నెల్లూరు, సెప్టెంబర్ 1 (ప్రజా అమరావతి): జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను
పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం కావలి ఏరియా ఆసుపత్రిలో అదానీ కృష్ణపట్నం పోర్ట్ గ్రూప్ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను కావలి ఎమ్మెల్యే శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరులోని ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 100 కోట్ల రూపాయలతో అధునాతన పరికరాలను అమర్చి ఆస్పత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, మరో 100 కోట్ల రూపాయలతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కరోనా సెకండ్ వేవ్ లో దేశమంతా ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, అయితే జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం పని చేసిందని ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణపట్నం పోర్టు, శ్రీహరికోటలోని షార్ వారి సహకారంతో అన్ని ఆసుపత్రులకు సరైన సమయంలో ఆక్సిజన్ ను అందించగలిగామని, ఈ సందర్భంగా పోర్ట్ వారికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో లక్షా ఎనభై వేల మంది కరోనా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మెరుగైన వైద్య సేవలందించి వారిని సురక్షితంగా ఇళ్లకు పంపినట్లు తెలిపారు. కరోనా రోగులకు సమయానికి మందులు, ఆహారం అందిస్తూ వైద్య సిబ్బంది మెరుగైన సేవలందించారని, ఇదే స్ఫూర్తితో కరోనా థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను 100 శాతం పూర్తిచేయాలని సూచించారు. మంగళవారం చేపట్టిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్ లో ఒక లక్ష 22 వేల మందికి ఒక్కరోజులో వ్యాక్సిన్ వేసి, రాష్ట్రస్థాయిలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ ను, వైద్య సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కరోనా థర్డ్ వేవ్ ను అరికట్టేందుకు మన ముందున్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమేనని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలందరూ కూడా అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మరికొన్ని రోజులు అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ కోవిడ్ ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, అదానీ కృష్ణపట్నం పోర్ట్ గ్రూప్ సీఈవో శ్రీ అవినాష్, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ శ్రీ విజయ భాస్కర్, కావలి ఆర్డిఓ శ్రీ శీనానాయక్,డిప్యూటీ ఈఈ శ్రీ సాంబశివరావు, కావలి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment