నైపుణ్యం' మరింత వికసించాలి : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి



'నైపుణ్యం'  మరింత వికసించాలి : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి



*నైపుణ్య వికాసంపై ఇంపాక్ట్ స్టడీ చేయాలని మంత్రి ఆదేశం*


*కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణకు దిశానిర్దేశం*


*నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులతో పర్యవేక్షణకై నోడల్ ఏజెన్సీ ఏర్పాటుకు చర్యలు*


*రాబోయే ఐదేళ్ల లక్ష్యాలను అందుకోవడానికి మిషన్ ఏర్పాటుకు శ్రీకారం*




అమరావతి, ఏప్రిల్, 01  (ప్రజా అమరావతి); నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఒక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  మారుమూల గ్రామలు, ఏజెన్సీలలోని సాంఘిక, గిరిజన రెసిడెన్షియల్  పాఠశాలలలో విద్యనభ్యసించే చిన్నారులకు ఆ స్థాయి నుంచే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్నాన్ని అందించే నైపుణ్య వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా పర్యవేక్షణ ఉండాలని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలోని ఐ.టీ సమావేశమందిరంలో 'నైపుణ్య వికాసం' కార్యక్రమంపై ఆయన సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్, ఐ.టీ, కంప్యూటేషనల్ థింకింగ్ వంటి అంశాలపై శిక్షణ కోసం అమలు జరుగుతున్న ఈ కార్యక్రమం అమలు జరిగిన తీరుపై మంత్రి ప్రత్యేకంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూడు శాఖలు సమన్వయం చేసుకుంటూ నైపుణ్య వికాసం గురించి ఇంపాక్ట్ స్టడీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆ నివేదిక ఆధారంగా నైపుణ్య వికాసాన్ని నలుమూలలా వికసించేలా చేయడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేయవలసిన నోడల్ ఏజెన్సీ గురించి కీలక సూచనలిచ్చారు. ప్రతి శాఖలోని ఒక అధికారిని ఏజెన్సీలో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అమలులో క్షేత్రస్థాయిలో జరిగిన  ఇబ్బందుల గురించి మంత్రికి సంబంధిత శాఖల అధికారులు మంత్రికి వివరించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను మార్చే నైపుణ్య వికాసం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. శిక్షణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే పలు సూచనలు తెలిపారు.



*రాబోయే ఐదేళ్ల లక్ష్యాలను అందుకోవడానికి మిషన్ ఏర్పాటు : మంత్రి గౌతమ్ రెడ్డి*


అనంతరం సచివాలయంలోని ఐ.టీ సమావేశ మందిరంలోనే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన   ఓమ్ క్యాప్ బోర్డు సమావేశం జరిగింది. రాబోయే ఐదేళ్లకు తగ్గట్లు ఒక లక్ష్యంతో కూడిన మిషన్ ను రూపొందించాలని మంత్రి మేకపాటి బోర్డు సభ్యులకు ఆదేశాలిచ్చారు. ఉపాధి అవకాశాలు, నియామకాలు, ఆదాయం, వ్యయం సహా గత రెండేళ్లలో అందించిన ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపై మంత్రి సమీక్షించినట్లు తెలిసింది.  రాబోయే ఏడాదిలో అందుకోవాలసిన అంచనాలను, అందుకు చేపట్టవలసిన చర్యలకు సంబంధించి మంత్రి మేకపాటి అధికారులకు ఆదేశాలిచ్చారని సమాచారం.


 సమీక్షకు హాజరైన ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ బోర్డు సభ్యులు ఆర్.సీ.ఎమ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే , సాంఘిక సంక్షేమ శాఖ  కమిషనర్ సునీత అగర్వాల్ , ఏపీఎస్ సీసీఎఫ్ సీఎల్ ఎండీ శామ్యూల్ ఆనంద్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Comments