కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:



కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాల్టీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్ల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:




*మనం పాలకులం కాదు.. మనం సేవకులం మాత్రమే*

*దీన్ని గుర్తించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను*

*ఎదిగే కొద్దీ ఒదగాలి, అర్జీలతో వచ్చే వారితో మాట్లాడాలి*

*మనం వ్యవహరించే తీరు అభిమానాన్ని పెంచుతుంది*

*అది ఎప్పుడూ గుర్తుండి పోతుంది*

*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి*

*ఈరోజు ఒక తిరుగులేని నమ్మకం ప్రజలు మనపై ఉంచారు*

*దానికి నిదర్శనమే, ఈరోజు మనం గెల్చి ఇక్కడ ఏకం కావడం*

*ఈ విజయంతో మన బాధ్యత మరింత పెరుగుతుంది*

*దీన్ని మనలో ప్రతి ఒక్కరూ గుర్తించాలి*

*86 పదవుల్లో సామాజిక న్యాయాన్ని ప్రజలకు చూపించగలిగాం*

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక పదవులు ఇచ్చాం*

*అక్క చెల్లెమ్మలకూ 61 శాతం ఎక్కువ పదవులు ఇచ్చాం*

*ఈరోజు పరిశుభ్రతకు టాప్‌ ప్రయారిటీ ఇస్తున్నాం*

*రెండో ప్రయారిటీ రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి ఆ నీరు*

*ఇక్కడ మీకు ఒకటే విజ్ఞప్తి, అవినీతికి దూరం కావాలి*

*ఎక్కడా వివక్ష ఉండకూడదు, కాబట్టి సే నో టు కరప్షన్‌*


*మేయర్లు, ఛైర్‌పర్సన్ల వర్క్‌షాప్‌లో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


విజయవాడ (ప్రజా అమరావతి):


*కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.*


*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:*


*బాధ్యత పెరిగింది:*

‘కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడికి  ముందుగా నా అభినందనలు. 

రాష్ట్ర స్థానిక సంస్థల చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎవ్వరూ ప్రశ్నించలేని విధంగా, ఏకపక్షంగా దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో ఈరోజు ఒక తిరుగులేని నమ్మకం ప్రజలు మనపై ఉంచారన్న దానికి నిదర్శనమే, ఈరోజు మనం గెల్చి ఇక్కడ ఏకం కావడం. ఈ విజయంతో మన బాధ్యత మరింత పెరుగుతుందని అందరూ గుర్తించాలి’.


*సామాజిక న్యాయం చూపించాం:*

‘ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ మొత్తం 87 చోట్ల ఎన్నికలు జరిగితే, ఏలూరు కార్పొరేషన్‌లో మాత్రం కోర్టు ఆదేశంతో కౌంటింగ్‌  జరగలేదు. మిగతా 86 పదవుల్లో గతంలో లేని విధంగా సామాజిక న్యాయాన్ని ప్రజలకు చూపించగలిగాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చట్టం ప్రకారం 45 పదవులు ఇవ్వాల్సి ఉంటే, ఏకంగా 67 పదవులు.. అంటే 78 శాతం కేవలం అణగారిన వర్గాలకు ఇవ్వడం గర్వకారణం.

ఇక అక్క చెల్లెమ్మలకు చట్టం ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సి ఉంటే, అక్షరాలా 52 పదవులు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. అంటే 61 శాతం దేవుడి దయతో ఇవ్వగలిగాం’.

‘మామూలుగా ఎన్నికలకు పోయే వరకు సామాజిక న్యాయం, అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరిగిందంటారు. మేనిఫెస్టో విడుదల చేస్తారు. కానీ ఎన్నికల తర్వాత అవన్నీ పక్కన పెట్టడం, అక్క చెల్లెమ్మలను పట్టించుకోకపోవడం, మేనిఫెస్టోలు చెత్తబుట్టలోకి పోవడం చూశాం.

కానీ ఇవాళ అందుకు భిన్నంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని చోట్ల, సామాజిక న్యాయంతో పాటు, అక్క చెల్లెమ్మలకు పెద్ద పీట వేయడం చూస్తున్నాం’.


*సేవకులం మాత్రమే:*

‘ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారు? వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు? మీలో ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద పూర్తి అవగాహనతో ఉండే ఉంటారు. మనం పాలకులం కాదు. మనం సేవకులం మాత్రమే అని గుర్తించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎదిగే కొద్దీ ఒదగాలి. అప్పుడు మన దగ్గరకు వచ్చే వారితో మనం మాట్లాడే తీరు, వ్యవహరించే తీరు అభిమానాన్ని పెంచుతుంది. అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది’.


*భరోసా కల్పించాలి:*

‘ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పురపాలక పరిపాలన – పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, ఆ శాఖ మంత్రిని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ రెండు రోజుల కార్యక్రమం మీకు ఎంతగానో ఉపయోగపడిందని భావిస్తున్నాను. మీ సందేహాలు నివృత్తి చేసి ఉంటారని అనుకుంటున్నాను’.

‘రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో ఉన్న జనాభా 1.43 కోట్లు. ఇది మొత్తం జనాభాలో దాదాపు 30 శాతం. అంటే ఇంత పెద్ద జనాభాకు మీరు ప్రతినిధులు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. పట్టణాలు, నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుతాయన్న భరోసా మనం కల్పించాలి’.


*పరిశుభ్రత–తాగునీరు:*

‘ఈరోజు పరిశుభ్రతకు టాప్‌ ప్రయారిటీ ఇస్తున్నాం. దీని గురించి మీకు చెప్పే ఉంటారు. జూలై 8న కార్యక్రమం ప్రారంభం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి వార్డుకు 2 వాహనాల చొప్పున రాష్ట్రమంతా మొత్తం 8 వేల వాహనాలు కేటాయిస్తున్నాం. ప్రతి ఇంటికి రకరకాల చెత్తబుట్టలు ఇవ్వడం, ఆ చెత్తను ఎలా డిస్పోస్‌ చేస్తామన్నది కూడా చెబుతాం. పరిశుభ్రతకు అంత టాప్‌ ప్రయారిటీ ఇస్తున్నాం. ఆ తర్వాత రెండో ప్రయారిటీ రక్షిత తాగునీరు, అది ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి మున్సిపాలిటీలో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చే పనులు చేపడుతున్నాం. ఇప్పటికే 50 మున్సిపాలిటీలలో ఏఐఐబి ద్వారా పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల కూడా త్వరలోనే పనులు మొదలు పెడతాం’.


*సే నో టు కరప్షన్‌:*

‘ఇంకో గొప్ప కార్యక్రమం ఇప్పటికే జరిగింది ఏమంటే.. ప్రతి గడప వద్దకు ప్రభుత్వ సేవలందించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ. ఇప్పటికే మీరు చూసి ఉంటారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఎలా పని చేస్తున్నాయని? అలాగే వలంటీర్లు కూడా ఎలా పని చేస్తున్నారో? ఇక్కడ మీకు ఒకటే విజ్ఞప్తి. అవినీతికి దూరం కావాలి. ఎక్కడా వివక్ష ఉండకూడదు. కాబట్టి సే నో టు కరప్షన్‌. అలాగే మనకు ఓటు వేయకపోయినా సరే, అర్హత ఉంటే ప్రభుత్వ పథకం అందించాలి. ఈ రెండూ మాత్రం కచ్చితంగా, ఎందుకంటే మీరు బాధ్యత కలిగిన స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి గుర్తు పెట్టుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండే మనకు రేపు శ్రీరామరక్ష అవుతాయని తెలియజేస్తున్నాను’.


*సూచనలు చేయండి:*

‘గ్రామ సచివాలయ వ్యవస్థ. అక్కడ 540 రకాల సేవలు అందిస్తున్నారు. దాన్ని ఇంకా మెరుగుపర్చడం కోసం మీరు నిరంతరాయం సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎక్కడైనా ఇంకా మెరుగ్గా చేయొచ్చు. ఇక్కడ మారిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే సూచించండి. సీఎం ఆఫీసుకు అవి తెలియజేసేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తాం’.


*లేఅవుట్లలో వసతులు:*

‘మున్సిపాలిటీలో చేపట్టబోయే మరో గొప్ప కార్యక్రమం. ఇప్పటికే పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చాం. మొత్తం 17 వేల లేఅవుట్లలో 16 వేలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా, వదిలేస్తే మురికివాడలుగా మారిపోతాయి. లేదా వాటిని పట్టించుకుంటే, దేశం మొత్తం మనవైపు చూసేలా, కాలనీలను అభివృద్ధి చేయొచ్చు. అందమైన కాలనీలు, అక్కడ ఉన్న వాళ్లను సంతోష పెట్టే విధంగా చేయొచ్చు. ఈ రెండో ఆప్షన్‌పై అందరూ పనిచేయాలని కోరుతున్నాను’.

