జిల్లాలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.



మచిలీపట్నం,  మే 11 (ప్రజా అమరావతి);


జిల్లాలో విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.



గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డా. అపరాజితా సింగ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు క్షేత్ర అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి విద్యావ్యవస్థ, నాడు నేడు, ధాన్యం, మొక్కజొన్న సేకరణ, రీ సర్వే, పేదలందరికీ ఇళ్లు, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరి  చదువుకోవాలని

ఏ ఒక్కరు డ్రాప్ అవుట్ గా మిగిలి ఉండరాదని, జిల్లాస్థాయి నుండి గ్రామ సచివాలయ స్థాయి వరకు సంపూర్ణ పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పక్కాగా అమలు పరచాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


పదవ తరగతిలో ఉత్తీర్ణులుకాని  విద్యార్థులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చే సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేవిధంగా మంచి  విద్యాబోధన చేయాలన్నారు.


వచ్చే సప్లిమెంటరీ పరీక్షల్లో ఎవరైనా విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోతే బాధ్యులయిన వారికి చార్జి మెమొలు జారీ చేస్తామని హెచ్చరించారు.


పదవ తరగతిలో  550 మార్కులు పైన వచ్చిన పేద విద్యార్థులను  ప్రైవేట్ కళాశాలలో కూడా చేర్పించాలని, వారికి విద్యా పరమైన రాయితీలు అందేలా చూడాలని సూచించారు.


విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా 25% ఖాళీలు ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులతో  భర్తీ అయ్యేలా దృష్టి సారించాలన్నారు.


నాడు-నేడు పథకం కింద 331 పాఠశాలలో అభివృద్ధి పనులు గణనీయమైన పురోగతి సాధించాలన్నారు.


జిల్లాలో ఇప్పటివరకు 14 మొక్కజొన్న సేకరణ కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, 950 మెట్రిక్ టన్నుల  మొక్కజొన్నను రైతుల నుండి  సేకరించడం జరిగిందన్నారు. ఇంకా మొక్కజొన్న సేకరణ ముమ్మరంగా చేపట్టి. రైతులను అన్ని విధాల ఆదుకోవాలని సూచించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలతో ఏ ఒక్క రైతు  నష్టపోకుండా అండగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.బందరు,   ఉయ్యూరు డివిజన్లో ధాన్యం సేకరణకు సంబంధించిన పైకమును సంబంధిత రైతులకు  త్వరితగతిన చెల్లించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. రీ సర్వే పూర్తయిన ప్రదేశాల్లో  శనివారం లోగా 6 వేల  సరిహద్దు రాళ్ళను పాతేవిధంగా చురుగ్గా పనులు చేపట్టాలన్నారు.


జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో 3 లేదా 4 రోజులు కచ్చితంగా  పర్యటించాలని అప్పుడే అక్కడి సమస్యలు తెలుసుకోవడం వాటి పరిష్కారానికి మార్గం సుగమమవుతుందన్నారు అంతే కాకుండా క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పనులు సజావుగా జరుగుతాయన్నారు.

అర్జీలను విశ్లేషించి  అత్యధికంగా ఉన్న చోట ముఖ్యంగా పర్యటించి అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలన్నారు.


ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు, డి ఎల్ డి ఓ లు, మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తహసీల్దార్లు తదితర  క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.




Comments