అమరావతి(prajaamaravati); *కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకం (సీపీఎస్‌), కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:* *సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసులు) కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, పురపాలక పరిపాలన శాఖ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, వివిధ శాఖల అధికారులు హాజరు.* సీపీఎస్‌: కాంట్రిబ్యూటరీ పింఛను పథకానికి (సీపీఎస్‌) సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు సమావేశంలో వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్‌ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్‌ కమిటీ నివేదికను కూడా పరిశీలించారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని, వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని చెప్పారు. వారికి ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను అధికారులు ప్రస్తావించారు. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక (టేబుల్‌) సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. అయితే మన ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్ (ఎంటీఎస్‌) కూడా అమలు చేశామని వెల్లడించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు.


Comments