అమరావతి (ప్రజా అమరావతి);
*స్పందనపై వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలు, వాటిపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం శ్రీ వైయస్.జగన్ దిశా నిర్దేశం.*
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*
ఇటీవల రాష్ట్రంలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వంలో పోలీసులు, కలెక్టర్లు ఎంత బాగా స్పందించినా కూడా స్వార్ధప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంపై బురద జల్లాలని ఆరాటపడే వ్యవస్ధను మనం చూస్తున్నాం
. వారి స్వప్రయోజనాలకోసం చేయకూడనివి చేస్తున్నారు. అటువంటి దారుణమైన పరిస్ధితుల్లో ఒక్కోసారి బాధనిపిస్తుంది.
కొంతమంది ఆడ పిల్లలు, వారి కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఆ కుటుంబాల గౌరవాన్ని మంటగలుపుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒక ఈవ్టీజింగ్ కేసులో కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. ఆ కేసులో అమ్మాయి, ఆ కుటుంబం ఆత్మాభిమానం దెబ్బతినేలా, వారికి కళంకం తెచ్చేలా ఆ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన తీరు, మీడియాతో మాట్లాడిన విధానం ఆ కుటుంబ గౌరవాన్ని బజారున పెట్టేలా ఉంది. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సంఘటనల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్వప్రయోజనాలకోసం ఒక వర్గం మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారం పై కూడా మనం పోరాటం చేస్తున్నాం. మనం వాస్తవానికి రాజకీయ పార్టీలతో యుద్దం చేయడం లేదు. మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 తో యుద్ధం చేస్తున్నాం. ఈ వ్యక్తులకి వాళ్ల సొంత ప్రయోజనాలు తప్ప మరే అంశాలు పట్టవు. వాళ్లనుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చొబెట్టడానికి ఎవరిమీదనైనా వీళ్లు బురద జల్లుతారు. అందుకోసం మిమ్నల్ని కూడా మినహాయించరు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొండి. మన చుట్టూ ఏం జరుగుతుందో చూడాలి. మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న సంఘటన జరిగినా వెంటనే అప్రమత్తం కావాలి. ఎలాంటి వక్రీకరణకు తావివ్వకూడదు. మీరు ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నారు, ఎంత మంచిగా పనిచేస్తున్నారన్నది ఆ వర్గం మీడియాకు అవసరం లేదు. స్వార్ధ ప్రయోజనాలే వారి లక్ష్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా పనిచేయాలి.
addComments
Post a Comment