ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు.



*ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు*



*పోలీసులకు వీక్లీ ఆఫ్, బకాయిలు మంజూరు*


*హోం గార్డులకు వేతనాలు పెంపు, పోలీస్ రిక్రూట్ మెంట్‌లో 4% రిజర్వేషన్*


*వెలిగొండ పూర్తి చేస్తా గోదావరి నీటితో ప్రకాశంలో ప్రతి ఎకరాకు నీరిస్తా*


*ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు*


*జగన్ కుట్రకు కడప జిల్లా ఒంటిమిట్టలో ఒక కుటుంబం బలైపోయింది*


*జగన్ రెడ్డి మరోసారి గెలిస్తే.. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయి* 


*రూ.13 లక్షల కోట్లు అప్పులు చేసినా.. రోడ్లపై తట్ట మట్టి వేయలేదు*


*ఆస్తి అడిగిన చెల్లిని పెయిడ్ బ్యాచ్‌తో బూతులు తిట్టిస్తున్న సైకో ఈ జగన్*


*పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో ఉద్యోగుల పోరాటం స్పూర్తిదాయకం*


*పేకాట, క్యాసినో డాన్‌ను జగన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టాడు*


*ఎర్రచందనం దొంగను ఎంపీగా నిలబెట్టాడు*


*పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు మీ పిల్లల భవిష్యత్తును ఒక్కసారి గుర్తు చేసుకోండి*

 

*ఒంగోలు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు*


ఒంగోలు (ప్రజా అమరావతి): ఎన్నికల ప్రచారం చివరికి వచ్చింది. మరో రెండు రోజుల్లో ఎన్నికలున్నాయి. ప్రజాగళం 87వ సభ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఎక్కడ చూసినా ఇదే స్థాయి స్పందన. పోలింగ్ రోజున ఇంతకు మించిన ఉత్సాహం చూపించాలి. ఓటు వేసే ముందు ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అవస్థల గురించి ఆలోచించండి. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజల ఆదాయం పెరగలేదు. జీవితాల్లో మార్పులు రాలేదు. ఖర్చులు పెరిగాయి. జీవన ప్రమాణాలు దిగజార్చారు. ఎన్నికలకు ముందు నెత్తిన చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరి ముద్దులు పెట్టి, అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు.జగన్ రెడ్డి బాదుడుకు బలవ్వని పౌరుడే లేడు. దీనికి తోడు దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వేధింపులు, అరెస్టులు, కూల్చివేతలు, సెటిల్మెంట్లు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సైకోని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. 


ఎవరైనా పరిపాలన మంచి పనితో మొదలు పెడతారు. కానీ, ఈ సైకో విధ్వంసంతో మొదలు పెట్టాడు. ప్రజావేధికను కూల్చడంతో ప్రారంభమైన పాలన ఐదేళ్లలో ఒక్క మంచి పని అయినా చేశాడా? ఐదేళ్లలో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రూ.200 ఉన్న బిల్లు రూ.1000 చేశాడు. ప్రజల ఆదాయంలో సగానికి పైగా ఈ దోపిడీకి బలైపోయింది. గతంలో రూ.60 ఉన్న క్వార్టర్ మద్యం ఇప్పుడు రూ.200 చేశాడు. పెంచిన రూ.140 ఎటుపోయింది. జే బ్రాండ్లతో ప్రజల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నాడీ జగ్గూ భాయ్. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల్ని పీల్చి పిప్పి చేశాడు. ప్రెసిడెంట్ మెడల్, బూం బూం తెచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా డిజటల్ పేమెంట్స్ ఉంటాయి. కానీ, ఈ మధ్యం షాపుల్లో మాత్రం లేవు. ఎందుకంటే అందులో సగం సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుంది. మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఓట్లు అడగడానికి సిగ్గుందా?


పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోకెల్లా ఇక్కడే ఎక్కువ. దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడింది. ఈ ధరల బాదుడుతో ప్రజలు కడుపు నిండా తినే పరిస్థితి లేకుండా చేశాడు. ప్రజల కోసం పోరాడితే ఒక కేసు, తప్పుని ప్రశ్నిస్తే కేసు పెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే గంజాయి తెచ్చి ఇంట్లోనో, కారులోనో పెట్టి ఏకంగా గంజాయి కేసు పెట్టేస్తున్నారు. గతంలో పోలీసుల్ని శుక్రవారం ఇళ్లకు పంపించి అరెస్టులు చేయించారు. కానీ, ఇప్పుడు మారారు. నిన్న వారి ప్రతాపమేంటో చూపించారు. ఒక ఉద్యోగికి డబ్బులిస్తే వాటిని తిప్పి కొట్టి మీకు ఓటేసేది లేదని తిరగబడ్డారు. ఉద్యోగుల్లో తిరుగుబాటు నిన్న కనిపంచింది. 13వ తేదీన ప్రజల తిరుగుబాటు కనిపిస్తుంది. 13న జరిగే పోలింగు రాజకీయ పార్టీల కోసం కాదు.. ప్రజల బతుకుల కోసం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పాలన సాధించుకోవడం కోసం. పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను దగా చేశాడు ఈ సైకో. డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ హామీలిచ్చాడు. ఒక్క డీఎస్సీ పెట్టలేదు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. యువతలో మొదలైన తిరుగుబాటు, వారి ఉత్సాహం చూస్తుంటే బోర్డర్లో ఉన్న సైనికుల్లా కనిపిస్తున్నారు. జగన్ రెడ్డి అరాచకాన్ని అణచివేసేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. 


ఒక సిద్ధాంతానికి కట్టుబడి ప్రజల కోసం పని చేస్తున్న నాయకుడు పవన్ కల్యాణ్. తన భార్యల గురించి జగన్ రెడ్డి మాట్లాడితే పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు జగన్ రెడ్డీ తల ఎక్కడ పెట్టుకుంటావ్. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల గురించి, వ్యక్తిగత విమర్శలు చేయడం అత్యంత హేయం. సొంత చెల్లిని కూడా అవమానించేవాడిని సైకో అనకుండా ఇంకేమైనా అంటామా? ఇలాంటి సైకో మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా రక్షణ ఉంటుందా? నన్ను అరెస్టు చేస్తే 80 దేశాల్లో సంఘీభావం తెలిపారు. అది నా సత్తా. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న వారంతా కూడా పార్టీ కోసం పని చేస్తున్నారు. ఒక నాయకుడి కోసం అతని వల్ల బాగుపడిన వారు పోరాడుతామని ముందుకొస్తే అంత కంటే ఏం కావాలి?


రాష్ట్రం జగన్ రెడ్డి పాలనలో అనాధగా మారిపోయింది. దిక్కులేని రాష్ట్రంగా తయారైంది. ఐదేళ్ల పాలనతో 30 ఏళ్లు వెనక్కి పోయింది. బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తానని చెప్పడంతో నమ్మి ఓటేసినందుకు.. అధికారంలోకి రాగానే రివర్స్ డ్రైవింగ్ తో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు. వ్యవస్థలన్నింటినీ కూల్చాడు. జగన్ రెడ్డి ప్రవర్తన చూశాక సైకో అనుకున్నా. కానీ, గతంలో చదివాం ఎవరో ఒక సైకో తిరుపతిలో 30 మంది మహిళల్ని చంపేస్తే ఎందుకు చంపుతున్నాడో అర్ధం కాలేదు. తర్వాత విచారణలో అతని జీవితంలో ఏదో జరిగిన కారణానికి మహిళల్ని చంపుతూ వచ్చాడు. ఇక్కడ ఈ సైకో కూడా అంతే. అబద్దాలు చెబుతాడు. ఎవరైనా వినకుంటే కొట్టి లేపి మరీ అబద్దం చెబుతూ ఉంటాడు. ఆ పచ్చి అబద్దాలు చెప్పడానికి సాక్షి అనే మీడియాను స్థాపించాడు. ఇలాంటి సైకో నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా సిద్ధం కావాలి. 


ఈనెల 13న జగన్ రెడ్డి కబ్జాలు, అరాచకాలు, అవినీతికి ముగింపు పలకడానికి ప్రజలంతా సిద్ధం కావాలి. అదే సమయంలో స్వేచ్ఛకు నాంది పలకాలి. రాష్ట్రంలో విధ్వంస పాలన కావాలో.. అభివృద్ధి పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. సంక్షేమ పాలన కావాలో.. సంక్షోభ పాలన కావాలో తేల్చుకోవాలి. బిడ్డలకు ఉద్యోగాలు కావాలో.. గంజాయి డ్రగ్స్ కావాలో నిర్ధారించుకోవాలి. ఆస్తులకు రక్షణ కావాలా.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కు బలవ్వాలా?


మన తాత.. మన తండ్రి నుండి మనకు వచ్చిన భూముల పత్రాలపై ఈ జలగ ఫోటో ఏంటి? మన వారసత్వం, మన కష్టార్జితంపై ఈ సైకో ఫోటో వేసుకోవడమేంటి? మనం అడగమని ఏమైనా చేస్తాననేలా వ్యవహరిస్తున్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ ప్రభుత్వ పథకంపై అయినా నా ఫోటో ఉందా? గతంలో ప్రభుత్వ రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే.. ఇప్పుడు సైకో తన ఫోటో వేసుకుంటున్నాడు. అధికారంలోకి రాగానే.. ప్రభుత్వ రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాను. 


జగన్ రెడ్డికి ప్రజల ఆస్తిపై కన్ను పడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఒక కుట్రపూరితమైన జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు. మన భూముల రిజిస్ట్రేషన్స్ కు సంబంధించిన పత్రాలు తన వద్ద పెట్టుకుని జిరాక్స్ పేపర్లు ఇస్తాడంట. భూ రికార్డులన్నీ తన దగ్గర పెట్టుకుని మీ భూమి అమ్మాలన్నా, తాకట్టు పెట్టాలన్నా అతని అనుమతి తీసుకోవాలి. సొంత బినామీ కంపెనీలో రికార్డులు దాచిపెట్టి మనకు ఏదైనా అవసరమొచ్చినా, కొనుక్కున్నా వారి గుమాస్తాను బతిమాలుకోవాలి. ఆ గుమాస్తా కూడా ఈయన నామినేట్ చేసిన వ్యక్తి. ఇది మీ భూమి కాదని ఆ వ్యక్తి చెబితే.. ఎమ్మార్వో, ఆర్డీవో ఎవరి దగ్గరకూ వెళ్లడానికి వీల్లేదంట. కడప జిల్లా ఒంటిమిట్టలో తన భూమి అమ్ముకోవాలనుకుంటే.. ఆ భూమి ఎవరి పేరుతోనో రిజిస్టర్ అయిపోయిందన్నారు. అందరి దగ్గరకూ తిరిగాడు. ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో.. రైల్వే ట్రక్ పై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కూతురు విషం తాగి చనిపోయారు. జగన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఇలాంటి ఘటనలు ప్రతి ఇంట్లోనూ ఒకటి జరుగుతుంది. అలాంటి అరాచక చట్టాన్ని అధికారంలోకి రాగానే రెండో సంతకం ఈ చట్టం రద్దు కోసం పెడతాను. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేపర్ను మాత్రమే చించుతున్నా. 13వ తేదీన జగన్ రెడ్డి చీటీ మనమంతా ఏకమై చించాలి. ప్రజల భూములపై కన్నేసిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమికొట్టే వరకు నిద్ర పోవద్దు. 


13వ తేదీన మనం తీసుకునే నిర్ణయం చాటి చెబుతుంది. జగన్ రెడ్డికి మరోసారి ఓటేస్తే ప్రతి ఇంటికీ గొడ్డలి వస్తుంది. గత  ఎన్నికలకు ముందు నేను దండం పెట్టి మరీ చెప్పాను. జగన్ రెడ్డి లాంటి సైకోను నమ్మితే అవస్థలు తప్పవని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచుతాడు. అమరావతి నాశనం చేస్తాడు. పోలవరం ధ్వంసం చేస్తాడు. రాష్ట్రం సర్వ నాశనమైపోతుందని చెప్పాను. కానీ ఆరోజు తప్పటడుగు వేశాం. జగన్ రెడ్డి మాయలో పడి ఏమారిపోయాం. ఇప్పుడు మరోసారి ఏమారి జగన్ రెడ్డికి ఓటేస్తే.. ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు.


బటన్ నొక్కుతున్నా అని చెప్పే జగన్ రెడ్డి.. ఇప్పుడు ప్రజల పీకలు నొక్కాడు. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరమా? మన ఇంట్లో ఉండే బామ్మ కూడా నొక్కుతుంది. అంతోటి పనికి జగన్ రెడ్డి కావాలా? ఉద్యోగాలివ్వడం ముఖ్యమంత్రి సమర్ధత. వ్యవసాయాన్ని బాగు చేయడం, రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం ముఖ్యమంత్రి లక్ష్యంగా ఉండాలి. అప్పుడెప్పుడో జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటి వరకు డబ్బులేయకుండా.. ఎన్నికలకు ముందు ఇస్తానంటున్నాడు. ఇది ఎన్నికల కోసం చేస్తున్న డ్రామా కాదా? అందుకే ఎన్నికల కమిషన్ చెప్పింది.. అప్పుడెప్పుడో బటన్ నొక్కావ్. ఇప్పుడు డబ్బులేస్తామంటే కుదరదని. ఇలాంటి దుర్మార్గుడికి మరోసారి ఓటేస్తామా?


ఐదేళ్లలో 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. కాలువల్లో పూడిక తీయలేదు. రోడ్లపై గుంతలు చూస్తే భయమేస్తోంది. మాట్లాడితే స్కూలుకు రంగులేశానంటున్నాడు. రంగులేస్తే చదువులొస్తాయా? ఉపాధ్యాయ నియామకాలు చేయకుండా చదువులు ఎలా అని అడిగితే సమాధానం చెప్పడు.


కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. కార్పొరేషన్ల పేరుతో హడావుడి చేయడం తప్ప ఎరికైనా రూపాయి రుణమిచ్చాడా.? ఒక్కరికైనా ఉపాధి కల్పించాడా? నేను అధికారంలోకి రాగానే కార్పొరేషన్లను ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికీ ఉపాధి రుణాలిస్తా. పారిశ్రామిక రాయితీలిస్తాను.


సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి వర్గానికి అండగా ఉంటాను. మరోవైపు మోడీ గ్యారెంటీ, మేనిఫెస్టో తో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతా. డ్వాక్రా సంఘాలు తెచ్చి పొదుపు నేర్పి ప్రపంచ వేధికలపై నిలబెట్టాను. ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తి హక్కులివ్వాలని చట్టం తెచ్చాడు. చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని జగన్ రెడ్డి.. మిగిలిన వారికి న్యాయం చేస్తాడా? ఏ అన్న అయినా.. చెల్లెలి జీవితం బాగుండాలి, ఆస్తిలో వాటా కాదు అవసరమైతే మొత్తం ఇస్తానంటారు. కానీ, ఈ దుర్మార్గుడు చెల్లిని సైతం బూతులు తిట్టిస్తున్నాడు. ఇలాంటి సైకోని ఈ ఆడబిడ్డలు క్షమిస్తారా? నా తల్లి కష్టం చూసి.. దీపం పథకంతో వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించాను. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాను. ఉద్యోగాలు, చదువుల్లో రిజర్వేషన్లు కల్పించి మెరుగైన విద్య అందించాను. అలాంటివన్నీ నాశనం చేసిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. నాడు మనం తీసుకున్న నిర్ణయాలతో ప్రతి గడపనా ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఉండే పరిస్థితి నెలకొంది. 


ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాను. తల్లికి వందనం పథకంతో బిడ్డను బడికి పంపించే ప్రతి తల్లికీ రూ.15000 చొప్పున అందిస్తాను. దీపం పథకంతో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాను. మీరు బస్సు ఎక్కండి.. మిమ్మల్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపించే బాధ్యత నాది. ఎవరైనా మీ జోలికొస్తే అదే చివరి రోజు చేస్తా. తొలి వంద రోజుల్లోనే గంజాయి డ్రగ్స్ జే బ్రాండ్స్ లేని రాష్ట్రాన్ని మీకు చూపిస్తాను. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాను. ఇది మీ చంద్రన్న భరోసా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాను. అంత వరకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తా. రైతులకు సంవత్సరానికి రూ.20 వేల ఆర్ధిక సాయం అందించి, డ్రిప్ ఇరిగేషన్ లాంటి పథకాలన్నీ పునరుద్దరిస్తా. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా. గోదావరి నీటిని నాగార్జున సాగర్ కుడి కాలువకు తీసుకొచ్చి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాను. 


మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఉంటానని గతంలోనే చెప్పాను. ఆ మాటకు కట్టుబడి రూ.200 పెన్షన్ రూ.2000 చేశాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా ఏప్రిల్ నుండే రూ.4000 పెన్షన్ మీ ఇంటివద్దకే ఇస్తాను. మూడు నెలల బకాయి మొత్తాన్ని కలిపి మొదటి నెలలో రూ.7000 ఇచ్చే బాధ్యత నాది. దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ ఇస్తాను. పేదలందరికీ రెండు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత నాది. బీసీలకు కంచుకోట తెలుగుదేశం పార్టీ. బీసీ సబ్ ప్లాన్ కు రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తా. ప్రతి ఒక్కరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నా. బీసీల్లోని ప్రతి కులాన్ని పైకి తీసుకొస్తాను. దళితులెప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. గతంలో ఏబీసీడీ కేటగిరీ తీసుకొస్తే.. రాజశేఖర్ రెడ్డి వల్ల దెబ్బ తగిలింది. అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా కేటగిరైజేషన్ తీసుకొస్తాను.


ఉర్దూ యూనివర్శిటీ ఏర్పాటు చేశా. ఉర్దూను రెండో భాషగా గుర్తించా. ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశా. దుల్హన్, రంజాన్ తోఫా, ఇమాం మౌజంలకు గౌరవ వేతనం, విదేశీ విద్య లాంటి పథకాలన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా మైనార్టీలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చాను. హజ్ యాత్రకు వెళ్లే వారికి లక్ష సాయం చేస్తాను. మైనార్టీల రిజర్వేషన్లు కాపాడుతాను. నేను మసీదులు కట్టించాను. ఈ జగన్ రెడ్డి మసీదులకు రూపాయి ఇవ్వకపోగా ఏమీ చేయలేదంటున్నాడు. ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లులకు పార్లమెంటులో మద్దతిచ్చి.. ఇప్పుడు సిగ్గు లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. నేను బహిరంగంగా పొత్తు పెట్టుకున్నాను. కానీ, ఈ జగన్ రెడ్డి జీవితమంతా చీకటి పొత్తులే. నేను రాష్ట్ర కోసం పొత్తు పెట్టుకుంటే.. జగన్ రెడ్డి తన కేసుల కోసం లాలూచీ పడ్డాడు.


బ్రాహ్మణ కార్పొరషన్ ఏర్పాటు చేసి నిధులిస్తే.. ఈ జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు. అదే సమయంలో ప్రతి దేవస్థానంలో బ్రాహ్మణులకు అవకాశాలు కల్పిస్తాను. సమాజంలోని అన్ని వర్గాల వారిని అండగా ఉంటాను. వైశ్యులు వ్యాపారాలు కూడా చేసుకోలేని దుస్థితి కల్పించారు. జగన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే.. వ్యాపారాలను లాక్కుని అందులో వైశ్యుల్ని కూలీలుగా పెడతాడు. ఆక్వా రంగాన్ని బాగు చేస్తాను. 


ఒక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అతన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. పేకాట ఆడుతాడు. క్యాసినోకు వెళ్తాడు. మంత్రిగా ఉంటూ డబ్బులు దొబ్బేశాడు. అలాంటి వ్యక్తిని తీహార్ జైలుకు పంపిస్తారా.. అసెంబ్లీకి పంపిస్తారా? మరోవైపు.. దామచర్ల జనార్ధన్ అజాత శత్రువు. నమ్ముకుంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఐదేళ్ల పాలనలో ఈ ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశాడా? రూ.2516 కోట్ల ఖర్చుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దామచర్ల జనార్ధన్ ఒకవైపు.. చిల్లు గవ్వ పని చేయని సన్నాసి మరోవైపున్నారు. భూ కబ్జాలు, నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు. ఈ ఎమ్మెల్యే చరిత్ర ఇంకేమైనా ఉందా?  ఈ రోజు మనం తిరుగుబాటు చేయకుంటే.. మన ఆస్తులకు రక్షణ ఉండదు. మన జీవితాలకు భద్రత ఉండదు. ఈ రాజకీయ రౌడీలను అణగదొక్కుతా. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాను. ఎర్రజర్ల కొండ దగ్గర పట్టాలిచ్చి రూ.40 కోట్ల విలువైన మట్టి కొట్టేసిన స్మగ్లర్ ఇక్కడి ఎమ్మెల్యే. మరోవైపు.. ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే మామూళ్లకు ప్రతి ఒక్క వ్యాపారీ బలైపోయారు. 


నల్లమల అడవుల్లోని ఎర్రచందనం మొత్తం కొట్టేసిన దొంగని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా నిలబెట్టారు. లారీల్లో బట్టలు, లారీల్లో బియ్యం, లారీల్లో డబ్బులు తెస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడా చూడలేదు. మా ఇంట్లో 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం. కానీ, ఐదేళ్లలో ఇంత సంపాదించడం చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. వీళ్ల దోపిడీ చూస్తుంటే మరోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే రాష్ట్రాన్ని ఉంచుతారా? మాగుంట శ్రీనివాసులు ఎక్కడైనా రూపాయి తప్పు చేయడం చూశారా? దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్నాడు. మచ్చ లేకుండా నడుచుకున్నాడు. స్మగ్లర్లు, ల్యాండ్ గ్రాబర్లు, ఇసుక మాఫియా, మద్యం డాన్స్ తప్ప మంచి వారు వైసీపీకి అవసరం లేదు. 


ఉద్యోగులకు హామీ ఇస్తున్నా. పోస్టల్ బ్యాలెట్ల ఓటింగులో మీ చొరవ అభినందనీయం. అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోతే డిమాండ్ చేశారు. క్యూలైన్లలో నిలబడి మరీ ఓట్లు వేశారు. 85శాతం ఓటింగ్ ఒక చరిత్ర. వీరి చిత్తశుద్ధి చూశాక నాకు బాధ్యత పెరిగింది. జీతాలు పెంచడానికి పీఆర్సీ ఇస్తాను. ఇంటీరియం రిలీఫ్ ఇస్తాను. పోలీసులకు హామీ ఇస్తున్నా వీక్లీ ఆఫ్ అందిస్తా. హోం గార్డుల జీతాలు పెంచుతా. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పరిష్కరిస్తా. తక్కువ ధరకు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు కట్టుకోవడానికి తోడుంటాను. అన్ని రకాల సదుపాయాలు కల్పించి అండగా నిలుస్తా. అంగన్వాడీ, ఆశ వర్కర్లను కూడా అండగా నిలుస్తాను. హోం గార్డుల జీతాలను రూ.24 వేలకు పెంచుతాను. పోలీస్ రిక్రూట్ మెంట్లో హోం గార్డులకు 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తా. పొదుపు సంఘం యానిమేటర్లు, గోపాలమిత్ర, ఆరోగ్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను. చేతి వృత్తులందరికీ న్యాయం చేస్తాను. డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు అందిస్తాను. క్రిస్టియన్ ఆస్తులు కాపాడి వారకి రక్షణగా నిలుస్తాను. అన్ని వర్గాలను ఆదుకునే బాధ్యత నాది.


ఒంగోలు నుండి రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఓటింగ్ రోజున తెల్లవారుతూనే.. నా భవిష్యత్తుకు, నా పిల్లల భవిష్యత్తుకు భరోసాగా నిలిచే నిర్ణయం తీసుకుంటున్నానని పోలింగ్ బూత్ కు వెళ్లి కూటమికి ఓటేయండి. జూన్ 4 నుండి మీ జీవితాల్లో జరిగే మార్పులు మీరే స్వయంగా చూసుకోండి. ఒంగోలులో రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేయండి. సైకిల్ గుర్తుపై ఓటేసి.. సైకోకి స్వస్తి పలుకుదాం. సమయం లేదు. మన జీవితాలు బాగుపడాలంటే.. కూటమి గుర్తులపై ఓట్లు గుద్దండి. సైకోని రాష్ట్రం నుండి తరిమికొట్టండి.

Comments