ఇప్పుడాయన కల గుడివాడలో ప్రభుత్వ మెడికల్ కళాశాల




- ఇప్పుడాయన కల గుడివాడలో ప్రభుత్వ మెడికల్ కళాశాల 

- నియోజకవర్గంలో పేదల కోసం 450 ఎకరాలు 

- మధ్యతరగతి కోసం మరో 400 ఎకరాల భూములు 

- రూ. 300 కోట్లతో మూడు మండలాలకు మల్టీవిలేజ్ స్కీం 

- రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.200 కోట్ల మంజూరు 

- గుడివాడలో జిల్లా ప్రభుత్వాసుపత్రి ఏర్పాటుకు చర్యలు 

- అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న మంత్రి కొడాలి నాని 



గుడివాడ, జూన్ 7 (ప్రజా అమరావతి)


: కృష్ణాజిల్లా గుడివాడలో ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కలగా కన్పిస్తోంది. గత 15 ఏళ్ళలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చినా ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అయినా ఆయనలోని పోరాట పటిమ తగ్గలేదు. 2019 లో నాల్గవసారి కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించి సీఎం జగన్మోహనరెడ్డి కేబినెట్ లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. 2004 లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే నాటికి గుడివాడ నియోజకవర్గాన్ని ఇళ్ళస్థలాల సమస్య పట్టి పీడిస్తోంది. 2007 వరకు అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తూ వచ్చారు. చివరకు గుడివాడ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చి వచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ గుడివాడలో ఇళ్ళస్థలాల సమస్య ఉందని గుర్తించిన దివంగత రాజశేఖరరెడ్డి 2008 లో గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలో 77 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ఎన్టీఆర్ అంటేనే అభిమానం చూపే కొడాలి నాని వైఎస్సార్ పై కూడా అభిమానాన్ని పెంచుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయాననే అసంతృప్తి మాత్రం కొడాలి నానిలో కన్పిస్తూ వచ్చేది. అయినప్పటికీ గుడివాడ ప్రజలు మాత్రం ఆయన ఏ పార్టీలో నిలబడినా గుండెల్లో పెట్టుకుంటూ వస్తున్నారు. దేశ చరిత్రలో పేదల ఇళ్ళ కోసం ఒక్క నియోజకవర్గానికి 450 ఎకరాల భూమిని ఇచ్చిన దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, సీఎం జగన్మోహనరెడ్డిలు గుడివాడ నియోజకవర్గంలో పేదల కోసం 450 ఎకరాల భూమిని కేటాయించారని మంత్రి కొడాలి నాని గర్వంగా చెబుతున్నారు. గుడివాడ పట్టణంలోని పేదల కోసం 2008 లో దివంగత రాజశేఖరరెడ్డి 77 ఎకరాల భూములిస్తే, సీఎం జగన్మోహనరెడ్డి ఈ రెండేళ్ళ కాలంలో ఏకంగా 181 ఎకరాల భూములను కొనుగోలు చేయించారు. దివంగత రాజశేఖరరెడ్డి ఇచ్చిన 77 ఎకరాల్లో ప్రస్తుతం 8,912 టీడ్కో గృహాలను నిర్మిస్తున్నారు. మధ్యతరగతి ప్రజల కోసం గుడివాడ పట్టణంలో జగనన్న స్మార్ట్ టౌన్ లేఅవుటకు శ్రీకారం చుట్టారు. ఇందు కోసం దొండపాడు రోడ్డులో దాదాపు 400 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలతతో కలిసి పలుమార్లు సమావేశమై భూసేకరణ వంటి అంశాలపై కసరత్తును పూర్తిచేశారు. పట్టణ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరలకే ఫ్లాటు కేటాయించనున్నారు. లేఅవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి పరుస్తుందని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా లాటరీ పద్దతిన ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. రూ.300 కోట్లతో మల్టీవిలేజ్ స్కీంకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సిద్ధం చేశారు. ఈ రిపోర్ట్ ను ప్రభుత్వానికి కూడా పంపారు. గుడివాడ, పామర్రు నియోజకవర్గాల పరిధిలోని 68 గ్రామాలు, శివారు ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఇందు కోసం జనార్ధనపురం - పాములపాడు పంచాయతీ పరిధిలో 120 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. అక్కడే ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, పంప్ హౌస్, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్, సంప్ వెల్, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్, వాచ్ మెన్ క్వార్టర్స్ వంటివి నిర్మించనున్నారు. ఇక్కడే నీటిని శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా గుడివాడ రూరల్, నందివాడ, పెదపారుపూడి మండలాల్లోని 68 గ్రామ పంచాయతీలు, శివారు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. అక్కడి నుండి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందజేస్తారు. కెపాసిటీ చాలని గ్రామాల్లో 46 ట్యాంక్లను కూడా నిర్మించనున్నారు. 30 ఏళ్ళ వరకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ ప్రాజెక్టు డిజైన్ చేసినట్టు మంత్రి కొడాలి నాని వివరించారు. గుడివాడ - పామర్రు జాతీయ రహదారి పై ఉన్న గుడి వాడ - భీమవరం, గుడివాడ - మచిలీపట్నం రైల్వే ట్రాక్ పై రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతూ వస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి డిజైన్లను రూపొందిస్తున్నారు. కొద్దిరోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ఫైనల్ ఆర్డర్ రానుందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇదిలా ఉండగా మచిలీపట్నానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడంతో అక్కడ ఉన్న జిల్లా ప్రభుత్వాసుపత్రిని గుడివాడకు తీసుకువచ్చేందుకు మంత్రి కొడాలి నాని తీసుకున్న చర్యలు ఫలించాయి. సీఎం జగన్మోహనరెడ్డి కూడా ఇందుకు అంగీకరించడంతో గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం పరిధిలోని 181 ఎకరాల లేఅవుట్ లో దాదాపు 10 ఎకరాల భూమిని మంత్రి కొడాలి నాని సిద్ధం చేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న మంత్రి కొడాలి నాని తన కలను నిజం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు.

Comments