75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఆంధ్ర రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు.



75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఆంధ్ర రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు



రాష్ట్ర సచివాలయం, అమరావతి (ప్రజా అమరావతి): దేశ రాజధాని ఢిల్లీ లోని  కర్తవ్యపాద్ లో రేపు 26th జనవరి 2024 న జరుగుచున్న 75వ  గణతంత్ర దినోత్సవంలో  జరిగే పరేడ్ (కవాతు) నందు  ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి 10 మంది NSS విద్యార్థినులు పాల్గొంటున్నారని జాతీయ సేవా పధకం రాష్ట్ర అధికారి డా.పి.అశోక్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో  గురువారం తెలిపారు. జనవరి 1st నుండి 31st వరకు నెల రోజులు జరిగే వివిధ కార్యక్రమాలలో భాగంగా  గత 25 రోజుల నుండి జరుగుతున్న కఠోర శిక్షణ శిబిరంలో  పాల్గొని రోజు ఉదయం 5గంటలకే లేచి ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు జరిగే  యోగ , కవాతు , విద్యాసంబంధిత మెలుకువలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమలలో నియమబద్ధంగా పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ కాంటిజెంట్ లీడర్ గా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి  డా. కె. స్వాతి , NSS వాలంటీర్లగా   సయ్యద్ హీనా ,కేదశ్రీ, రంజని, అనిత ,చందన , యామిని, కళ్యాణి, గీతిక, జోషిత, హర్షిణి లు  పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఢిల్లీ లోని  కర్తవ్యపాద్ నుండి  గణతంత్ర దినోత్సవంలో  జరిగే పరేడ్ (కవాతు) నందు అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుండి అమ్మాయిలు , అబ్బాయిలు పాల్గొంటున్నారని కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆదేశానుసారం అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కేవలం అమ్మాయిలే పాల్గొంటున్నారని డా.పి.అశోక్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగం గా   జనవరి  24 (బుధవారం) నాడు ప్రధాన మంత్రి  నరేంద్ర మోడిని  అన్ని రాష్ట్రాల ,కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చిన NSS విద్యార్థినులు కలిసి వివిధ రాష్ట్రాల సంప్రదాయాల ను, సంస్కృతిని  తెలియచేసే వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను  ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ  నారి శక్తి ఎంతో గొప్పదని , బాలికలు మార్పు కర్తలని , దేశాన్ని, సమాజాన్ని వారెప్పుడు అన్నింట్లో మెరుగ్గా తీర్చిదిద్దుతారని అలాగే అభ్యాసం , ఎదుగుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు ఉంటుందని , అన్ని రంగాలలో బాలికలకు సమాన అవకాశాలు కల్పించడానికి దశాబ్ద కాలంగా కృషి చేస్తున్నామని , ప్రతి ఒక్కరు సమున్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ,కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వచ్చిన NSS విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. 

గణతంత్ర దినోత్సవం అనంతరం NSS విద్యార్థినులు మన గౌ. భారత రాష్ట్రపతిని , ఉపరాష్ట్రపతిని, కేంద్ర మంత్రులను, వివిధ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి ఫిబ్రవరి 1న వారి సొంత రాష్ట్రాలకు బయలుదేరతారు. 

ఈ నెల రోజులు జరిగే NSS విద్యార్థినుల శిబిరానికి ఢిల్లీ డైరెక్టర్ గా  డా. సామ్యూల్ చెల్లయ్య ,  శిబిరానికి డైరెక్టర్ గా భువనేశ్వర్ NSS రీజినల్ డైరెక్టర్ శ్రీమతి సరితాపటేల్ గారు నేతృత్వం వహిస్తున్నారు.

 


Comments