- నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్
- తుమ్మలను అభినందించిన మంత్రి కొడాలి నాని
విజయవాడ, ఆగస్టు 11 (ప్రజా అమరావతి): నామినేటెడ్ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహనరెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం విజయవాడలోని ధనేకుల కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన తుమ్మల చంద్రశేఖరరావు (బుజ్జి) ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొడాలి నానితో పాటు డిప్యూటీ సీఎం పీ పుష్పశ్రీవాణి, మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్, కైలే అనిల్ కుమార్, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు విచ్చేశారు. తుమ్మల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడారు. పార్టీ ఏర్పడినప్పటి నుండి తుమ్మల చంద్రశేఖర్ ఎంతో కష్టపడి పనిచేస్తూ వస్తున్నారన్నారు. తుమ్మల పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సీఎం జగన్మోహనరెడ్డి అందించారన్నారు. నూతనంగా ఏర్పాటైన కమ్మ కార్పోరేషన్ ద్వారా రాష్ట్రంలో ఆర్ధికంగా వెనకడిన కమ్మ కులానికి చెందిన వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని సూచించారు. కార్పోరేషన్ చైర్మన్ తుమ్మలను మంత్రి కొడాలి నాని అభినందించారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాటి నుండి సీఎం జగన్మోహనరెడ్డి అనేక పోరాటాలు చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారని చెప్పారు. ఈ సందర్భంగా అన్నివర్గాల ప్రజలకు దగ్గరగా మమేకం కావడంలో ఎంతో మంది నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు కీలకపాత్ర పోషించారన్నారు. గత రెండేళ్ళుగా సీఎం జగన్మోహనరెడ్డి తన పాలనలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకువెళ్ళి తమవంతు పాత్రను నిర్వహిస్తున్నారని కొనియాడారు. అటువంటి వారిలో కొంత మందికి నామినేటెడ్ పదవులను అప్పగించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ పార్టీపరంగా సముచిత బాధ్యతలను అప్పగించడం జరుగుతుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన ఏ వ్యక్తి ఇబ్బంది పడకూడదనే విధంగా నామినేటెడ్ పదవులను సీఎం జగన్మోహనరెడ్డి కేటాయించారని తెలిపారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెద్దపీట వేశామన్నారు. అణగారిన వర్గాల ఆర్ధిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా పదవులను మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అధికారంలోకి రాకముందు చెప్పినట్టుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 56 శాతం పదవులను కేటాయించి చేతల్లో చూపించారన్నారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. బీసీ వర్గాలకు ఆయా కార్పోరేషన్లను ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించారన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల స్థితిగతులను మార్చివేశారన్నారు. రాజకీయంగా అన్ని వర్గాలకు చేయూత లభిస్తోందని మంత్రి కొడాలి నాని చెప్పారు.
addComments
Post a Comment