నెల్లూరు, ఆగస్టు 6 (ప్రజా అమరావతి):---జిల్లాలో ఇళ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని
జిల్లా కలెక్టర్ శ్రీ కె.విఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ "నవరత్నాలు పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీల "పురోగతిపై నియోజకవర్గాలు, మండలాల ప్రత్యేక అధికారులు, గృహ నిర్మాణ సంస్థ, ఆర్డబ్ల్యూఎస్ గనులు, ప్రజారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం అనుకున్నంతగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాకు తొలి దశలో మంజూరైన 54 వేల ఇళ్లకు గాను 34,848 ఇల్లు నిర్మాణం పనులు ఇప్పటివరకు ప్రారంభమయ్యాయన్నారు. మిగిలిన 19 105 ఇళ్ల నిర్మాణం పనులు కూడా మొదలయ్యేలా చొరవ చూపాలన్నారు. ప్రారంభమైన ఇళ్లలో 32832 ఇల్లు పునాది కంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని, 1420 ఏళ్లు పునాది స్థాయిలో ఉన్నాయని, 304 ఇల్లు పైకప్పు స్థాయిలో ఉన్నాయని, 292 ఇల్లు స్లాబ్ స్థాయిలో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 12.72 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ వహించి బిబిఎల్ కింద ఉన్న గృహాలను పునాది స్థాయిలోకి తీసుకు రావాలని ఆదేశించారు. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా ఒక ఆదర్శ గృహాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. దాన్ని చూసి ఇతర లబ్ధిదారులు కూడా స్ఫూర్తి పొందే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఇళ్ల నిర్మాణం మొదలైన ప్రతి ఇంటి వద్ద కావలసిన సిమెంటు ఇసుక సిద్ధం గా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.ప్రతిరోజు ఎంత ఇసుకను లేఔట్ వద్ద నిల్వ ఉంచారో నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో కొడవలూరు, నెల్లూరు గ్రామీణ, మనుబోలు, చిల్లకూరు, దగదర్తి, ఆత్మకూరు, ముత్తుకూరు, నాయుడుపేట తదితర మండలాల్లో 25 లేఅవుట్లలో ఇంకనూ విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు వారాల నుంచి చెబుతున్నా స్పందించకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. వచ్చే వారంలోగా విద్యుత్తు, ప్రజారోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో రాత్రింబవళ్లు పనిచేసి ప్రతి లేఅవుట్ వద్ద విద్యుత్తు మంచినీరు సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. ఏ ఒక్క లోపం వలన ఇళ్ల నిర్మాణం పనులు ఆగిపోకూడదు అని స్పష్టం చేశారు. కూలీలకు 90 రోజుల పని దినాలను తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఎక్కడా కూడా నీరు ఇసుక, ఇనుము, సిమెంటు కొరత రాకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో నుడా, పట్టణ ప్రాంతాలకు నూతనంగా మంజూరైన 25, 685 గృహాలకు సంబంధించి సర్వే కోడింగ్, మ్యాపింగ్ ,రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ లు శ్రీహరెంధిర ప్రసాద్ , శ్రీ గణేష్ కుమార్ , శ్రీ విదేహ్ ఖరే, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ పి డి శ్రీ శేషయ్య, నియోజకవర్గాలు మండల ప్రత్యేక అధికారులు శ్రీ నాగేశ్వర రావు, శ్రీమతి సుశీల ,శ్రీ హుస్సేన్ సాహెబ్ , శ్రీ సీనానాయక్, శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి సరోజినీ, చైత్ర వర్షిని, శ్రీమతి ధనలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ శ్రీ శ్రీనివాస్ కుమార్, గనుల శాఖ ఏడి శ్రీ వెంకటేశ్వర్లు , ప్రజారోగ్య శాఖ ఈ ఈ శ్రీ రహంతుల్లా జానీ, గృహ నిర్మాణ సంస్థ ఈ ఈ లు డీఇ, ఏ ఈ లు పాల్గొన్నారు.
addComments
Post a Comment