ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం...

 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం...


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్

సచివాలయం (ప్రజా అమరావతి), ఫిబ్రవరి 18 : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ సచివాలయంలోని ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ లో హాల్ లో గురువారం నిర్వహించారు. పాలనలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వంతో కలిసి పనిచేశారని కొనియాడారు. నాన్ ఫైనాన్స్ సమస్యలను సంబంధిత శాఖలతో మాట్లాడి తక్షణమే పరిష్కారిస్తామన్నారు. ఆర్థిక సంబంధమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహిళా ఉపాధ్యాయుల మాదిరిగా అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు 5 రోజుల సెలవు దినాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. అమ్మఒడి పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని, విద్యార్థుల తల్లులు నిరుత్సహపడొద్దని సీఎం ఆదిత్యనాథ్ దాస్ భరోసా ఇచ్చారు. పీఆర్సీపై త్వరలో రిపోర్టు అందజేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశం ఏప్రిల్ లో నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఉద్యోగులను సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకాల అమలులో ఉద్యోగుల సేవలు ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో ప్రభుత్వానికి వారందించిన సహాయ సహకారాలు మరువలేనివన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మరో సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ, ఉద్యోగులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇప్పటికే సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలర్ చేయడంపై కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు...తమ సమస్యలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ కు విన్నవించారు. సీపీఎస్ రద్దు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. రిటైర్ట్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు, ఇతర బెనిఫిట్స్ అందజేయాలని కోరారు. నాలుగో తరగతి ఉద్యోగుల రిటైర్మెంట్ కాలాన్ని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. డీఎస్సీ ద్వారా తక్షణమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలని యూటీఎఫ్. ఏపీటీఎఫ్ ప్రతినిధుల కోరారు. హెల్త్ కార్డులతో  క్యాస్ లెస్ వైద్య సేవలు అందించాలని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘల ప్రతినిధుల కోరారు. రాష్ట్ర సచివాలయంలో అదనపు పోస్టులు మంజూరు చేయాలని సచివాలయం సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో పాటు ఏపీ ఏన్జీవో సంఘ ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ తరఫున బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయం సంఘ ప్రతినిధులు వెంకట్రామిరెడ్డి, ప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, యూటీఎఫ్ జాయింట్ సెక్రటరీ పి.బాబురెడ్డి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జోషఫ్ సుదీర్ బాబు, రాష్ట్ర నాలుగో తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Comments