పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా 1 వ తేదీన జీతాలిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి

 


- పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా 1 వ తేదీన జీతాలిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి 


- ఆప్కాస్ ఏర్పాటుతో దళారి వ్యవస్థను నిర్మూలించాం 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, సెప్టెంబర్ 11 (ప్రజా అమరావతి): పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువే అవుతుందని చెప్పిన సీఎం జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు అందరికీ ప్రతి నెలా 1 వ తేదీన జీతాలను అందిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని న్యూఢిల్లీలోని నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు చెందిన రాహుల్, శ్రీదేవి గుడివాడ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు అద్దేపల్లి పురుషోత్తం, అధ్యక్షుడు గుళ్ళపల్లి శ్రీను, కార్యదర్శి ధనాల బుజ్జి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా అద్దేపల్లి పురుషోత్తం మాట్లాడుతూ గుడివాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న 199 మందికి సఫాయి కర్మచారిలుగా గుర్తించి సర్టిఫికెట్లను అందజేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సౌజన్యంతో నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన శిక్షణను అందించారని చెప్పారు. సఫాయి కర్మచారి సర్టిఫికెట్ పొందిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ద్వారా అనేక ప్రోత్సాహకాలు అందుతాయన్నారు. కార్మికుల పిల్లల ఉన్నత చదువులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తారని, స్కాలర్ షిప్ ను కూడా అందజేస్తారన్నారు. వ్యక్తిగత రుణాలకు కూడా రెండింతల సబ్సిడీ ఉంటుందన్నారు. సర్టిఫికెట్ అందుకున్న తర్వాత ప్రతి కార్మికుడికీ రూ.40 వేల సాయాన్ని అందజేస్తారన్నారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సఫాయి కర్మచారిలుగా సర్టిఫికెట్లను అందుకున్న కార్మికులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఆర్ధికంగా ఎదగాలని సూచించారు. కాగా రాష్ట్రంలో దళారీ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.18 వేల కనీస వేతనాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కట్టుబడి ఉన్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.

Comments