కేంద్ర ఐ.టీ,ఎలక్ట్రానిక్స్ , విమానయాన శాఖ మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్,జ్యోతిరాదిత్యలతో భేటీ




న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);



*ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైన మంత్రి మేకపాటి*


*కేంద్ర ఐ.టీ,ఎలక్ట్రానిక్స్ , విమానయాన శాఖ మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్,జ్యోతిరాదిత్యలతో  భేటీ*




*రాష్ట్రానికి సంబంధించిన వైమానికరంగ అభివృద్ధి, ఐ.టీ విస్తరణపై చర్చ*


*భోగాపురం విమానాశ్రయాన్ని కొలిక్కి తెద్దాం..దొనకొండపై వచ్చే వారం మళ్లీ ప్రత్యేకంగా కలుద్దామన్న జ్యోతిరాదిత్య*


*వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ కాన్సెప్ట్ ను అభినందించిన కేంద్ర ఐ.టీ శాఖ మంత్రి రాజీవ్*


*డబ్ల్యూఎఫ్ హెచ్ టీ కేంద్రాలు ఏర్పాటు పూర్తయితే ఏపీకి వచ్చి సందర్శిస్తానని వెల్లడి*


*ఐ.టీ సేవల విస్తరణతో పాటు, టైర్2, టైర్3 పట్టణాలకు   డబ్ల్యూఎఫ్ హెచ్ టీ కేంద్రాలు విస్తరించాలని స్పష్టం*


*కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరిలో నైపుణ్యంపై దేశవ్యాప్తంగా ఉన్న ఐ.టీ సంస్థలతో భారీ సదస్సు*


*ఏపీలో 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటులో కేంద్ర సహకారంపైన చర్చ*



న్యూఢిల్లీ, నవంబర్, 19;  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కేంద్ర మంత్రులతో శుక్రవారం సమావేశమయ్యారు.  ఢిల్లీ వేదికగా కేంద్ర ఐ.టీ,ఎలక్ట్రానిక్స్ , విమానయాన శాఖ మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్,జ్యోతిరాదిత్యలను కలుసుకున్న ఆయన  రాష్ట్రానికి సంబంధించిన వైమానికరంగ అభివృద్ధి, ఐ.టీ విస్తరణపై కేంద్ర మంత్రులతో చర్చించారు. వైమానికరంగ ప్రగతికోసం ఇంధనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధించే పన్నును 16 శాతం నుంచి 1 శాతానికి తగ్గించడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించింది. అన్ని రాష్ట్రాల విమానయాన శాఖలతో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య నేతృత్వంలో జరిగిన సమావేశంలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ .. విమానాలు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం, రద్దు జరిగినపుడు రాకపోకలపై ఎలాంటి సమాచారం లేక సాధారణ ప్రయాణీకులు పడే ఇబ్బందులను పరిశ్రమల శాఖ  మంత్రి మేకపాటి ప్రస్తావించారు. భోగాపురం విమానాశ్రయం ప్రగతిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి మేకపాటి కోరారు. బ్రిటీష్ కాలంలో అతిపెద్ద రన్ వేతో సేవలందించిన ప్రకాశం జిల్లాలోని దొనకొండలో విమానాశ్రయ పునరుద్ధరణకు ఆర్థిక సహకారం గురించి  మంత్రి మేకపాటి  సదస్సు అనంతరం కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడినపుడు ప్రస్తావించారు. వచ్చేవారం మరోమారు కలిసి భోగాపురం ఏపీలోని కీలక ప్రాజెక్టులను కొలిక్కి తీసుకువచ్చే దిశగా చర్చించి తదనుగుణంగా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సమాధానమిచ్చారు.  వైమానిక రంగాన్ని కరోనాకు ముందులా తీసుకురావడమే ధ్యేయంగా సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిండియా సారధ్యంలో  నిర్వహించి రాష్ట్రాభిప్రాయాలను చర్చించే వేదికను ఏర్పాటు చేసిన చొరవను మంత్రి మేకపాటి అభినందించారు.


వైమానికరంగంలో ఆంధ్రప్రదేశ్ అనేక ఆదర్శనీయ సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి మేకపాటి వెల్లడించారు. ప్రతి చోటుకీ వేగంగా వెళ్లగలిగే కనెక్టివిటీ, మూరుమూల గ్రామాలకు వెళ్లగల సకల రవాణా, రహదారి, ఇతర మార్గాల సదుపాయాలతో ఉన్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనన్నారు. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఛాంపియన్ స్టేట్ లలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, రహదారులతో అంతటా కనెక్టీవిటీ వంటి వనరులు సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి ఓ గ్రోత్ సెంటర్ గా మేకపాటి అభివర్ణించారు. ముఖ్యమంత్ని వైఎస్ జగన్ నాయకత్వంలో కేంద్రం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్ డాలర్ల ఎకనమీ సాధనలో , భారీ ఎగుమతుల ప్రోత్సాహంలో ఏపీ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ లో అందుబాటులోకి తీసుకువచ్చిన కొత్త విమానాశ్రయానికి 1847 సమయంలో బ్రిటీష్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన తొలి భారతీయుడు , స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుతో నామకరణం చేశామని ఈ సదస్సు ద్వారా మంత్రి మేకపాటి మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 విమానాశ్రయాలు పూర్తి స్థాయిలో పౌరులకు సేవలందిస్తున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. వాటిలో, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో  5 ఎయిర్ పోర్టులు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నట్లు వివరించారు. అందులోనూ  విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సకలసదుపాయాలకు నెలవుగా కొలువుదీరాయన్నారు.  అంతేకాకుండా, కర్నూలు జిల్లాలోని విమానాశ్రయం ఏపీఏడీసీఎల్ ద్వారా, మరొకటి అనంతపురం జిల్లాలోని సత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో నిర్వహించబడుతున్నాయని మంత్రి వివరించారు. ఏఏఐ ద్వారా ప్రకాశం జిల్లాలో ఎయిర్ స్ట్రిప్ లు నిర్మించబడుతున్నాయని, వాటిని 2022లో ప్రారంభించనున్నామన్నారు.  ఇక, రాజమండ్రి, కడప దేశీయ విమానాశ్రయాలలో కరోనా ముందు వరకూ 5 మిలియన్లకు పైగా ప్రయాణీకుల ప్రయాణం చేశారని,  12,135 ఎం.టీ ల సామర్థ్యంతో సరకు రవాణా జరిపాయని మంత్రి వివరాలతో సహా స్పష్టం చేశారు.  కోవిడ్ సమయంలో ఈ విమానాశ్రయాలపై చాలా ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. ఏవియేషన్ పెట్టుబడులు పెంచాలనే ఆలోచనతో ఏపీ ఆ దిశగా ఏపీఏడీసీఎల్ పేరుతో ప్రత్యేక ప్రయోజనా వాహకాన్ని ఏర్పాటు చేసిందని మంత్రి పేర్కొన్నారు. రోడ్డు, రైలు, పోర్టుల వంటి సదుపాయాలన్నీ ఉన్న చోట పారిశ్రామిక, ఆర్థిక ప్రగతే లక్ష్యంగా మల్టీ మోడల్ కార్గో హబ్ లను ఏర్పాటు చేయడానికి ఏపీ అడుగులేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ 2030 కల్లా పీపీపీ పద్ధతిలో వైమానిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. 


*భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా చొరవతో రాష్ట్రంలో కొన్ని డిఫెన్స్, ఏరోస్పేస్ ఆధారిత తయారీ  యూనిట్లకు ఆంధ్రప్రదేశ్  ఆసక్తిగా ఉంది. ఆప్రాజెక్టుల ప్రతిపాదనల వివరాలు :*


*శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని  బొడ్డువారిపాలెంలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ గ్రీన్ ఫీల్డ్ అల్యూమినియమ్ అలాయ్ తయారీ యూనిట్* 


*కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు బీఈఎల్ లో అత్యాధునిక నైట్ విజన్ పరికరాల ప్రాజెక్టు*


*అనంతపురం జిల్లాలోని పాలసముద్రం బీఈఎల్ లో మిసైల్ ఇంటెగ్రేషన్ ఫెసిలిటీ*


*ప్రకాశం జిల్లాలో భారత నేవీ ఆధ్వర్యంలో చేపట్టే  వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) ట్రాన్స్ మిషన్ సౌకర్యం* 

 

*ప్రకాశం జిల్లాలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ట్రైనింగ్ సౌకర్యం*


*భోగాపురంలో  మెగా ఎరోట్రొపొలిస్ ప్రతిపాదించిన ఎయిర్ కార్గో కాంప్లెక్స్, ఎంఆర్ఓ ఫెసిలిటీ*


*విశాఖపట్నం కేంద్రంగా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్*


*డీఆర్డీవో ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని నాగాయలంక వద్ద మిసైల్ టెస్టింగ్ యూనిట్*


*కర్నూలు జిల్లాలో డీఆర్డీవో సమక్షంలో నేషన్ ఓపెన్ ఎయిర్ రేంజ్*


పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, ప్రైవేట్ రంగాల మద్దతుతో అగ్రశ్రేణి శక్తులలో ఒకటిగా భారతదేశం నిలుస్తుందని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే రాష్ట్రాలలో  ఏపీ నంబర్ వన్ అవుతుందన్నారు.


----------


*కేంద్ర ఐ.టీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో ఏపీ ఐ.టీ మంత్రి మేకపాటి సమావేశం*


*30 నైపుణ్య కళాశాలల ఏర్పాటులో కేంద్ర సహకారంపైన చర్చ*


*వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కేంద్రాల ఏర్పాటులో ఏపీ చొరవపై కేంద్రమంత్రి ప్రశంసలు*


కేంద్ర ఐ.టీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ని రాష్ట్ర ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ లో కలిసిన ఆయన రాష్ట్రంలో ఐ.టీ అభివద్ధి గురించి ప్రధానంగా చర్చించారు. ఇటీవల ఐ.టీ శాఖ ప్రారంభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కేంద్రాల ఏర్పాటు గురించి మంత్రి మేకపాటి వివరించారు. డబ్ల్యూ ఎఫ్ హెచ్ టీ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ముందుగా తీసుకురావడాన్ని  ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ అభినందించారు. అన్ని కేంద్రాలు పూర్తయినపుడు సమాచారం అందిస్తే కచ్చితంగా వచ్చి సందర్శిస్తానని కేంద్ర మంత్రి  మేకపాటికి వెల్లడించారు. టైర్2, టైర్3 పట్టణాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కేంద్రాలను విస్తరింపజేయాలని కేంద్ర మంత్రి మంత్రి మేకపాటికి దిశానిర్దేశం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో గత మంత్రి రవిశంకర్ స్థానంలో వచ్చిన రాజీవ్ చంద్రశేఖర్ కి మంత్రి మేకపాటి ఐ.టీ పరంగా ఏపీ అమలు చేస్తున్న కీలక అంశాలను  వివరించారు. రాబోయే రోజుల్లో నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, నైపుణ్య శిక్షణపైనా మంత్రి మేకపాటి కేంద్ర మంత్రితో చర్చించారు. జనవరి నెలలో దేశవ్యాప్తంగా ఐ.టీ సంస్థలతో భారీ సదస్సు నిర్వహించి దేశ యువతకు అవసరమైన స్కిల్లింగ్ , ఐ.టీపై అభిప్రాయాలను తీసుకుని తదనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటులో కేంద్ర సహకారంపైనా చర్చించినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు.


Comments