ఆదోని ప్రజల కల సాకారమౌ తున్న వేళ



ఆదోని ప్రజల కల సాకారమౌ తున్న వేళ 


*రేపు (31-05-2021) ఆదోనిలో వైద్య కళాశాలకు శంకుస్థాపన :-*


కర్నూలు, మే 30 (ప్రజా అమరావతి);


*కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదోని డివిజన్ పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు ఏర్పాటు చేయాలని, ఆధునిక సౌకర్యాలతో పెద్దాసుపత్రి కావాలని ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలం నుంచి కోరుతున్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వైయస్ జగన్ మోహన్ రెడ్డి చలవతో తమ కోరిక నెరవేరడం పట్ల ఆదోని ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.*


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఆరు దశాబ్దాల కాలంలో 11 వైద్య కళాశాలల ఏర్పాటైతే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్ల కాలంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ పేదలందరికీ మెరుగైన వైద్య సదుపాయం కోసం 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం ఒకే సారి ఇన్ని వైద్య కళాశాలలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం దేశంలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోనుంది. దీనివల్ల స్పెషాలిటీ వైద్యాన్ని రాష్ట్రం నలుమూలలకూ విస్తరించడంతో పాటు వేలాది ఎంబీబీఎస్‌ సీట్లు, నిరుద్యోగ వైద్యులకు ఉద్యోగాల కల్పన వంటి బహుళ ప్రయోజనాలు రాష్ట్రానికి కలుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుండగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయింది.* 


*ఈ నెల 31వ తేదీన 14 వైద్య కళాశాలల పనులకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంఖుస్థాపన చేయనున్నారు.*


*ఆదోని - ఎమ్మిగనూరు జాతీయ రహదారి 167  పక్కన ఆరెకల్ విలేజ్ వద్ద 58.44 ఎకరాల విస్తీర్ణంలో రూ. 475 కోట్లతో మెడికల్ కాలేజిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. ఇటు ఎమ్మిగనూరు నుంచి 18 కిలోమీటర్లు అటు ఆదోని నుంచి 9 కిలోమీటర్ల పరిధిలో మెడికల్ కాలేజీలో నిర్మించబోతున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు జరుగుతుంది.  రోడ్డు ప్రమాదాలు, డెలివరీలు, అత్యవసర పరిస్థితుల్లో కర్నూలుకు పంపించే పరిస్థితుల నుండి ఈ ప్రాంతవాసులు బయటపడనున్నారు. ఆదోనిలో వైద్య కళాశాల, ఆసుపత్రి  ఏర్పాటు చేయడం ఎంతో శుభ సూచకం.*


*ఆదోని - ఎమ్మిగనూరు జాతీయ రహదారి 167  పక్కన ఆరెకల్ విలేజ్ సమీపంలో మెడికల్ కళాశాల నిర్మాణం కోసం 58.44 ఎకరాల భూమిని సేకరించి 18 మంది రైతులకు 23 కోట్ల 37 లక్షల 60 వేల రూపాయలు పరిహారం ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 58.44 ఎకరాల స్థలంలో రూ.475 కోట్లతో వైద్య కళాశాల రూపు దిద్దుకోబోతోంది.*


*అత్యాధునిక వసతులు ఇలా ...*


*ఈ సముదాయంలో బోధన ఆసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, వసతి గృహాలు, డాక్టర్ల క్వార్టర్లతో పాటు అతిథిగృహం, సెంట్రల్ డ్రగ్ స్టోర్, బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్ రూమ్, మెడికల్‌ గ్యాస్‌ పైప్‌లైన్ల, ఆక్సిజన్‌ స్టోరేజీ ట్యాంకులతో పాటు ఆక్సిజన్‌ జనరేటెడ్‌ ప్లాంట్ల నిర్మాణం, ఓపెన్ ఎయిర్ థియేటర్ మొదలైన భవనాలను కూడా నిర్మిస్తారు.*



Comments