తాడేపల్లి (ప్రజా అమరావతి);
–తెలుగుదేశం పార్టీ బిసిలను ఓటు బ్యాంకు గా వాడుకుని మోసం చేసింది.
–శ్రీ వైయస్ జగన్ బిసిలలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు.
–బిసి కులాలను అధ్యయనం చేసి మరీ 56 బిసి కార్పోరేషన్లను ఏర్పాటుచేశారు.
–బిసిలు శ్రీ వైయస్ జగన్ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని పైకి ఎదగాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబునాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ బిసిలను అన్ని విధాలుగా వాడుకుని మోసం చేసిందని,వారిని చంద్రబాబు అధికారానికి,అభివృధ్దికి దూరంగా ఉంచితే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ బిసిలలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ అభివృధ్ది పధంలోకి తీసుకువెళ్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముదిరాజ్ కులస్ధులకు సంబంధించిన రాష్ట్ర స్ధాయినేతల సమావేశం శనివారం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు బిసిలను అభివృధ్ది పరచాలనే ధ్యాస లేకుండా వారిని రాజకీయంగా,సామాజికంగా ఎదగనీయకుండా చేశారని అన్నారు. పైగా ఆదరణ అంటూ వారికి పనికిరాని పనిముట్లను ఇస్తూ ఇంకా వెనకబాటుతనం కొనసాగేలా చేశారని అన్నారు. అందులో కూడా కుంభకోణాలకు పాల్పడ్డారని అన్నారు. ఎన్టీఆర్ కొంతమేర బిసిలను ప్రోత్సహించారు. దానిని తనకు అనుకూలంగా మలచుకుని చంద్రబాబు బిసిలపై తనకేదో హక్కున్నట్లుగా ప్రవర్తిస్తూ వారిని మోసం చేస్తూ వచ్చారని విమర్శించారు.
వైయస్ రాజశేఖరెడ్డి హయాంలో బిసిలను ఆరోగ్యశ్రీ,ఫీజురీయంబర్స్ మెంట్ తదితర పధకాల ద్వారా అభివృద్ది పధంలోకి తీసుకువచ్చారు. రాజకీయంగా కూడా ప్రోత్సహించారని తెలిపారు. శ్రీ వైయస్ జగన్ గారు పాదయాత్రలో తనను కలిసిన బిసి కులాలు,వారి వృత్తులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత వాటిని అధ్యయనం చేసేందుకు ప్రతిపక్షంలో ఉండి జంగాకృష్ణమూర్తి నేతృత్వంలో అధ్యయన కమిటిని నియమించారని అన్నారు. ఆ అధ్యయనం ద్వారా అనేక బిసి కులాలను గుర్తించడం జరిగిందన్నారు. అధికారంలోకి రాగానే ఆయా బిసి కులాలను అభివృద్ది చేయాలని వారిలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించి అనేక చర్చల తర్వాత 56 బిసి కులాల కార్పోరేషన్లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆయా కులాల కార్పోరేషన్లలో పదవులలోకి వచ్చిన వారు వారి కులాలలో వెనకబాటుతనంతో ఉన్నవారిని గుర్తించి చివరి వ్యక్తి వరకు శ్రీ వైయస్ జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమపధకాలను అందించాలని కోరారు. తద్వారా వారిలో నాయకత్వలక్షణాలు అలవడతాయని అన్నారు.వారినుంచే భవిష్యత్తులో ఎంఎల్ ఏలు,మంత్రులుగా ఎదుగుతారని అన్నారు. శ్రీ వైయస్ జగన్ నూతన నాయకత్వాన్ని బిసిలలో ఎదిగేలా చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు.ముదిరాజ్ కులస్ధులు కూడా శ్రీ వైయస్ జగన్ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. ముదిరాజ్ కులస్ధుల నేతలు వారి కులస్ధులు నివసించే ప్రాంతాలలో పర్యటిస్తూ శ్రీ వైయస్ జగన్ బిసిల కోసం ప్రవేశపెడుతున్న పధకాలను గురించి తెలియచేయాలని కోరారు. ఇంకా వారు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి తాము ఎల్లప్పుడూ సంసిధ్దంగా ఉంటామని తెలియచేశారు. ఇటీవల ఎన్నికలలో బిసిలంతా కూడా వైయస్సార్ కాంగ్రెస్ కు పూర్తి మధ్దతుగా నిలిచారని అన్నారు. బిసిలలో పేదరికాన్ని పొగొట్టి వారిని మంచి విద్యావంతులుగా,ఉద్యోగులుగా,ప్రజాప్రతినిధులుగా చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవారికి ఎల్లప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు. నాయకులను కిందినుంచే తయారు చేస్తుందని స్పష్టం చేశారు.పైనుంచి రుద్దే పరిస్ధితి ఉండదని అన్నారు.
పార్టీ ప్రధానకార్యదర్శి,శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ కులస్ధులు రాజకీయంగా,సామాజికంగా ఎదిగేలా చేసేందుకు అన్ని అవకాశాలను కల్పిస్తామని అన్నారు. శాసనమండలి సభ్యులు,బిసి సెల్ అధ్యక్షుడు శ్రీ జంగాకృష్ణమూర్తి మాట్లాడుతూ బిసిలు మరింతగా అభివృధ్ది చెందాలంటే శ్రీ వైయస్ జగన్ ను రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండేలా బిసిలందరూ పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో నవరత్నాలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డినాగనారాయణమూర్తి,ముదిరాజ్ కార్పోరేషన్ ఛైర్మన్ కె.వెంకటనారాయణ,డైరక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment