ప్రజల ప్రాణాలే ముఖ్యం
*ఆక్సిజన్ కొరత లేకుండా నిరంతర పర్యవేక్షణ*
*రెమిడిసివర్ ఇంజక్షన్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు*
*ప్రైవేటు ఆస్పత్రులకూ ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం*
*నోడల్ ఆఫీసర్లూ కష్టపడి పనిచేస్తున్నారు*
*అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు*
*టిడ్కోలో ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకురావాలి*
*చికిత్స సామర్థ్యాన్ని 400 బెడ్లకు పెంచాలి*
*అధికారులకు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని కీలక ఆదేశాలు*
*టిడ్కోలోని కోవిడ్ కేర్ సెంటర్ పరిశీలన*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);
స్థానిక టిడ్కోలోని కోవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఎమ్మెల్యే మంగళవారం సబ్కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్కుమార్, డీఎస్పీ విజయభాస్కర్ గార్లు మరియు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా రోగులకు ఏ కష్టం రాకుండా వైద్యం సవ్యంగా, సకాలంలో అందేందుకు ప్రభుత్వం ప్రతి ఆస్పత్రితోపాటు ఆక్సిజన్ సరఫరా కేంద్రాలకు కూడా నోడల్ అధికారులను నియమించిందని చెప్పారు. చిలకలూరిపేటలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు ఆక్సిజన్ కొరత రాకుండా చేసేందుకు తాను నిరంతరం నోడల్ అధికారులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కూడా అధికారులతో కలిసి కీలకంగా పనిచేస్తున్నామన్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత రాకుండా ఉండేలా డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో తాను మాట్లాడుతున్నానన్నారు. అన్ని ఆస్పత్రుల నోడల్ అధికారులు కరోనా రోగులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రులకు కావాల్సిన వైద్య సామగ్రిని తెప్పించడంలో నోడల్ అధికారులు కీలకంగా వ్యవహరించాలని చెప్పారు.
*అధికారులకు పలు ఆదేశాలు*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరిపేట పరిధిలో వాణజ్యపరంగా వాడుతున్న సిలిండర్లు మొత్తాన్ని అధికారులు సేకరించాలని చెప్పారు. ఆయా సిలిండర్లను అన్ని ఆస్పత్రులకు తాత్కాలికంగా అందజేయాలని తెలిపారు. ఈ సిలిండర్లను రోగులకు ఆక్సిజన్ అందించేందుకు వినియోగించేలా చూడాలని కోరారు. సిలిండర్ల సేకరణ బాధ్యతను సబ్కలెక్టర్కు ఇచ్చారు. టిడ్కోలోని కోవిడ్ కేర్ సెంటర్లో ప్రస్తుతం 225 బెడ్లు ఉన్నాయని, వీటి సంఖ్యను 400 కు పెంచాలని ఆదేశించారు. కనీసం 50 ఆక్సిజన్ బెడ్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా నిర్థారణ పరీక్షల కోసం ప్రత్యేకంగా కిట్లు తెప్పించాలన్నారు. రోగులకు అందుతున్న భోజనం విషయం లో రాజీ పడొద్దని, మంచి ఆహారాన్ని అందించాలని సూచించారు. టిడ్కోలోని కోవిడ్ చికిత్సా కేంద్రంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో చిలకలూరిపేట ఇంచార్జి తహసీల్దార్ రవికుమార్,ఎడ్లపాడు తహశీల్దార్ శ్రీనివాసరావు, నాదెండ్ల తహశీల్దార్ మల్లిఖార్జున, ఇంచార్జి కమిషనర్ ఫణీంద్ర, డీఈఈ అబ్దుల్ రహీం,అర్బన్ సీఐ బిలాలుద్దీన్, రూరల్ సీఐ సుబ్బారావు,అర్బన్ యస్.ఐ అజయ్,డాక్టర్ గోపి నాయక్, మెడికల్ సిబ్బంది,మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు,కౌన్సిలర్ విడదల గోపి,పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు మరియు పలువురు ఉన్నారు.
addComments
Post a Comment