స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)తో ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం

 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)తో 

ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం



రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్

సచివాలయం, మార్చి 24  (PRAJa అమరావతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో భాగంగా దళితులు, గిరిజనుల రక్షణకు రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) సత్వర న్యాయం అందుతుందని రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు. దేశానికి ఆదర్శంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) నిలుస్తుందని కొనియాడారు. సచివాలయంలోని అయిదో బ్లాక్ లో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు నూతనంగా రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై అవగాహన క్పలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ, ఏడేళ్లలో ఎన్నడూ నిర్వహించని హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం తమ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనమన్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి రాష్ట్ర స్థాయిలో,, ప్రతి మూడు నెలలకొకసారి జిల్లా స్థాయి హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశల మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) రూపొందించామన్నారు. ఈ SOP కింద అట్రాసిటీ కేసుల త్వరిగతంగా దర్యాప్తు చేయడానికి టైమ్ లైన్ పొందుపర్చారన్నారు. 

తదుపరి సమావేశానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు...

రాష్ట్ర స్థాయి హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైపవర్ కమిటీ సమావేశాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశాల్లోనూ హాజరుకావాలని కోరారు. ఆగస్టులో జరగబోయే రాష్ట్ర స్థాయి హై పవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారని మంత్రి పినిపి విశ్వరూప్ తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో నిర్లక్ష్యం చూపే పోలీసు అధికారులను క్షమించేది లేదని స్పష్టం చేశారు. అట్రాసిటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అట్రాసిటీ చట్టం వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారంటూ హోం మంత్రి కొనియాడారు. హత్య, అత్యాచారానికి గురయ్యే బాధితులకు, బాధిత కుటుంబ సభ్యులకు తక్షణ సాయంతో పాటు న్యాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రూ.5 వేల బేసిక్ పెన్షన్, ఉద్యోగం, ఆర్థిక సాయం, వ్యవసాయ భూమి, గృహ సదుపాయంతో పాటు ఉచిత విద్య కూడా ప్రభుత్వం అందిస్తూ  బాధితులకు అండగా ఉంటోందన్నారు. కేసు దర్యాప్తు, పురోగతిపై ఎప్పటికప్పుడు బాధితులకు ఎస్ఎంఎస్ ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారమందిస్తామన్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, జిల్లా స్థాయి హైపవర్ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సమావేశాలకు మంత్రులు కూడా హాజరుకావాలని కోరారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధితో ప్రజలకు తెలుస్తుందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) ఎంతో ఉపయోగపడుతుందన్నారు. SOP ని రూపొందించిన అధికారులను ఆయన అభినందించారు. దేశానికే ఆదర్శంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) నిలుస్తుందని కొనియాడారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత మాట్లాడుతూ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు వేగవంతమవుతుందన్నారు. ఇందుకోసం టైమ్ లైన్ రూపొందించామన్నారు. 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు బాధితులకు 7 రోజుల్లో ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నామన్నారు. 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించామన్నారు. కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ల ద్వారా బాధితులకు సమాచారమందిస్తామన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో క్రైమ్ రేట్ 13 శాతం తగ్గిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ చట్టం కింద నిందితులుగా ఉన్న వారు తమ డిపార్టుమెంట్ కు చెందిన వారైనా వదలిపెట్టడం లేదన్నారు. ఈ చట్టం కింద ఇటీవల ఇద్దరు ఎస్ ఐలు, ఒక సీఐపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద దర్యాప్తును 38 రోజుల్లో పూర్తి చేస్తున్నామన్నారు. బాధితులకు తక్షణ న్యాయమందించాలన్నదే తమ ధ్యేయమన్నారు. 

 ఉద్వేగ్నానికి గురైన ఎమ్మెల్యే పద్మావతి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులో భాగంగా రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఎస్సీ, ఎస్సీలపై దాడులు, అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి దురాగతాలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP) అడ్డుకట్ట వేస్తుందని, అదే సమయంలో బాధిత కుటుంబాలకు న్యాయం త్వరితగతిన అందుతుందని అభిప్రాయపడ్డారు. అట్రాసిటీ చట్టంపై ప్రజల్లో అవగాహనకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేసు నమోదులో నిర్లక్ష్యం చూపే పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురంలో జోగిని, మాతంగి వ్యవస్థ పేరుతో ఎస్సీ మహిళలను బలిపశువులు చేస్తున్నారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది సంవత్సరాల  వయస్సు కలిగిన బాలికలను సైతం జోగిని, మాతంగిలుగా మారుస్తున్నారంటూ ఉద్వేగానికి గురయ్యారు. వయస్సు మళ్లిన వారు గ్రామాల్లో యాచక వృత్తితో కాలం గడుతున్నారన్నారు. జోగిని, మాతంగి వ్యవస్థలకు అడ్డుకట్టకు ఒక వైపు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూనే, మరో వైపు ఆ వ్యవస్థలను ప్రోత్సాహిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. 

ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments