ఏ–కన్వెన్షన్ సెంటర్, విజయవాడ (ప్రజా అమరావతి);
*సామాన్యులలో అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
*
*రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్ఆర్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డులు, అచీవ్మెంట్ అవార్డులు*
*వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం శ్రీ వైయస్.జగన్*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే....:*
*ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు....*
ఈ రోజు మాననీయ గవర్నర్ గారు, అమ్మ(శ్రీమతి వైయస్.విజయమ్మ), ఎందరో మహానుభావుల మధ్య.. సామాన్యులగా ఉన్న అసామాన్యులు మధ్య నా సమయం గడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నా తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, తెలుగు జాతి తరపున అందరికీ వందనాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
*దేశ అత్యున్నత అవార్డుల తరహాలోనే...*
కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో గొప్పవారిని, మంచివారిని దేశంలోని అత్యున్నత అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్ , భారతరత్న వంటి అవార్డులిచ్చి సత్కరిస్తుంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే చేపట్టి, రాష్ట్ర అవార్డులు కూడా ఇస్తే బాగుంటుందని పలు సూచనలు ఇచ్చిన నేపధ్యంలో వైయస్సార్ అవార్డులను నెలకొల్పటం జరిగింది.
*డాక్టర్ వైయస్సార్– నిండైన తెలుగుదనం*
మహానేత, నాన్నగారు డాక్టర్ వైయస్సార్ గారు పేరు చెబితే అందరికీ కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచకట్టులో కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గ్రామం, పల్లెల మీద పేదల మీద అభిమానం కూడా తనను చూస్తూనే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తేనే కనిపించే విషయాలు.
*అకాశమంత ఎత్తుకు ఎదిగిన మహామనిషి....*
అనేక విషయాలు ఆయన్ని చూస్తేనే గుర్తుకు వస్తాయి.
భూమి మీద ఉంటూ... ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా, అంత గొప్పవాడు, మహానుభావుడు కాబట్టే ఆయన పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను ఇవ్వాలని వైఎస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డులు, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు ఇస్తున్నామని ప్రకటించాం. ఇందులో లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. అచీవ్మెంట్ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం.
*ప్రతి పనిలోనూ పారదర్శకతతో....*
గర్వంగా మరోసారి ఇంకో విషయం చెబుతున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమం చూసినా, గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గరనుంచి మొదలుపెడితే.. ప్రతి సంక్షేమపథకం కూడా, ప్రతి పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధని తీసుకొనిరావడం మొదలు.. ఈరోజు ఈ అవార్డుల ఎంపికలో కూడా కులం చూడలేదు. మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరకి వారి రాజకీయ పార్టీలను, రాజకీయ భావాలను కూడా చూడలేదు. మనిషిని ఒక మనిషిగానే చూశాం. విభేదించే భావాలున్నా మనుషుల్లో మహామనుషులను చూశాం.
*అసామాన్యులకు సలామ్ చేస్తూ....*
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా అవార్డులను ఇస్తున్నాం. ఇది మన తెలుగుకి, సంస్కృతికి, కళలకు, మనలో ఉన్న మానవతా మూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులగానే భావిస్తున్నాం. ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత సంస్ధలకు, వ్యక్తులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. సామాన్యులగా కనిపించే అసామాన్యులకు వందనం చేస్తూ... వారి వెలకట్టలేని ప్రతిభకు సలామ్ చేస్తూ ఈ ఆవార్డులను ప్రకటించాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్లైన, కళలకు, సంస్కృతికి ఈ ఆవార్డులలో పెద్దపీట వేయడం జరిగింది.
*ప్రతి కళకు....*
ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్ధల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంటకగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి.
*గొప్ప సంస్ధలకూ....*
అలాగే వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్ఎన్ ఛారిటీస్ వారికి, సీపీ బ్రౌన్ లైబ్రరీకి, వేటపాలెం గ్రంధాలయానికి, ఆర్డీటీ సంస్ధకి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్.. ఇటువంటి గొప్ప గొప్ప సంస్ధలకు వారి సేవలకు ఇస్తున్న ఆవార్డులు ఇవి.
*రైతుకు... కలం యోధులకూ అవార్డులు...*
పండించే రైతన్నకు మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి ఇస్తున్న అవార్డులు కూడా ఇవి.
కలంయోధులైన కవులకు, స్త్రీవాద ఉద్యమానికి, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయలకు ఇస్తున్న అవార్డులు కూడా ఇవి.
*సేవా మూర్తులకూ....*
కోవిడ్ సమయంలో అయినవారే తమ దగ్గరకు రాకూడదని, రాని పరిస్థితుల్లో.. ఆస్పత్రుల్లో అన్నీ తామై, తామే కుటుంబమై.. వారాలు, నెలలు పాటు తమ కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి అసామాన్యమైన సేవలందించిన మానవతామూర్తులకు కూడా ఈ ఆవార్డులు ఇస్తున్నాం.
*ప్రతి ఏటా అవార్డులు ఇస్తాం...*
ఈ అవార్డులన్నీ ఇక ప్రతి ఏటా నవంబరు ఒకటో తారీఖున ఇస్తాం.
రాష్ట్ర అవతరణ దినోత్సం నాడు ఈ ఆవార్డులను ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీ వాడిగా తెలుగుజాతిలో మాణిక్యాలను, మకుటాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించడాన్ని దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
addComments
Post a Comment