మారుమూల ప్రాంతాలకు మందులు,వ్యాక్సిన్ లు సరఫరా చేయటానికి 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రారంభం

 *మారుమూల ప్రాంతాలకు మందులు,వ్యాక్సిన్ లు సరఫరా చేయటానికి 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రారంభం*



వికారాబాద్‌ (ప్రజా అమరావతి): టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి  తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలని చెప్పారు. వికారాబాద్‌లో డ్రోన్‌ సాయంతో మారుమూల ప్రాంతాలకు మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రోన్‌ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందన్నారు. గ్రహంబెల్‌ టెలిఫోన్‌, రైట్‌ బ్రదర్స్‌ విమానం లాగే డ్రోన్‌ టెక్నాలజీ ఓ సంచలనమని చెప్పారు. డ్రోన్లతో ఔషధాలు సరఫరా చేస్తున్న యువతను అభినందించారు.


ఇలాంటి సాంకేతికతను అందించడమే ప్రధాని మోదీ స్వప్నమని తెలిపారు. డ్రోన్‌ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుందని చెప్పారు. స్టార్టప్‌లను తేలిగ్గా చూడద్దని సూచించారు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోందని వెల్లడించారు. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా అని ప్రశ్నించారు. అన్నదాతలు, జ్ఞానదాతలు ముఖ్యమని చెప్పారు. ఏరోస్పేస్‌ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి గ్రీన్‌జోన్లు ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు...

Comments