- ఈ - కేవైసీపై ప్రజలకు మరింత అవగాహన కల్పించండి
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
- మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్వో మారుతీ ప్రసాద్
గుడివాడ, ఆగస్టు 30 (ప్రజా అమరావతి): ఈ - కేవైసీపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. గుడివాడ పట్టణంలో రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని డీఎస్వో కేవీఎస్ మారుతీ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రాష్ట్రంలోని బియ్యం కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ - కేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ - కేవైసీ చేయించుకున్న కార్డుదారులు పోర్టబులిటీ సదుపాయం ద్వారా నిత్యావసర రేషన్ సరుకులను దేశంలో ఎక్కడి నుండైనా పొందే హక్కు కలుగుతుందన్నారు. గ్రామ , వార్డు వాలంటీర్ దగ్గర ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా కూడా ఈ - కేవైసీ చేయించుకోవచ్చన్నారు. రేషన్ డీలర్ దగ్గర ఉన్న ఈ - పాస్ యంత్రం ద్వారా కూడా చేయించుకునే అవకాశం ఉందన్నారు. వేలిముద్రలు సరిగా పడని వారు ఈ - పాస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్ సదుపాయం వినియోగించుకోవచ్చన్నారు. ఐదేళ్ళ లోపు పిల్లలకు ఈ - కేవైసీ అవసరం లేదన్నారు. బియ్యం కార్డుల రద్దుపై అనుమానాలు, అపోహలు లేకుండా చూడాలన్నారు. ఈ - కేవైసీ కేవలం ఆధార్ ద్వారా వ్యక్తిగత ధృవీకరణ మాత్రమేనని, బియ్యం కార్డులను తొలగించే ప్రక్రియ కాదని మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment