గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు...

 

అమరావతి (ప్రజా అమరావతి);


*వడ్డీ వ్యాపారుల నుంచి చిరువ్యాపారులను రక్షించేందుకు శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం– జగనన్న తోడు పథకం*


*ఇందులో భాగంగా 2020 నవంబరు నుంచి 30 సెప్టెంబరు 2021 వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


ఈ రోజు దేవుడి దయతో ఇంకో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి అవకాశం వచ్చింది. చిన్న, చిన్న వ్యాపారాల ద్వారా తమకు ఉపాధి కల్పించుకోవడమే కాక, ఇంకా ఒకరికో ఇద్దరికో కూడా ఉపాధి కల్పించే దిశగా వీళ్లంతా చేస్తున్న కార్యక్రమానికి ప్రభుత్వం తరపున వడ్డీ భారం పడకుండా వాళ్లు,  వాళ్ల కాళ్లమీద నిలబడే పరిస్ధితి ఇంకా మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుడుతున్నాం. 


*గతంలో ఏ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు...*


 

తోపుడు బండ్ల మీద పండ్లు, సామానులు అమ్ముకునేవారు నగరాలలో పుట్‌పాత్‌ల మీద ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లు అమ్ముకునేవారు, రోడ్డు పక్కనే చిన్న ప్రదేశంలో చిన్న బంక్‌ పెట్టుకుని చిన్న, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేవాళ్లు, చిన్న మోపెడ్‌ మీద వాళ్లంతట వాళ్లే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి వీధుల్లో సామానులు అమ్ముకునేవాళ్లు,ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు మన గ్రామ, గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, టౌన్లలో కనిపిస్తుంచారు. ఇలాంటి వాళ్లకు ఏ రోజు కూడా బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ల అవసరాలు తీర్చేందుకు సహాయ, సహకారాలు అందని పరిస్ధితి. ఎందుకంటే వీళ్లకు సెక్యూరిటీ ఇచ్చే స్తోమత ఉండదు. ఏ ప్రభుత్వమూ వీళ్లను పట్టించుకోని పరిస్థితులో, బ్యాంకులు సెక్యూరిటీలు లేక లోన్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో వీల్ల జీవితాలు తల్లడిల్లిపోతున్నాయి. వీళ్లకు ఎటువంటి గత్యంతరం లేక   వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్లి రోజుకు రూ.1000 వర్కింగ్‌ కేపిటల్‌ కింద అప్పుతీసుకుంటే సాయంత్రానికి రూ.100 కడుతూ... విచిత్రమైన పదిరూపాయలు వడ్డీ కడితే తప్ప ఆ పెట్టుబడి సొమ్ము రాని పరిస్థితులో వ్యాపారాలు చేసుకోవాల్సిన అన్యాయమైన దుస్ధితిలో వీళ్లంతా ఉన్నారు. ఇలాంటి పరిస్ధితులను నా కళ్లెదుటనే, నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశాను.


*వీళ్ల పరిస్థితి మారాలి, అండగా నిలబడాలనే...*

 వీళ్ల పరిస్థితి మార్చాలి, వీళ్లకు అండగా ఉండాలన్న ఉద్దేశ్యంతో మన ప్రభుత్వం దేవుడి దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత  బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. బ్యాంకర్లందరినీ మీరు సహాయం చేస్తే ప్రభుత్వం తోడుగా ఉంటుంది,  వడ్డీ కూడా ప్రభుత్వం కడుతుంది, వడ్డీ లేకుండా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా రూ.10వేలు రుణాలివ్వగలిగితే వాళ్లకు ఎంతో మంచి జరుగుతుందని బ్యాంకర్లను ఒప్పించి ఈ పథకాన్ని  గతేడాది ప్రారంభించాం. 


*దాదాపు 9 లక్షల మందికి రూ.905 కోట్ల రుణాలు*

దాదాపుగా 9,05,458 మందికి రూ.10వేలు చొప్పున రూ.905 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. వాళ్లు వడ్డీలు కడితే ప్రభుత్వం ఆ వడ్డీని సంవత్సరంలో ఒకరోజు మరలా వారికి రీయింబర్స్‌ చేస్తుంది. 

వడ్డీ లేకుండా ఆ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, చిరువ్యాపారులందిరికీ మంచి జరిగే పరిస్ధితి ఏర్పడుతుంది.


ఈ జగనన్న తోడు పథకాన్ని ప్రారంభిస్తూ... గత ఏడాది నవంబరు 25 నుంచి 5 లక్షల 35వేల మందికి మొదటి విడతలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ యేడాది జూన్‌ 8 నుంచి మరలా రెండో విడతగా మరో 3 లక్షల 70 వేల మందికి రుణాల పంపిణీ చేశాం. దాదాపుగా 9,05,458 మందికి అక్షారాలా  రూ.905 కోట్లు పంపిణీ చేశాం. 


2020 నవంబరు నుంచి రుణాలు తీసుకుని, 30 సెప్టెంబరు 2021 నాటికి సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు రూ.16 కోట్ల 36 లక్షల వడ్డీని ఈ కార్యక్రమంలో నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అలాగే జూన్‌ 2021లో  రెండో దఫా కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించే లబ్ధిదారులందరికీ కూడా వారి రుణకాల పరిమితి ముగియగానే, వాళ్లకు సంబంధించిన వడ్డీని కూడా తిరిగి చెల్లించడం జరుగుతుంది. 


*కొన్ని విషయాలు చెప్పాలి..*

ఈ సందర్భంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 

సంవత్సరంలో రెండు దఫాలుగా ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇది చాలా ప్రాధాన్యతాంశం. రుణాలు చెల్లించినవారికి కొత్త రుణాలిచ్చే కార్యక్రమం, అదే రోజు వడ్డీ సొమ్ము కూడా లబ్ధిదారునికిచ్చే కార్యక్రమం కలిపి చేస్తాం. సంవత్సరానికి రెండు సార్లు చేస్తాం. ఒకసారి డిసెంబరులోనూ మరోసారి జూన్‌ నెలలోనూ చేస్తాం. రుణం తీసుకున్న వారి సంవత్సరం కాలం డిసెంబరు నాటికి పూర్తయితే, ఆ లోన్‌ క్లోజ్‌ చేయడం, వారి వడ్డీ డబ్బులు వెనక్కివ్వడం జరుగుతుంది. మరలా లోన్‌ను కొత్తగా మంజూరు చేస్తారు. అదే విధంగా జూన్‌లో కూడా అప్పటికి సంవత్సరం పూర్తయిన వారికి మరలా రెన్యువల్‌ చేస్తారు. సంవత్సరానికి రెండు దఫాలుగా సంవత్సరం పూర్తయిన వారికి రుణం రూ.10వేలు పునరుద్దరించడం, సంవత్సర కాలానికి సంబంధించిన వడ్డీ డబ్బులు తిరిగి లబ్ధిదారునికిచ్చే కార్యక్రమాలు జరుగుతాయి.


*రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా చెల్లించండి..* 

దీనికి సంబంధించి ఎవరైనా రుణాలు కట్టకపోతే ఇప్పుడైనా కట్టండి... మరలా డిసెంబరులోనూ, జూన్‌లోనూ రుణాలు పొందడానికి అవకాశం కలుగుతుంది. 

ఒకసారి రుణం తీర్చిన తర్వాత లబ్దిదారుల కోరిక మేరకు బ్యాంకుల నుంచి మరలా వడ్డీ లేని రుణాలు పొందవచ్చు. వడ్డీల విషయంలో కానీ, రుణాలు పొందే విషయంలో ఎవరికైనా సందేహాలుంటే  0891 2890525 నంబరుకు ఫోన్‌ చేస్తే వారికున్న అన్ని సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే.. డిసెంబరులో ఈ కార్యక్రమం ఎలాగూ జరుగుతుంది... అటువంటిది రెండు నెలలు ముందే అక్టోబరులో ఈ కార్యక్రమం ఎందుకు జరపాల్సి వస్తుందన్నదానికి ఒక వివరణ కూడా ఉంది. 


*నలుగురికి మంచి చేసే కార్యక్రమం– అవగాహన కల్పించాలి...* 

నేను బ్యాంకర్లతో మాట్లాడినప్పుడు తాజాగా వారి నుంచి అందుతున్న డేటా చూస్తే.. దాదాపు 5 శాతం ఎన్‌పీఏలు, 11 శాతం ఓవర్‌ డ్యూస్‌గా ఉన్నాయని బ్యాంకర్లు చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమంపై అందరికీ పూర్తి అవగాహన కలగాలి.  ఇది నలుగురికి మంచి చేసే కార్యక్రమం. దీనిలో 100 శాతం రికవరీ ఉండాలి. అప్పుడే బ్యాంకర్లకు మనమీద నమ్మకం పెరుగుతుంది. అప్పుడే బ్యాంకర్లు మరో నలుగురికి రుణాలివ్వడానికి ముందుకు వస్తారు. 


