అ
టీడీపీ ఎంపీ రామమోహన్నాయుడికి సంసద్రత్న అవార్డు -అతి పిన్నవయస్సులోనే ఈ అవార్డు అందుకోనున్న ఎంపీగా రికార్డ్ -శ్రీకాకుళం జిల్లా ప్రజలు, టీడీపీ, కింజరాపు అభిమానులకు ఈ అవార్డు అంకితం-ఎంపీ టీడీపీకి చెందిన శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడు సంసద్ రత్న అవార్డు-2020కి ఎంపికయ్యారు. అతి పిన్న వయస్సులోనే ఈ అవార్డుకు ఎంపికైన ఎంపీగా రామమోహననాయుడు రికార్డు సృష్టించారు. పార్లమెంటు సభ్యునిగా కనపరిచిన అత్యుత్తమ పనితీరు, ప్రజాసమస్యలపై పరిష్కారంలో ఎంపీ చూపిస్తున్న చొరవని గుర్తించి జ్యూరీ కమిటీ ప్రత్యేక అవార్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 8 మంది పార్లమెంటు సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులను 2019-20 సంవత్సరం సంసద్ రత్న అవార్డులకు ఎంపిక చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జ్యూరీ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. తనకు అవార్డు వచ్చిందనే సమాచారం అందుకున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇది తన నియోజకవర్గ ప్రజలు, టీడీపీ, కింజరాపు కుటుంబ వారసునిగా ప్రజాసేవలో వున్న తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. రాజకీయ ప్రముఖులు శశి థరూర్, సుప్రియ సులే వంటి సీనియర్ నాయకులతో కలిసి ఈ అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా వుందన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా తాను చేసిన సేవలను గుర్తించిన ప్రజలే తనను మళ్లీ ఎంపీగా ఎన్నుకున్నారని, ఈ అవార్డు వారికే అంకితం అని పేర్కొన్నారు. ఈ పురస్కారం రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని, తన నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2010 లో సంసద్ రత్న అవార్డులు ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి తగ్గి, లాక్డౌన్ నిబంధనలు సడలించిన తరువాత అవార్డుల ప్రదానం కార్యక్రమం వుంటుందని ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, సంసద్ రత్న అవార్డుల కమిటీ ఛైర్మన్ కె. శ్రీనివాసన్ తెలిపారు.
addComments
Post a Comment