ఓటర్ల నమోదు, తొలగింపు జరగని పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టండి
ఓటర్ల జాబితా పరిశీలకులు ఏ.బాబు
విజయనగరం, జనవరి 04 (ప్రజా అమరావతి): ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో ఒక్క ఓటు కూడా నమోదు, తొలగింపు జరగని పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని ఓటర్ల జాబితా పరిశీలకులు ఏ.బాబు ఇ.ఆర్.ఓ.లు, ఏ.ఇ.ఆర్.ఓ.లను ఆదేశించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులతో సమీక్ష జరిపి కొత్తగా ఒక్క ఓటరు కూడా నమోదు కాకపోవడానికి, ఒక్క ఓటు కూడా తొలగింపు చేపట్టక పోవడానికి కారణాలు తెలుసు కావాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి అప్పగించిన బాధ్యతలను సీరియస్ గా తీసుకోవాలని బి.ఎల్.ఓ.లుగా నియమితులైన సచివాలయం సిబ్బందికి తెలియజెప్పాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై ఆయన బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, జె.సి. మయూర్ అశోక్, జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇ.ఆర్.ఓ., ఏ.ఇ.ఆర్.ఓ.లతో సమీక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులు జారీ, ఓటర్లు, జనాభా నిష్పత్తి తదితర అంశాలపై పరిశీలకులు ఏ.బాబు సమీక్షించారు.
addComments
Post a Comment