*ఆంధ్రప్రదేశ్ లో డోన్ నియోజకవర్గం 'అభివృద్ధికి నమూనా' : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
*
*ముఖ్యమంత్రి సీఎం జగన్ డోన్ పై ప్రత్యేక ప్రేమ చూపడం వల్లే ఇది సాకారం*
*బేతంచెర్లలో రూ.62 కోట్ల కీలక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం*
*మరో రూ.8 కోట్లతో నిర్మించే మద్దిలేటి స్వామి, ముచ్చట్ల ఆలయాల పునరుద్ధరణ పనులకు భూమి పూజ*
*ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సుడిగాలి పర్యటనలో ప్రజలతో మమేకం*
*వీరాయిపల్లి గ్రామంలో మానసిక దివ్యాంగురాలు అనితకి అండగా ఉంటామని హామీ*
*గ్రామగ్రామాన మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా ప్రజల స్వాగత సత్కారాలు*
బేతంచెర్ల, నంద్యాల జిల్లా, మార్చి, 03 (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ లో డోన్ నియోజకవర్గం 'అభివృద్ధికి నమూన'గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.తన పాదయాత్రలో తనను డోన్ ఎంఎల్ఏ అభ్యర్థిగా ప్రకటించిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లుగానే డోన్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ చూపారాన్నారు. బేతంచెర్ల మండలంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. రూ.62 కోట్లతో చేపట్టి పూర్తి చేసిన పనులకు సంబంధించి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభోత్సవం చేశారు. బేతంచర్ల పట్టణం నుంచి కొలుములపల్లె, ముద్దవరం, ఎం.పెండేకల్లు గ్రామాల మీదుగా రామళ్లకోట వరకు రూ.41.94 కోట్లతో 23 కి.మీ దూరం నిర్మించిన డబుల్ రోడ్డును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిరాడంబరంగా ప్రారంభించారు. అనంతరం వీరాయిపల్లె గ్రామానికి రూ.2.35 కోట్లతో 2.45 కి.మీ మేర నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వీరాయిపల్లి గ్రామానికి చెందిన 17 ఏళ్ళ అనిత అనే మానసిక దివ్యాంగురాలిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున అందించే పింఛన్ తో పాటు అనిత తల్లి శ్రీదేవికి ఇంటి పట్టా ఇప్పించే దిశగా అధికారులకు మంత్రి బుగ్గన ఆదేశాలిచ్చారు. అనంతరం రూ.75 లక్షలతో మర్రికుంట గ్రామానికి నిర్మించిన అప్రోచ్ రోడ్డును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన ప్రారంభించారు. ఆ తర్వాత గూటుపల్లె నుంచి శ్రీ పాలుట్ల రంగస్వామి ఆలయం వరకు రూ.6.50 కోట్లతో 6 కి.మీ మేర నిర్మించిన రహదారిని సైతం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. చివరిగా కనుమకింది కొట్టాల నుంచి బనగానపల్లె మండలంలోని రామకృష్ణాపురం వరకూ..కేకే కొట్టాల గ్రామం నుంచి బిలసర్గం గుహల వరకు రూ.9.35 కోట్లతో పూర్తైన రహదారిని ఆర్థిక మంత్రి ప్రారంభించారు. రహదారుల ప్రారంభోత్సవం నేపథ్యంలో పాల్గొనేందుకు తమ గ్రామానికి వచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రాకతో పండగ వాతావరణం నెలకొంది. గ్రామగ్రామాన మంత్రి బుగ్గన చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా స్వాగత సత్కారాలతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
*పుణ్యక్షేత్రాల పునరుద్ధరణ పనులకు ఆర్థిక మంత్రి భూమి పూజ*
డోన్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఇప్పటికే రూ.100 కోట్లతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు పునర్ వైభవం తీసుకువచ్చేలా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం బేతంచెర్లలో మరో రూ.8 కోట్లతో చేపట్టనున్న మద్దిలేటి స్వామి, ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయాల పునరుద్ధరణకోసం ఆయన భూమి పూజ నిర్వహించారు. రూ.6కోట్లతో శ్రీ మద్దిలేటి స్వామి గుడి ప్రాంగణంలో పర్యాటక వసతుల అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో భాగంగా మద్దిలేటి స్వామి క్షేత్రాన్ని సందర్శించుకుని ఆలయ ప్రాంగణంలో అందుకు సంబంధించిన భూమి పూజ చేశారు. అనంతరం రూ.1.90 కోట్లతో ముచ్చట్ల మల్లికార్జునస్వామి ఆలయంలో గోపురం, ఫ్లోరింగ్, కాలక్షేప మండపం, దేవతా కల్యాణ మండపం, తేరు పనరుద్ధరణ అభివృద్ధి పనులకు ఆర్థిక మంత్రి భూమిపూజ నిర్వహించారు. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన చరిత్ర కలిగిన గుడికి పునర్ వైభవం తీసుకువస్తామన్నారు. అంతకుముందు బేతంచెర్ల పట్టణంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దర్శించుకున్నారు. రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తానని స్థానికుల వినతికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ రామచంద్రుడు, బేతంచెర్ల ఎంపీపీ నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ బాబుల్ రెడ్డి, వాల్మీకి సంస్థ డైరెక్టర్ మురళీకృష్ణ, డోన్ ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి, బేతంచెర్ల ఎంఆర్వో జీవన్ చంద్రశేఖర్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
addComments
Post a Comment