శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్.

 శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీడీ ఛైర్మన్


తిరుమల,  ఆగస్టు 30 (ప్రజా అమరావతి): శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్ లెట్లను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి శ్రీవారి ఆలయం ఎదుట ఆవిష్కరించారు.

అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది అధికమాసం కారణంగా సెప్టెంబరు 18 నుండి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు శ్రీవైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరపున శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. సామాన్య భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామన్నారు. బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు స్వీకరించబోమన్నారు. రెండు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యంగా సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి వాహన సేవలను దర్శించాలని ఈ సందర్భంగా ఛైర్మన్ కోరారు.

ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం పాల్గొన్నారు

Comments