శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి (ప్రజా అమరావతి):
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అక్టోబరు 30న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం నిర్వహించనున్నారు.
ఆలయంలో అక్టోబరు 31 నుండి నవంబరు 2వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
వైదిక సంప్రదాయం ప్రకారం
జాతాశౌచం,
మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం.
అయినా
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
రెండో రోజు నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు.
చివరిరోజు నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఆస్థానం జరుగనుంది.
addComments
Post a Comment