- అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడమే మొహర్రం
- కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించాలి
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, ఆగస్టు 19 (ప్రజా అమరావతి): ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడమే మొహర్రం అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఇస్లాం అంటే శాంతి అని, మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాలను మొహర్రం సందర్భంగా స్మరించుకోవడం జరుగుతోందన్నారు. మంచితనం, త్యాగం ఇస్లాం సూత్రాలు అని చెప్పారు. మొహర్రం మానవతా వాదాన్ని వెలువరించే స్ఫూర్తిగా అభివర్ణించారు. కోవిడ్ -19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నివాసాలకే పరిమితమై మొహర్రం కార్యక్రమాలను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలను జారీ చేసిందని చెప్పారు. పది మందికి మించకుండా ఆలం నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఊరేగింపులో 30 మంది నుండి 40 మంది వరకే అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. మంచినీటి సీసాలు మినహా ఎటువంటి వితరణకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. మాస్క్ లు ధరించి తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్ -19 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
addComments
Post a Comment