కాబట్టి గ్రామ సచివాలయం, వాలంటీర్లు, కలెక్టర్లు అందరూ దీనిలో భాగస్వామ్యం అయి అందరికీ చెప్పాలి. ఇక్కడ గడువులోపల కట్టడమంటే ఏమనిటన్నది చెప్పాలి. ప్రతి నెలా ఈఎంఐ కట్టాలి. ఒకవేళ కట్టకపోతే గడువు దాటినట్లే, అంటే ఓవర్‌ డ్యూ అయినట్లే లెక్క. అలా 90 రోజుల కట్టకపోతే ఎన్‌పీఏ (నాన్‌ ఫెర్ఫార్మింగ్‌ అసెట్‌) కింద మారుస్తారు. 


ప్రతి లబ్ధిదారుడుకీ ఈ విషయాలన్నీ కూడా కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ అకౌంట్‌ కూడా ఏ లబ్ధిదారుడు తనకు తెలియని కారణంగా కట్టకపోతే అది ఎన్‌పీఏ అయిందంటే తర్వాత ప్రభుత్వం తరపున నుంచి సున్నా వడ్డీ రాకుండా పోయే పరిస్థితి ఉంటుందనేది చాలా స్పష్టంగా చెప్పాలి. కాబట్టే ఈరోజు ఈ మీటింగ్‌ ద్వారా ఆ విషయాన్ని చెపుతున్నాం. 

ఇప్పటివరకు జరిగిన దాన్ని పక్కనబెట్టండి. నేను కూడా బ్యాంకర్లు అందరికీ చెప్తున్నాను. ఎవరెవరైతే ఓవర్‌ డ్యూ ఉన్నారో... ఎవరెవరైతే కట్టకుండా ఎన్‌పీఏలగా అయిన పరిస్థితుల్లో...  90 రోజుల దాటి కట్టకుండా ఉన్నారో వాళ్లందరినీ రిక్వెస్ట్‌ చేస్తున్నాను. కచ్చితంగా డిసెంబరులోగా రుణాలు చెల్లించండి. అటోమేటిక్‌గా మీరు కట్టిన వడ్డీ ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది. మరలా మీకు రూ.10వేలు బ్యాంకు రుణం ఇస్తుంది.  మీరు మీ వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి ఈవిషయాలన్నీ మీకు చెప్పాలన్నదే మా తపన, తాపత్రయం, అలా చెప్పకపోతే ఇది తెలియక ఇంకా మీరు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతారన్న భయంతో, అలాంటి పరిస్థితి రాకూడన్న ఆత్రుతతో ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిస్తున్నాం.


డిసెంబరులో మరలా ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత జూన్‌లో జరుగుతుంది. టైం ప్రకారం ఎవరెవరు కడతారో వాళ్లందరికీ కూడా వడ్డీలు వెనక్కి తిరిగివ్వడం జరుగుతుంది.  గతంలో  జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు కట్టండి. 


*సకాలంలో చెల్లిస్తేనే తిరిగి రుణాలు...* 

 సకాలంలో కట్టిన వారికి మాత్రమే తిరిగి రుణాలు వస్తాయి. డిసెంబరు నాటికి రుణాలన్నీ 100 శాతం కట్టించే పరిస్థితుల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా మంచి పథకం.


ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది చిన్న, చిన్న వ్యాపారులకు మంచి జరుగుతుంది.  ఎవరైనా కొంతమంది కట్టకపోవడం వల్ల బ్యాంకుల్లో నమ్మకం పోయి.. ఈపథకానికి మరింతగా  సపోర్టు చేసే పరిస్థితి, అవకాశం రాకుండా ఉండకూడదు. బ్యాంకర్ల నుంచి మనం మరింత సాయం తీసుకుని ఇంకా ఎక్కువ మందికి విస్తరింపజేసే పరిస్థితి రావాలన్నదే మన తపన, తాపత్రయం. 


*చివరగా... రెండు మాటలు చెప్పాలి..* 

మీరు ఇచ్చిన ఈ అధికారంతో ఈరోజు ఇప్పటికే సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధ తీసుకొచ్చి గ్రామ స్ధాయి నుంచి కూడా ఎక్కడా కూడా వివక్ష లేకుండా, అవినీతి లేకుండా, బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకి వెళ్లేటట్టుగా (డీబీడీ ద్వారా)

కులం, మతం,ప్రాంతం, వర్గం చివరకు పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేసారన్న మాట కూడా అడగకుండా... అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికీ  మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని ప్రభుత్వం నడిపిస్తోంది.


ఎస్సీలు,ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ, అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వం నడిపిస్తుంది. 


*ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే...*

అంతా నావాళ్లే, అన్ని ప్రాంతాలు నావే, ప్రతి ఒక్కరూ నా కుటుంబసభ్యులే అన్న భావనతోనే దాదాపుగా ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా సాగుతూ వచ్చింది. 

దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో సాగిన పరిపాలన మీ అందరికీ నచ్చింది కాబట్టే పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికలు, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఇలా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్ధానమే లేకుండా ప్రతి అక్కా, చెల్లెమ్మా, ప్రతి సోదరుడు, స్నేహితుడు కూడా నన్ను సొంత బిడ్డగా, అన్నగా భావించి అన్ని రకాలగా తోడుగా నిలబడుతున్నారు.


*ప్రతిపక్షం జీర్ణించుకోలేక పోతుంది...*  

కానీ మీరు ఇంత ప్రేమ,ఆప్యాయతులు చూపుతున్నారు కాబట్టే  జీర్ణించుకోలేని పరిస్థితుల్లో  ప్రతిపక్షం తయారైంది. ప్రతిపక్షంతో పాటు ఒక సెక్షన్‌ ఆఫ్‌ ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి,  టీవీ 5 జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఏ రకంగా తయారయ్యారో మీరే చూస్తున్నారు. వీళ్లే బూతులు తిడతారు. ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు మాట్లాడతారు. 


నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను. కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు ఎవరూ కూడా మాట్లాడి ఉండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్లే తిడతారు. 

ఆ బూతులు తిట్టారని దానిమీద ఎవరో మనల్ని అభిమానించేవాళ్లు, మనల్ని ప్రేమించే వాళ్లు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక, అభిమానించే వాళ్లు, ఆప్యాయత చూపేవాళ్ల రియాక్షన్‌ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. 

ఆ రకంగా వైషమ్యాలను క్రియట్‌ చేసి, కావాలని తిట్టించి వైషమ్యాలను క్రియేట్‌ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం మన కర్మ కొద్దీ ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. 


*విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం...* 

అబద్దాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు. వంచన కనిపిస్తుంది.  ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్దాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొచ్చడానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు. కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడతారు. ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలు చేస్తారు.  వ్యవస్ధలను పూర్తిగా మేనేజ్‌ చేయబడుతున్న పరిస్థితులు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఏ పేదవాడికి మంచి జరుగుతున్నా ఆ మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వస్తుందేమోనని చెప్పి ఏకంగా ఆ మనిషిని ఆపడం కోసమని చెప్పి రక,రకాల కోర్టు కేసులు వీళ్లే వేయిస్తారు.

రక,రకాల వక్రీకరణ రాతలు వీళ్లే పేపర్లలో, టీవీలలో రాస్తారు, చూపిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ రెండున్నర సంవత్సరాల పరిపాలన కూడా మనస్ఫూర్తిగా, సంతృప్తినిచ్చే విధంగా చేయగలిగాను. 


ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయను. మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేస్తానని సవినయంగా తెలియజేస్తున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


అనంతరం సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ 2020 నవంబరు నుంచి 30 సెప్టెంబరు 2021 వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4,50,546 మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేశారు. 


ఈ కార్యక్రమంలో విద్యుత్‌ శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కె సునీత, ఆప్కాబ్‌ ఛైర్‌ పర్సన్‌ ఝాన్సీరాణి, సెర్ఫ్‌ సీఈఓ ఎ ఎండి ఇంతియాజ్, గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌ షన్‌ మోహన్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బీ వీ బ్రహ్మానందరెడ్డి, స్త్రీ నిధి ఎండీ కె వి నాంచారయ్య, పలువురు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments