తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల (ప్రజా అమరావతి):
నవంబరు 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 10న పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు.
పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.
మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కారణంగా వర్చువల్ ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
addComments
Post a Comment