ఇసుక డిపోలలో అమ్మకాలు చేపట్టేలా చర్యలు తీసుకోండి'*
*జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*
అనంతపురం, సెప్టెంబర్7 (ప్రజా అమరావతి):
జిల్లాలో మునిసిపాలిటీల వారీగా ఏర్పాటు చేసిన డిపోల ద్వారా ఇసుక అమ్మకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జె పి గ్రూపునకు ఇసుక డిపోల నిర్వహణ బాధ్యతలు అందజేయడంతో మైనింగ్ శాఖ పని పూర్తయినట్టు కాదని, డిపోల ద్వారా ఇసుక అమ్మకాలు జరిపి ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకురావడమే అంతిమ లక్ష్యమన్నారు.
ఇంకా ఇసుక డిపోలు ఏర్పాటు చేయని కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం మునిసిపాలిటీలలో డిపోల ఏర్పాటును పర్యవేక్షించాలన్నారు. హిందూపురం, మడకశిర, ఉరవకొండ వంటి ప్రాంతాలలో ఇసుక కొరతను తగ్గించాలన్నారు. జగనన్న ఇళ్ల కాలనీలు, పంచాయితీ రాజ్ నిర్మాణాలు, పేద-మధ్యతరగతి ప్రజల అవసరాలకు సరిపడేలా ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
జిల్లాలో కూలీలతో తవ్వకాలు చేసుకునే అవకాశం ఉన్న ఓపెన్ రీచులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. స్థానిక ప్రజలు పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వకాలు చేపడతారనే భయంతో ఓపెన్ రీచులలో తవ్వకాలను వ్యతిరేకించడంలో న్యాయం ఉందని, నిభంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుపుతారనే భరోసా స్థానికులకు కల్పించాలన్నారు. ఓపెన్ రీచులలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టే వారిపై నిఘా కోసం స్థానికుల సహాయం తీసుకోవాలన్నారు.
రెవెన్యూ అధికారులు స్థానికంగా ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చిన రీచులేమైనా ఉంటే వాటిని సమీక్ష చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నారు.
సమావేశంలో ఐదు 3వ ఆర్డర్ రీచులలో తవ్వకాలు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. వీటిలో మూడు రీచులు లేపాక్షి మండలంలో ఉండగా.. బెలుగుప్ప, ఉరవకొండ మండలాలలో ఒక్కో రీచు చొప్పున ఉన్నాయి.
కంబదూరు మండలంలోని చెన్నంపల్లి వద్దనున్న 4వ ఆర్డర్ ఇసుక రీచుకు సైతం ఆమోదం తెలుపుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
యల్లనూరు మండలంలోని చింతకాయ మంద చిలంకూరు గ్రామాల్లో ఉన్న రెండు 4వ ఆర్డర్ రీచులలో స్థానిక ప్రజల అంగీకారం అనంతరం ఇసుక తవ్వకాలు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది.
ఈ కార్యక్రమంలో సెబ్ రామ్ మోహన్ రావు, మైన్స్ & జియాలజీ డి డిసుబ్రహ్మణ్యేశ్వర్, మైన్స్ & విజిలెన్స్ ఏడీ జి.కృష్ణమూర్తి, ఏడీ బాలాజీ నాయక్, గ్రౌండ్ వాటర్ డీడీ తిప్పేస్వామి, ఎస్.ఈ పీఆర్, పీసీబీ ఎస్.ఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment