అవినీతి అనకొండగా మారిన దుర్గగుడి ఈవో • వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో రూ. 2 కోట్ల బిల్లులు • సీవేజ్ ప్లాంట్ పేరు చెప్పి రూ. 53 లక్షల దోపిడి • ఫుట్ పాత్ పేరు చెప్పి రూ. 10 లక్షల బిల్లు • నిత్య ఆదాయవనరుగా మారిన మహామండపం • ఈవో అక్రమాల్లో మంత్రి వెల్లంపల్లికీ భాగస్వామ్యం • అవినీతికి సహకరించలేదనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు • మీడియా సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ బెజవాడ కనక దుర్గమ్మ ఆలయం సాక్షిగా కోట్లది రూపాయిల అవినీతి, అక్రమాలు జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వినియోగంలో ఉన్న లిఫ్టులను చూపి అడ్డంగా రూ. 2 కోట్ల 28 లక్షల రూపాయిలు దోచేశారని ఆరోపించారు. ఈవో సురేష్ బాబు గారు అవినీతి అనకొండలా తయారయ్యారనీ, ఆయన అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది కాబట్టే కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఈవోను కొనసాగిస్తున్నారనీ అన్నారు. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మహేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలోనే ఆదాయంలో రెండో అతిపెద్ద ఆలయం అయిన కనకదుర్గమ్మ ఆలయంలో అవినీతి అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? గతంలో ఈవోలుగా పని చేసిన ఎంతో మంది ఐఎఎస్ అధికారులు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచారు. ప్రస్తుత ఈవో సురేష్ బాబు గారికి కొనసాగే అర్హత లేదని హైకోర్టు చెప్పినా ఎందుకు కొనసాగిస్తున్నారో మంత్రి గారికీ, దేవాదాయ శాఖ కమిషనర్ గారికే తెలియాలి. ఈవో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి బినామీగా మారారనీ, ఏ రోజు వాటా ఆ రోజు మంత్రి గారికి అందచేయడం వల్లే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు. సురేష్ బాబు గారు ఈవోగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవు. అమ్మవారి ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. కోట్లాది రూపాయిల పనులకు అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. కూతవేటు దూరంలో కమిషనర్ కార్యాలయం ఉన్నా పర్యవేక్షణ కరువయ్యింది. కోట్లాది రూపాయిలు చెల్లిస్తుంటే కనీస తనిఖీలు, ఆడిట్ లు ఎందుకు చేయడం లేదు. ఆలయ ప్రాంగణంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్న మంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు స్పందించడం లేదు. ప్రతి విషయంలో ఈవోని వెనకేసుకుని రావడం, ఆయన చేసే అవినీతి పనులకు మద్దతు ఇవ్వడం చూస్తుంటే అందులో మంత్రి గారికి భాగస్వామ్యం ఉందని ప్రజలు భావిస్తున్నారు. • రోడ్డు పక్క ఫుట్ పాత్ కి ఆలయానికీ సంబంధం ఏంటి? మే 26వ తేదీన మల్లిఖార్జున మహామండపంలో అడిషనల్ లిఫ్ట్ ఛాంబర్ కనస్ట్రక్షన్ పేరిట రూ. 2 కోట్ల 98 లక్షలు బిల్లులు డ్రా చేశారు. కరోనా లాక్ డౌన్ కొనసాగుతుంటే ఎవరూ చూడరు, స్పందించరని వినియోగంలో ఉన్న లిఫ్టుల పేరుతో కోట్లాది రూపాయిలు చెల్లించడం దోపిడి కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ మంత్రి గారిని, కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇందులో మీ భాగస్వామ్యం ఎంత? వినియోగంలో ఉన్న లిఫ్టులకు ఏరకంగా బిల్లులు చెల్లించారు? ఇంతకంటే అక్రమం ఏమైనా ఉంటుందా? కుమ్మరిపాలెం సెంటర్ నుంచి అర్జున స్ట్రీట్ వరకు ఫుట్ పాత్ నిర్మాణం పేరిట రూ. 10 లక్షల 23 వేల బిల్లులు చెల్లించారు. అదీ మే 26నే చెల్లించారు. ఈ ఫుట్ పాత్ కీ కనకదుర్గమ్మ దేవస్థానానికీ సంబంధం ఏంటి? ఫుట్ పాత్ వేస్తే నగరపాలక సంస్థ వేయాలి. లేదా ఫ్లై ఓరవర్ నిర్మిస్తున్న హైవే ఆధారిటీ నిర్మించాలి. అన్ని బిల్లులు లాక్ డౌన్ సమయంలోనే చెల్లించడం వెనుక ఆంతర్యం ఏంటి? అమ్మవారి ఆదాయాన్ని ఎందుకు దుబారా చేస్తున్నారు? • నాలుగేళ్లుగా మహా మండపాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు కమర్షియల్ కాంప్లెన్స్ ప్లేసులో రెండు మరుగుదొడ్లు కట్టి రూ. 64 వేలు బిల్లులు డ్రా చేశారు. ఏంటని అడిగితే సమాధానం చెప్పరు. అమ్మవారి సొమ్మును ఇంత బహిరంగంగా దోచుకుంటుంటే మంత్రిత్వశాఖ ఏం చేస్తోంది. ఆలయ మహామండపం నిర్మించి నాలుగు సంవత్సరాలు పూర్తయ్యింది. దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? మహా మండపం అక్రమార్కుల పాలిట కల్పతరువుగా మారింది. నిత్యం ఏదో ఒక పని అని చూపుతూ లక్షలాది రూపాయిలు అక్రమ బిల్లులు పెట్టి దోచుకుంటున్నారు. సీవేజ్ ప్లాంట్ పేరుతో బయటి నుంచి విరాళాలు సేకరించారు. అవి ఏమయ్యాయో తెలియదు. ప్లాంట్ పేరుతో రూ. 53 లక్షల 69 వేల బిల్లులు ఎలా చెల్లించారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పినవే రూ. 3 కోట్లు ఉన్నాయి. అమ్మవారి ఆదాయానికి ఇంత పెద్ద ఎత్తున గిండికొడుతుంటే అధికారులు, మంత్రి ఎందుకు స్పందించడం లేదు. ఈవో సురేష్ బాబు గారి అవినీతిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భాగస్వామ్యం ఉంది అందుకే అర్హత లేకపోయినా కొనసాగిస్తున్నారు. మేము ఉత్తుత్తి ఆరోపణలు చేయడం లేదు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నాం. వాస్తవాలను మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. అమ్మవారి సొమ్ము కోట్లాది రూపాయిలు స్వాహా చేస్తున్నా మంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు. దేవస్థానంలో గత 8 సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కనీసం మానవత్వం చూపకుండా నిర్ధయగా తీసేశారు. కరోనా విపత్కాలంలో వారిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది. ఒక పక్కన ఆదాయం డబ్బులు లేవు అని చెబుతారు. కోట్లాది రూపాయిలు బిల్లులు చెల్లించడానికి మాత్రం డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు. అసలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేసిన తప్పేంటి? దశాబ్దకాలం 12 గంటలు నిబద్దతగా పని చేయడమే వారు చేసి తప్పా? మీరు చెప్పిన విధంగా అవినీతి పనులకు పాల్పడకపోవడం వల్లనే వారిని ఉద్యోగాల్లో నుంచి తీసేసిన మాట వాస్తవం కాదా? ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ పెట్టాం. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తాం అని చెబుతారు. మరి వీరి తొలగింపులో ఎందుకు జోక్యం చేసుకోరు. ప్రసాదం ప్యాకింగ్ కోసం రోజుకి రూ. 500 ఇచ్చి బయట నుంచి కార్మికుల్ని పెట్టుకుంటున్నారు. ఆ పని ఏదో వారితోనే చేయించుకోవచ్చు కదా? కొండ మీద కోర్టులు సైతం వద్దన్న ఒకరిద్దరు ఉద్యోగులను ఈవో గారికి సన్నిహితులు అన్న నెపంతో చిన్న ఆర్డర్ తో విధుల్లో కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో లడ్డూ ప్రసాదం విక్రయం అని చెప్పి వారిని అక్కడ విధుల్లో పెట్టడం వాస్తవం కాదా? విక్రయాలు నిలిపివేసిన తర్వాత కూడా విధుల్లో ఎలా కొనసాగిస్తున్నారు. మీ అవినీతిలో భాగస్వాములు అయ్యే వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారా? సెంట్రల్ నియోజకవర్గంలో కాశీవిశ్వేశ్వర ఆలయానికి సంబంధించిన 900 గజాల విలువైన భూమిని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం వెనుక స్థానిక ప్రజా ప్రతినిధి ప్రోత్సాహం ఉందన్న ప్రచారం జరుగుతుంటే స్వయానా బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న శ్రీ మల్లాది విష్ణు గారు ఎందుకు దాన్ని ఖండించడం లేదు. అది అబద్దం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు. దేవాలయ వ్యవస్థల్ని పరిరక్షించాల్సింది పోయి రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని శాశ్విత ఆదాయ వనరుగా మార్చుకునేందుకు మీరు చేస్తుంది కుట్ర కాదా? దీని మీద కూడా ఎవరూ స్పందించరు. మంత్రి పెద్ది రెడ్డి గారు జిల్లా ఇంఛార్జ్ మంత్రి హోదాలో మీరు ప్రోత్సహిస్తుంది అభివృద్ధినా? అవినీతినా? దుర్గగుడి కేంద్రంగా జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా బయటపడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? • హైకోర్టు తీర్పుని అమలుపర్చాలి దుర్గ గుడిలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే పాలక మండలి ఏం చేస్తోంది. చైర్మన్ పైలా స్వామి నాయుడు గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు. మీకు ఈవో గారి అక్రమాల్లో భాగం ఉందా? అక్రమాలను అడ్డుకోలేని ఈ పాలక మండలి పనికి రాదు కోర్టు తీర్పుల అమలుపర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈవో సురేష్ బాబు గారు పనికి రారు అన్న హైకోర్టు తీర్పుని వెంటనే అమలుపర్చాలి అని అన్నారు.


Comments