నెల్లూరు, జూలై 22(ప్రజా అమరావతి) :-- భూరికార్డుల స్వ చ్చీకరణ తో హక్కు దారులకు ఎంతో మేలు జరుగుతుంద
ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణ పథకం స్టీరింగ్ అమలు కమిటీ చైర్మన్ శ్రీ అజేయ్ కల్లాం పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఆయన రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ భూరికార్డుల కమిషనర్ శ్రీ సిద్ధార్థ జైన్, జిల్లా కలెక్టర్ శ్రీ కె వి యన్ చక్రధర్ బాబు లతో కలిసి వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణ పథకం సర్వే 2020 మీ భూమి మా హామీ పై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన భూ రికార్డులు లేక హక్కుదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ఓ చారిత్రాత్మక కార్యక్రమమన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆర్ఎస్ ఆర్ రికార్డులను సరి చేసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాల్లో వీలైనంతవరకూ భూ రికార్డుల స్వచ్చీకరణ తో తాజాగా రూపొందిస్తే హక్కుదారులకు ఎంతో భరోసా గా ఉంటుందన్నారు. సర్వే అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భూ వివాదాలు ఉండరాదని స్పష్టం చేశారు. ఈ సర్వే ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు. చుక్కల భూములు ప్రభుత్వ భూములు కావని స్పష్టం చేశారు.తమ వద్దకు పట్టా భూమా, రెవెన్యూ భూమా అని పరిష్కారం కోసం వచ్చినప్పుడు ప్రత్యేక చొరవ చూపి సరైనభూమి ఏమిటో తేల్చాలని అన్నారు. భూ రికార్డుల దిద్దుబాటుకు నెలల తరబడి హక్కుదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. వెబ్ లాండ్ సరిగా లేకపోతే హక్కుదారులు అమ్ముకోవాలి అంటే రిజిస్ట్రేషన్ జరిగేందుకు వీలు లేదన్నారు. చట్టానికి లోబడే భూరికార్డుల సర్వే జరిపి మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు భూ సర్వే రెవెన్యూ, సర్వే ఉద్యోగులకు ఓ సువర్ణ అవకాశమని ప్రత్యేక శ్రద్ధతో సానుకూల దృక్పథంతో భూ వివాదాల పరిష్కారానికి తమ వంతు కృషి చేయాలన్నారు. సర్వే జరిపేందుకు అవసరమయ్యే డ్రోన్లను డివిజన్కు ఒకటి చొప్పున సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ల పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. రికార్డుల డిజిటలైజేషన్ నిర్వహణ కోసం నిధులను త్వరలో విడుదల చేస్తామన్నారు. రికార్డు ప్రకారం భూములు ఉండాల్సిన అవసరం లేదని వాస్తవంగా ఉన్న భూముల ప్రకారం రికార్డులు తయారు చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలో భూ సర్వే సాఫీ గానే సాగుతోందని కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో డ్రోన్ ద్వారా 144 గ్రామాల్లో సర్వే చేసి ఎక్కువ సర్వే చేసిన జిల్లా గా నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసే నిమిత్తం సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీ న్యాయపరంగా కూడా ఆలోచించి భూ వివాదాలు పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల కమిషనర్ శ్రీ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి భూముల రీ సర్వే కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన భూమి రికార్డు రికార్డులు అవసరం ఎంతైనా ఉందన్నారు. దీంతో రైతులకు మేలు జరగడంతో పాటు పారదర్శకత కనిపించి, ఖర్చులు తగ్గుతాయన్నారు. భూ సర్వే వేగవంతం చేయడానికి ఏమేమి కావాలి, చట్టంలో లోటుపాట్లు ఏమేమి ఉన్నాయో రెవెన్యూ అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీ కె వి యన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో గూడూరు మండలంలోని రెడ్డిగుంట గ్రామాన్ని జిల్లా పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి చేసి 293.65 ఎకరాల్లో భూ సర్వే జరుగుతోందన్నారు జిల్లాలో డివిజన్ వారీగా నువ్వురుపాడు, యోగీశ్వరుల పల్లి , మారెళ్లపాడు, తిమ్మాజీ కండ్రిగ మొగులూరు పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. వారానికోసారి సంయుక్త కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తే భూ సర్వే కార్యక్రమం వేగవంతం అవుతుందన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ హరేందిర ప్రసాద్ జిల్లాలో చేపట్టిన భూ సర్వే కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సంయుక్త కలెక్టర్ శ్రీ విదేహ్ ఖరే, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, సి ఎం ఆర్ ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ తేజ భరత్, నెల్లూరు, కావలి ,గూడూరు, నాయుడుపేట,ఆత్మకూరు ఆర్ డి వో లు శ్రీ హుస్సేన్ సాహెబ్, శీన నాయక్, మురళి కృష్ణ , శ్రీమతి సరోజినీ , చైత్ర వర్షిని సర్వే భూరికార్డుల ఏడి హనుమంతరావు, డిపిఓ ధనలక్ష్మి, తహసీల్దార్లు, సర్వే అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment