ఎపి కోవిడ్ కమాండ్ కంట్రోల్, విజయవాడ (ప్రజా అమరావతి);
సోషల్ మీడియాలో విస్తృతంగా 'కోవిడ్' ప్రచారం
# కొవిడ్ స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ వెల్లడి
# ఫేస్బుక్ పేజీకి 1,63,704 ఫాలోయర్స్
కోవిడ్ -19కు సంబంధించిన సమాచారంతో ప్రజల్ని చైతన్యపర్చేందుకు వాట్సప్ తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు ఎపి కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫేస్బుక్ @ArogyaAndhra అనే పేరుతో అధికారిక పేజీని ప్రారంభించామనీ , ఈ పేజీకి ప్రస్తుతం 1,63,704 మందికి పైగా ఫాలోయర్స్ వున్నారన్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఇదే తరహా ఫేస్బుక్ పేజీలకు గుజరాత్ లో 25,564 మంది, తమిళనాడులో 7,953 మంది, తెలంగాణాలో 13,613 మంది, కర్నాటకలో 1,03,077 మంది, కేరళలో 1,17,544 మంది, ఒడిషాలో 89,068 మంది ఫాలోయర్స్ వున్నట్లు ఆయన వివరించారు. కోవిడ్ ప్రచారంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విస్తృతంగా పాల్గొంటున్నట్లు గుర్తించిన ఫేస్బుక్ యాజమాన్యం ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ సమయంలో వాణిజ్య ప్రకటనలకు అనుమతిస్తూ దాదాపు 20 వేల డాలర్ల మేర ఆర్థిక సహకారాన్ని అందిస్తోందని ఆయన వెల్లడించారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా దాదాపు 15000 డాలర్ల మేర వాణిజ్య ప్రకటనలను అనుమతించటం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందచేసిందన్నారు. దీనితో పాటు ప్రస్తుతం ఏపీలో వున్న 20 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ను చేరేందుకు వీలుగా కరోనా అప్రమత్తత హెచ్చరికలు జారీకి ఫేస్బుక్ యాజమాన్యం వీలు కల్పించిందని ఆయ పేర్కొన్నారు. మన దేశంలో ఫేస్బుక్ యాజమాన్యం ఏపీతో పాటు కర్నాటకకు మాత్రమే ఈ తరహా వెసులు బాటు కల్పించిందన్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన కంటెంట్ డెవలెప్మెంట్ తో పాటు వారి ఫేస్బుక్ మార్కెటింగ్ భాగస్వాముల ద్వారా వాణిజ్య ప్రకటనలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తున్నారని శ్రీకాంత్ తెలిపారు.
addComments
Post a Comment