రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం.. రేపు రాష్ట్ర బంద్‌: చంద్రబాబు.

 *రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం.. రేపు రాష్ట్ర బంద్‌: చంద్రబాబు*


మంగళగిరి (ప్రజా అమరావతి): తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో సీఎం, పోలీసులు లాలూచీ పడ్డారు. డీజీపీ కార్యాలయం పక్కనే  తెదేపా కార్యాలయం ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏం కాపాడుతారు. పార్టీ కార్యాలయంపై దాడిని ఎప్పుడూ చూడలేదు. పార్టీ కార్యాలయం.. రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిది. డీజీపీ కార్యాలయం పక్కనే దాడి జరిగితే నిఘా విభాగం ఏం చేస్తోంది. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసే ఈ దాడి చేయించారు. ప్రణాళిక ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ పాటించాలి. ఈ దాడులు.. స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం. రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతోందని అందరూ చెప్పారు. అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు. ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ నేరస్థులతో లాలూచీ పడతారా? మమ్మల్ని భయ భ్రాంతులకు గురి చేస్తారా? రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో 356 అధికరణం ఎందుకు ప్రయోగించకూడదు? కరెంటు ఛార్జీలను ఇష్టం వచ్చినట్టు పెంచుతారా? ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేద్దాం. ప్రజాస్వామ్యంపై దాడి చేసే శక్తులపై పోరాటం చేద్దాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

*ఫోన్‌ చేసినా డీజీపీ ఎత్తలేదు*

తెదేపా కార్యాలయంపై దాడి జరుగుతుందని డీజీపీకి ఫోన్‌ చేస్తే ఎత్తలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గవర్నర్‌, కేంద్రమంత్రి ఫోన్‌ ఎత్తారు.. డీజీపీ ఎత్తరా?. అడిగితే.. సమావేశం ఉంది బీజీగా ఉన్నానని చెప్పారు. కొందరు చేసే పనులతో పోలీసు వ్యవస్థ భ్రష్ఠుపట్టింది. ఇన్నాళ్లూ తిట్టారు, జైలులో పెట్టారు.. ఇప్పుడు కొడతారా? రెండున్నరేళ్లుగా మీ వేధింపులు చూస్తున్నాం. రౌడీలతో రాజకీయాలు చేస్తారా? హెరాయిన్‌ గురించి మాట్లాడితే ఏం తప్పు? ఏపీలో గంజాయి సాగు ఉందని పక్క రాష్ట్రాల డీజీపీలు చెప్పారు. గంజాయి సాగు పెరిగిందని తెదేపా నేతలు అనడమే తప్పా? తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తెదేపా కార్యాలయాలపై దాడులు జరిగాయి. దాడి విషయం తెలియకుంటే ఆ పదవికి డీజీపీ అర్హుడా?’’ అని చంద్రబాబు ప్రశ్నంచారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈదాడులను ఖండించాలని, రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Comments