వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం.

 వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం


కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలి

పాడి పరిశ్రమ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయి బ్యాంకులు తోడ్పడాలి

కోళ్ళ పెంపకం,ఆక్వారంగంలో కూడా రైతులకు తగిన రుణాలందించాలి

ప్రభుత్వ పధకాలకు ప్రవేట్ బ్యాంకులు కూడా తోడ్పాటును అందించాలి

226వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ(SLBC)లో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్

అమరావతి,19 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):రాష్ట్రంలో 2023-24 ఆర్ధిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ఆర్ధిక,ప్రణాళిక,శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ వివిధ బ్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందించారు.సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా గత సమావేశ యాక్షన్ టేకెన్ రిపోర్ట్,డిశంబరు 2023 బ్యాంకింగ్ కు ఇండికేటర్స్,2023-24 వార్షిక ఋణ ప్రణాళిక సాధించిన ప్రగతి,రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పధకాలు, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, డిజిటల్ జిల్లాలు,కేంద్ర ప్రభుత్వ మరియు ఆర్బిఐ ఆన్ గోయింగ్ ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు.ఈసందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలనేది ఈప్రభుత్వ అత్యంత ప్రాధన్యత అంశమని కావున కౌలు రైతులకు రుణాలందించుటలో వివిధ బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ణప్తి చేశారు.అదే విధంగా పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని కావున ఈరంగంలో కూడా తగిన రుణాలు అందించాలని విజ్ణప్తి చేశారు.ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డైరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయని కావున ఆయా జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టి డైరీ రంగం అభివృద్ధికి హితోదిక సాయం చేయాలని ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బ్యాంకరులకు సూచించారు.

రాష్ట్రంలో కోళ్ళ పెంపకం,మత్స్య పరిశ్రమ రంగాలు అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కావున ఈరెండు రంగాల్లోని రైతులకు అన్ని విధాలా తగిన రుణ సహాయం అందించి ప్రోత్సహించేందుకు బ్యాంకులు తమ వంతు కృషి చేయాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు.ఎపి టిడ్కో కింది జగనన్న నగరాలు నిర్మాణంలో లబ్దిదారులకు మరింత చేయూతనిచ్చి వేగవంతంగా ఇళ్ళు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు.ప్రభుత్వ పధకాలు అమలులో వివిధ ప్రవేట్ బ్యాంకులు కూడా తమ వంతు తోడ్పాటును అందించాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు.

ఈసమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ ఎపిలో మెరుగైన ఈ క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు.అదే విధంగా గుడ్ గవర్నెన్స్ లో ఎపి ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. వార్షిక రుణ ప్రణాళిక అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతికి వివిధ బ్యాంకరులను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

ఎస్ఎల్బిసి కన్వీనర్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్ర బాబు రాష్ట్రంలో 2023-24 వార్షిక ఋణ ప్రణాళిక అమలుకు సంబంధించి డిశంబరు నెలాఖరు వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.2023-24 వార్షిక ఋణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 4లక్షల 43వేల కోట్ల రూ.లు రుణాలు అందించాలని లక్ష్యం కాగా డిశంబరు నెలాఖరు నాటికే 4లక్షల 77వేల 234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు.దీనిలో ప్రాధాన్యత రంగం కింద 3 లక్షల 23వేల కోట్లు అందించాల్సి ఉండగా 2.88 లక్షల కోట్లు అందించి 89శాతం లక్ష్యం సాధించినట్టు తెలిపారు.అదే విధంగా 2లక్షల 31వేల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా 2లక్షల 8వేల కోట్లు అందించి 90 శాతం లక్ష్యం సాధించినట్టు చెప్పారు.ఎంఎస్ఎంఇ రంగంలో 69వేల కోట్లకు గాను 71వేల 113కోట్లు అందించి 103 శాతం లక్ష్యం సాధించినట్టు తెలిపారు.అలాగే ప్రాధాన్యేతర రంగానికి సంబంధించి లక్షా 20వేల కోట్ల రూ.లు రుణాలు అందించాల్సి ఉండగా లక్షా 88వేల 557 కోట్ల రూ.లు అందించి 157 శాతం లక్ష్య సాధన చేయడం జరిగిందని వివరించారు.

అదే విధంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి కింద 35వేల సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31వేల 699 సంఘాలకు సహాయం అందించి 91 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు యుబిఐ జియం మరియు ఎస్ఎల్బిసి కన్వీనర్ రవీంద్ర బాబు వివరించారు.కేంద్ర ప్రభుత్వ ప్రధకం స్టాండ్ అఫ్ ఇండియా కింద 13వేల 78 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిశంబరు నెలాఖరు నాటికి 12వేల 768 ఖాతాదారులకు సహాయం చేసి 97శాతం లక్ష్య సాధించారని తెలిపారు.పియం ముద్రా యోజన కింద 13వేల కోట్ల రూ.లు రుణాలు అందించాల్సి ఉండగా 14వేల 860  కోట్ల రూ.లు అందించి 114 శాతం లక్ష్య సాధన చేసినట్టు పేర్కొన్నారు.పియం స్వానిధి కింద 4లక్షల 41వేల 903 ధరఖాస్తులు రాగా వాటిలో 4లక్షల 28వేల 678 ధరఖాస్తులకు మంజూరు ఇవ్వగా 97శాతం లక్ష్యం సాధించడం జరిగిందని తెలిపారు.ఇంకా వివిధ పధకాల కింద సాధించిన ప్రగతిని జియం రవీంద్ర బాబు వివరించారు.

నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళిక అమలులో డిశంబరు చివరి నాటికే మంచి ప్రగతి సాధించారని బ్యాంకరులందరినీ అభినందించారు.ఎపిలో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని కావున బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలని కోరారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాలు అందించటలో మంచి ప్రగతి సాధించారన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్ కు నాబార్డు పూర్తి సహకారాన్నిఅందింస్తోందని తెలిపారు.

ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ మాట్లాడుతూ పంట రుణాలు అందించటలో మంచి ప్రగతి సాధించారని అన్నారు.ముద్రా రుణాలు,స్టాండ్ అఫ్ ఇండియా కింద కూడా ప్రగతిని మెరుగుపర్చాలని బ్యాంకరులకు సూచించారు.

ఇంకా ఈసమావేశంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎపి ఇన్చార్జి రాజేష్ కె.మహానా,యుబిఐ జియం గుణనాద్ గమి,ఆర్థిక శాఖ కార్యదర్శి కెవి.సత్య నారాయణ,చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత,వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమీషనర్ శేఖర్ బాబు,ఎపి టిడ్కో ఎండి శ్రీధర్, మెప్మా ఎండి విజయలక్ష్మి,వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు,లీడ్ డిస్టిక్ మేనేజర్లు,తదితరులు పాల్గొన్నారు.


Comments