నెల్లూరు, నవంబర్ 13 (ప్రజా అమరావతి): తనను కలవడానికి శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి కాలినడకన పాదయాత్రగా విచ్చేసిన ఆదివాసీ చిన్నారులతో ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడారు. శనివారం ఉదయం వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ముప్పవరపు ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఆదివాసీల చిన్నారుల బృందంతో వారు కాసేపు ముచ్చటించారు.
గత ఆరు నెలల క్రితం శ్రీశైలంలోని ఎర్రగొండ్లపాలెం కు చెందిన
ఈ ఆదివాసి చెంచుల తెగకు చెందిన సుమారు 20 మంది బాలలు ముగ్గురు సహాయకులతో కలిసి స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ శ్రీ వంశీధర్ కాళిదాసు సహకారంతో గతంలో రెండు నెలల పాటు సుమారు 3000 కిలోమీటర్ల "భారత్ దర్శన్" యాత్రను కొంత సైకిల్ పై, మరికొంత నడక, పరుగెత్తడం ద్వారా పూర్తి చేసి క్షేమంగా తిరిగొచ్చారు.
యాత్ర సమయంలో ఈ బృందంలోని కొందరు సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. ఆ సమయంలో ఉపరాష్ట్రపతి గారి కుమార్తె శ్రీమతి దీపావెంకట్, ఉపరాష్ట్రపతి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా, వారు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ద్వారా సహాయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపేందుకు వారు నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్ కు శ్రీశైలం నుంచి పాదయాత్రగా బయలుదేరి వచ్చి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని కలిశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి చిన్నారుల యోగ క్షేమాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు శ్రీ వంశీధర్ కాళిదాస్ మాట్లాడుతూ విద్యార్థులు పరుగు పందెం, గురిపెట్టి బాణాలు వేయడం లో నిష్ణాతులని, వీరికి సరైన వసతి సౌకర్యాలు కల్పించేలా సహకారం అందించాలని ఉపరాష్ట్రపతికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్వర్ణ భారతి ట్రస్ట్ నిర్వాహకురాలు శ్రీమతి దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment