*పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్: బకాయిలు 2,087 కోట్లు - పీపీఏ సిఫార్సు చేసింది 711 కోట్లు*
రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, నవంబర్ 29 (ప్రజా అమరావతి): పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి అక్టోబర్ 21, 2021 నాటికి ఉన్న 2,087 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)ను కోరగా 711 కోట్ల రూపాయల విడుదలకు మాత్రమే పీపీఏ సిఫార్సు చేసినట్లు కేంద్ర జలశక్తి శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు రాజ్యసభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును తిరిగి చెల్లించే విషయంలో అసాధారణ జాప్యం, దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
బిల్లుల స్క్రూటినీలో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరవలసి రావడం, నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అనుసరిస్తోందా లేదా వంటి అంశాల నిర్ధారణ వంటి పలు కారణాల వలన బకాయిల చెల్లింపులలో జాప్యం జరుగుతున్నట్లు మంత్రి వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ విభాగం పనులకు సంబంధించిన ఖర్చును 2014 ఏప్రిల్ నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించిన అనంతరం చెల్లింపుల కోసం సిఫార్సు చేస్తుంది. వాటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపిస్తారు. ఆర్ధిక శాఖ ఆమోదం పొందిన అనంతరం ఎంత మొత్తం బకాయిల చెల్లింపునకు ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులను నాబార్డ్ మార్కెట్ నుంచి సేకరిస్తుంది. మార్కెట్ నుంచి నిధుల సేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి సాధారణంగా రెండు నుంచి మూడు వారాలు పడుతుంది. సేకరించిన నిధులను నాబార్డ్ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి అక్కడి నుంచి పీపీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. నిధుల బదిలీ ప్రక్రియ సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి తెలిపారు.
*విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు*
న్యూఢిల్లీ, నవంబర్ 29: త్వరలో విజయవాడి-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో వాటర్ ఎయిరోడ్రోమ్ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖ చేపడుతుంది. ఈ మేరకు 2021 జూన్ 15న ఆ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి శ్రీ వీకే సింగ్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ సాధారణ ప్రజలకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులో తీసుకువచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ 2016 అక్టోబర్లో రీజనల్ కనెక్టివిటీ (ఉడాన్) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అయితే ఈ పథకం మార్కెట్ డిమాండ్ను బట్టి అమలులోకి వస్తుందని అన్నారు. ఫలానా రూట్లో డిమాండ్-సరఫరా ఎలా ఉందో ఎయిర్లైన్స్ సంస్థలు అధ్యయనం చేసిన అనంతరం ఆయా రూట్లలో బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎయిర్లైన్స్ ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆ విధంగా ఇప్పటికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్ అనంతరం విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసుల నిర్వహణకు వాటర్ ఎయిరోడ్రోమ్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. వాటర్ ఎయిర్డ్రోమ్ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎంపిక చేసిన ఎయిర్లైన్స్ సంస్థ రెండు మాసాల్లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.
*ఏపీలో 2 లక్షల 56 వేల మంది వీధి వ్యాపారులు*
న్యూఢిల్లీ, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 2 లక్షల 56 వేల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ రాజ్యసభలో వెల్లడించారు. శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ వీధి వ్యాపారుల సామాజిక, ఆర్థిక పురోగతి కోసం దేశంలో ఎంపిక చేసిన 125 మునిసిపాలిటీలలో ప్రధానమంత్రి స్వానిధి సే సమృద్ధి పథకాన్ని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనిమిది సంక్షేమ పథకాల కింద పీఎం స్వానిధి పథకం కింద ఎంపిక చేసిన వీధి వ్యాపారులు వారి కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూర్చుతున్నట్లు ఆయన వెల్లడించారు.
addComments
Post a Comment