జగనన్న మాట తప్పడు..మడమ తిప్పడు. మేనిఫెస్టోనే ముఖ్యమంత్రికి భగవద్గీత. ఏడాదిలోనే హామీలన్నీ నెరవేర్చిన ఘనత. ప్రభుత్వ పథకాలను గడపల్లోకే చేర్చిన కొత్త చరిత. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి. కురుపాం (prajaamaravati), నవంబర్ 16: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోను ఒక ప్రచారాస్త్రంగా చూస్తారని, అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మేనిఫెస్టోను భగద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఆడితప్పడం, మడమ తిప్పడం జగనన్న చరిత్రలోనే లేదని, ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా సోమవారం కురుపాం నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది ప్రజలతో నిర్వహించిన పాదయాత్రలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు నాయుడు 600 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసారని విమర్శించారు. తాను పదవిలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మహిళలకు పసుపు కుంకుమల పేరుతో డబ్బులిచ్చి మోసం చేయాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. అయితే మహిళలు చంద్రబాబు మోసాన్ని గ్రహించి ఎన్నికల్లో ఆయనకు గుణపాఠం నేర్పారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాలలో లబ్ది పొందడం కోసం పార్టీ నేతల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సివచ్చేదని గుర్తు చేసారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రజలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సూర్యుడు ఉదయించడానికంటే ముందుగానే వాలంటీర్లు నేరుగా ఇళ్లవద్దకే వెళ్లి ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన సరుకులను, పింఛన్లను పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘రైతులు తమ పంటలను పండించుకోవడానికి ఉచితంగా బోర్లు, మోటార్లను, విద్యుత్తును ఇచ్చి, పంటలు పెట్టుకోవడానికి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి మొత్తాలను అందించి, పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్దతుధరలకు కొంటున్న రైతు ప్రభుత్వం తమదని’’ పుష్ప శ్రీవాణి విపులీకరించారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీకి పంట రుణాలిస్తామని మోసం చేసిందని, 2014 నుంచి 2019 వరకూ రైతులకు రూ.1,865 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.685 కోట్లు మాత్రమే చెల్లించి, మిగిలింది ఎగ్గొట్టారని గుర్తు చేశారు. అప్పటి ఆ బకాయిలు రూ.1,200 కోట్లు తీరుస్తానని వైఎస్‌ జగన్‌ రైతులకు మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మొత్తాలను ముఖ్యమంత్రి నేరుగా రైతుల ఖాతాల్లో మంగళవారం జమ చేస్తారన్నారు. సీఎం మాట ప్రకారం గత ఖరీఫ్‌లో పంట రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీ కూడా ఇప్పుడు చెల్లిస్తున్నామని చెప్పారు. సీజన్‌ పూర్తయిన వెంటనే ఇలా ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి అని వివరించారు. మొత్తం క్లెయిమ్‌ల ప్రకారం 48.60 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద రూ.510.30 కోట్లు ఇవ్వనున్నామని, ఇప్పటివరకూ 10,62,335 మంది రైతుల క్లెయిములకు సంబంధించి రూ.205.74 కోట్లు మంగళవారం ఇవ్వనున్నామని వెల్లడించారు.నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపునిచ్చి, పిల్లల్ని చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ద్వారా రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించి, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు, బెల్టులను కానుకగా ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం నాంది పలికారని, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రాణంపోసారని అభిప్రాయపడ్డారు. జనరంజకమైన జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యకర్తలకు రుణపడి ఉంటాం: పరీక్షిత్ రాజు కురుపాం నియోజకవర్గంలో తమపై నమ్మకముంచి వెన్నంటినడుస్తున్న వైసీపీ కార్యకర్తలకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పరీక్షిత్ రాజు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా అభివృద్ధి పనులు కొంత మందగించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కురుపాం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామి అవుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వం రాజకీయ పార్టీలను కాకుండా ప్రజల అర్హతలను మాత్రమే చూస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆపన్నహస్తం అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వైయస్సార్ విగ్రహం దాకా కొనసాగిన సంఘీభావయాత్రలో కురుపాం నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొన్న వారి లో ఐదు మండలాల కన్వీనర్ లు ఐ. గౌరిశంకర్రరావు, కె.దీనమయ, ఎం.గౌరీశంకరావు, డి.జనార్దన్ నాయుడు, ఉరిటి రామారావు,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరావు, వైస్ ఛైర్మన్ కె.సత్యన్నారాయణ, కళింగ వైశ్య, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు కె.వెంకట సురేష్ కుమార్, గోరిశెట్టి గిరిబాబు, మాజీ ఎంపీపీ,జడ్పీటీసీ లు ఇందిరా కుమారి,శెట్టి పద్మా వతి, ఎన్నికల సమన్వయ కర్త బొంగు సురేష్, మైనార్టీ సంఘ నాయకులు షేక్ నూరేళ్ళ, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు ఆర్.శ్రీధర్, బిడిక అన్నాజీరావు తదితరలు ఉన్నారు. •


Comments