‘ఆ కాలనీలు, లే అవుట్లలో ఫుట్‌పాత్‌లు, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్‌ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్‌ బస్టాండ్‌లు ఉంటాయి. సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కూడా.  తొలిసారిగా భూగర్భ కేబుళ్లు వేయబోతున్నాం. ఆ స్థాయిలో మనమంతా కలిసికట్టుగా దగ్గరుండి వాటిని అభివృద్ధి చేయబోతున్నాం’.


*వారికీ ఇళ్ల స్థలాలు:*

‘ఇవి కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఎంఐజీ, అంటే మధ్య తరగతి ప్రజలకు, ఎలాంటి లిటిగేషన్‌ లేని, ప్రభుత్వం ఎటువంటి లాభాపేక్ష లేకుండా, తక్కువ« ధరకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ మేరకు జిల్లా కేంద్రాలు, పెద్ద మున్సిపాలిటీలు ఒక్కో చోట 50 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు భూమి సేకరించి, లాభాపేక్ష లేకుండా ప్లాటింగ్‌ చేసి, లీగల్‌ సమస్యలు లేకుండా పట్టాలు ఇవ్వడం. ఇక్కడ కూడా మోడల్‌ లేఅవుట్లు తయారవుతాయి. ఇక్కడా ఫుట్‌పాత్‌లు, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్‌ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్‌ బస్టాండ్‌లు ఉంటాయి. కుటుంబానికి ఒకటి ఇవ్వబోతున్నాం. సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కూడా’.


*22 నెలలుగా నవరత్నాల పాలన:*

‘ఇక మీ అందరికీ తెలుసు. మనందరి ప్రభుత్వం గత 22 నెలలుగా నవరత్నాల పాలన అందిస్తోంది. ఎక్కడా వివక్ష, లంచానికి తావు లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందించే కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈ 22 నెలల కాలంలో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాల ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో ఉంచామని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎక్కడా అవినీతి లేదు. వివక్ష లేదు. అర్హత ఉన్న వారందరికి అందించాం. ప్రతి చోటా సోషల్‌ ఆడిటింగ్‌ చేసి జాబితాలు ప్రదర్శించాం. దేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాం. ఈ 22 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది’.


*నాడు–నేడు, ఆర్బీకేలు:*

‘శిధిలావస్థకు చేరిన స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. నాడు–నేడు తో ఆ మార్పులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూళ్లుగా మారబోతున్నాయి. ఇంకా శిధిలావస్థలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు కూడా నాడు–నేడుతో పూర్తిగా మారబోతున్నాయి. అవన్నీ ఇప్పటికే మన కళ్ల ఎదుట కనిపిస్తున్నాయి. వార్డు స్థాయిలో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నిర్మాణం కూడా మీ కళ్ల ఎదుటే కనిపిస్తోంది’.

‘నాడు–నేడుతో స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మార్చడంతో పాటు, చివరకు గ్రామాల్లో రైతులకు ప్రతి అడుగులో అండగా నిల్చేలా, వారికి ఎంతో చేయూతనిచ్చేలా, రైతులు ఏ అవసరాలకూ ఊరు దాటి పోవాల్సిన అవసరం లేకుండా, ఊళ్లోనే అన్ని సదుపాయాలు.. విత్తనం మొదలు పంట కొనుగోలు వరకు అదే ఊళ్లో సేవలందించే రైతు భరోసా కేంద్రాల స్థాపన. ఇవన్నీ మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి’.


*మీ రాకతో వ్యవస్థలో..:*

‘దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా ఈ 22 నెలల కాలంలో చేయగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వ్యవస్థలోకి మీరందరూ రావడం వల్ల ఇంకా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ, దేవుడి దయ మీ పట్ల సదా ఉండాలని, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతూ, ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ ప్రసంగం ముగించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లలో ఒక స్ఫూర్తిని నింపారు.


ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని),  దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,  మున్సిపల్‌ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు,రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments