లాడుతూ 

పర్యావరణం పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. ప్రకృతి ఎక్కడ ఉంటుందో ప్రశాంతత అక్కడ ఉంటుందన్నారు. ప్రస్తుత కళాశాల ఆవరణంలో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటడం శుభపరిణామం అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మొక్కల పెంపకం వల్ల అనేక ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కాలుష్యాన్ని నియంత్రించవచ్చునన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమంలో  పాల్గొని సహకరించాలని కోరారు. కార్యక్రమానికి ముందుగా చిన్నారులు జ్యోతి, కీర్తి లు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అతిధులకు స్వాగతం పలికారు. వీరి నృత్య ప్రదర్శన లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం  కళాశాల మైదానంలో ముఖ్య అతిథులు మొక్కలను నాటారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నీలం రమేష్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపి పి డి సుదర్శన్, ఎస్ ఈ పి ఆర్ గోపాల్ రెడ్డి, జెడి అగ్రికల్చర్ సుబ్బారావు, ఆర్డిటి టెక్నికల్ డైరెక్టర్ బీర లింగప్ప, బ్రహ్మకుమారి ఈశ్వరీయ ప్రతినిధులు దీలిప్, ఓం నారాయణ,  సిస్టర్ హేమలత, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ, పెనుగొండ ఎఫ్ఎస్ఓ మల్లికార్జున, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ఓబులేసు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.


Comments