కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:


అమరావతి (ప్రజా అమరావతి);


కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:



*ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు*

*ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి*

*అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలి*

*టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలి*

*కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలి*

*అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలి*

*కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు*

*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశం*

*కోవిడ్‌ ఆస్పత్రుల వద్దనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి*

*తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో సీసీసీలు* 

*అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు ఆ సీసీసీలో సేవలందిస్తారు*

*కోవిడ్‌ ఆస్పత్రుల్లో క్వాలిటీ ఫుడ్, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్‌ కేర్, వైద్యుల అందుబాటు.. ఈ అయిదూ తప్పనిసరి*

*తగినంత ఆక్సీజన్‌ సరఫరా, నిల్వ కోసం చర్యలు చేపట్టండి*

*కేంద్రం కేటాయింపుతో పాటు, ప్రత్యామ్నాయంపైనా దృష్టి*

*టీచింగ్‌ ఆస్పత్రుల వద్ద 10 కెఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1కెఎల్‌ ఆక్సీజన్‌ నిల్వ ఉండాలి*. *వీలైనంత త్వరగా ఆ ఏర్పాట్లు చేయండి*

*కోవిడ్‌–19 నియంత్రణ, నివారణపై సమీక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


*సమీక్ష సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..*:


*బెడ్లు మరిన్ని పెంచండి*:

మనం రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నాము. మన రికార్డులను మనమే బద్ధలు కొడుతున్నాము. 

కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచండి.

ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా చేర్చుకోవాలి.

తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి.

కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలి.

అందుకోసం ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేసి, వాటిలో సగం బెడ్లు మీరే కేటాయించండి.

కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. ఇందులో ఎక్కడా తేడా రాకూడదు.

ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా, అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలి.


*బెడ్లపై స్పష్టత*:

ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నది పూర్తి క్లారిటీ ఉండాలి.

దాని వల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నామన్నది మనకు స్పష్టత వస్తుంది.

అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఉన్నాయన్న దానిపై మనకు పూర్తి స్పష్టత ఉంటుంది. 

ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుంది.

ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్లు. ప్రైవేటు ఆస్పత్రుల బెడ్లు. ఎన్నెన్ని అన్నదానిపై స్పష్టత వస్తుంది. 


*ఉచితంగా వైద్యం*:

104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుంది.

వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలి. ఇది ప్రక్రియ.

ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. 

కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. 


*ఆస్పత్రుల వద్దే సీసీసీ*:

అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 

ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవలందిస్తారు. 

అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.


*ఆస్పత్రులు–బెడ్లు*: 

రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు. 349 కార్పొరేట్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 47  కార్పొరేట్‌ టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 94 ప్రైవేట్‌ కేటగిరీ ఆస్పత్రులు. 

ఆ విధంగా మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 ఉండగా, వాటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నారు. మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.


*ఈ అయిదు తప్పనిసరి*:

అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్‌ బాగుండాలి. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలి.

శానిటేషన్, క్వాలిటీ ఫుడ్, డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ 5 మనకు చాలా ముఖ్యం.

వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు జరగాలి.


*ఆక్సీజన్‌*:

ఆక్సీజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు. ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయండి. 

కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సీజన్‌ సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించండి. 

ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కెఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ సామర్థ్యంతో ఆక్సీజన్‌ స్టోరేజీ ఉండాలి. వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలి.

మనకు రోజుకు 500 టన్నుల ఆక్సీజన్‌ కావాలంటే, ఏం చేయాలన్నది ఆలోచించండి. సరఫరా. నిల్వ ఎలా అన్నది చూడండి.


*104 కాల్‌ సెంటర్‌*:

104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన వారికి పూర్తి సహాయ, సహకారాలు అందించాలి. 

గతంలో నిర్దేశించుకున్న మాదిరిగా 3 గంటల్లో బెడ్లు కేటాయించాలి. ఎక్కడైనా అంత కంటే ఆలస్యం అవుతుంటే, కారణాలు విశ్లేషించి, తగిన చర్యలు తీసుకోవాలి.


కాగా, రాష్ట్రంలో కోవిడ్‌ ప్రస్తుత పరిస్థితి, వాక్సినేషన్‌ ప్రక్రియపై సమావేశంలో అధికారులు వివరించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 88 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 44,236 బెడ్లు ఉండగా, ఆ సెంటర్లలో 13,356 మంది ఉంటున్నారని అధికారులు వెల్లడించారు, ఈ ఏడాది ఇప్పటి వరకు 16,981 మంది సిబ్బందిని నియమించామని, వారిలో వైద్య నిపుణులు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓలు, స్వీపర్లు ఉన్నారని వారు తెలిపారు. 

ఇక కోవిడ్‌ ఆస్పత్రుల్లో రోజుకు 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల వినియోగిస్తుండగా, అది ఈనెల 15 నాటికి 1000 మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నామని మరోవైపు మన దగ్గర 515 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే ఉందని వారు పేర్కొన్నారు. ఆక్సీజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌నే దృష్టిలో ఉంచుకుని శ్రీపెరంబుదూరు నుంచి రోజుకు 200 టన్నులు, బళ్ళారి నుంచి మరో 200 మెట్రిక్‌ టన్నుల సరఫరాతో పాటు, ఒడిషా నుంచి తరలించడానికి ట్యాంకర్లు కావాలని కేంద్రాన్ని కోరుతున్నామని అధికారులు వివరించారు.

ఇక కోవిడ్‌ వాక్సిన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 12 లక్షల మందికి రెండు డోసులు, 42 లక్షల మందికి సింగిల్‌ డోస్‌ ఇవ్వడం జరిగిందని, ఆ విధంగా మొత్తం 66 లక్షల వాక్సీన్లు ఇచ్చినట్లు సమీక్షా సమావేశంలో అధికారులు తెలిపారు.


డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌  డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Comments