వరద ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు

 నెల్లూరు (ప్రజా అమరావతి);


 వరద ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న  రోడ్లు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు


చేపట్టాలని, అలాగే ప్రభుత్వం ప్రకటించిన విధంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు, నిత్యావసర సరుకులు అందించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, అధికారులను ఆదేశించారు.


బుధవారం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని  వరద ప్రభావిత గ్రామలైన సంగం మండలంలోని సంగం, పెరమన, కోలగట్ల గ్రామం, ఆత్మకూరు మండలంలోని వాశిలి, అప్పారావు పాలెం,  వీర్ల గుడిపాడు గ్రామాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి విస్తృతంగా పర్యటించి వరద బాధితులతో మాట్లాడి, చేపడుతున్న వరద సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.


తొలుత సంగం మండల కేంద్రంలోని బీరాపేరు వాగు వద్ద దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను  మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి పరిశీలించి రైతులు తో మాట్లాడారు. రానున్న కాలంలో ఈ ప్రాంతం ముంపునకు గురికాకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు.


అనంతరం మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి, పెరమన గ్రామాన్ని సందర్శించి, వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. పెరమనలో ప్రధాన రోడ్డు మార్గం మొత్తం నీటిలో మునిగి పోయిన కారణంగా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సహకారం చేరాలని  మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి, అధికారులను ఆదేశించారు.

తుపానులు, వర్షాలు, వరదల కారణంగా ఎప్పుడు నీటమునిగే పెరమన గ్రామానికి ప్రత్యేకంగా పరిగణించి అన్నివిధాల ఆదుకుంటామని  మంత్రి, గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

పెరమనలో దళిత వృద్ధురాలు లక్ష్మమ్మకు వెంటనే పించన్ అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి  శ్రీ గౌతమ్ రెడ్డి, ఆర్డీవోని ఆదేశించారు.

అంగన్వాడి కేంద్రాన్ని, మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి,  అంగన్వాడీ కేంద్రంలో ఫ్లోరింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని   అధికారులను ఆదేశించారు. 

పెరమనలో లోతట్టు ప్రాంతాల్లో  ఇళ్ళు నిర్మించడం సాధ్యం కాదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తామని మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి వెల్లడించారు.



అనంతరం  మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, కోలగట్ల గ్రామం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

ఆధార్ కార్డు లేని కారణంగా ప్రభుత్వ సాయం అందలేదని ఎస్.టి కాలనీ వాసులు  మంత్రి దృష్టికి తీసుకురాగా,

గిరిజనులకు సాయంత్రం కల్లా ప్రభుత్వ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.2000/- నిత్యావసర సరుకులు అందించాలని మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి,  సంగం తహసీల్దార్ ను ఆదేశించారు.

ఆధార్ కార్డులు లేని గిరిజన కుటుంబాలకు త్వరలోనే ప్రత్యేక క్యాంపు నిర్వహించి ఆధార్ కార్డులు వచ్చేలా చేస్తామని మంత్రి, కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కోలగట్లలో పూర్తిగా బురదమయం అయిన ఇళ్లను  మంత్రి  శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు.


తరువాత మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి, ఆత్మకూరు మండలంలోని వాసిలి, అప్పారావు పాలెం, వీర్లగుడి పాడు గ్రామాల్లో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, వరద బాధితులతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా అప్పారావు  పాలెంలో  పశుసంవర్ధక శాఖ తరపున పశువుల దాణాన్ని  మంత్రి శ్రీ  గౌతమ్ రెడ్డి, పాడి రైతులకు అందచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటులో  మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి, వీర్లగుడిపాడు గ్రామాన్ని సందర్శించి, వరద బాధితులతో మాట్లాడి,చేపడుతున్న వరద సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.


మంత్రి వెంట, జడ్పీ సి.ఇ. ఓ శ్రీనివాస రావు, ఆర్డీవో చైత్ర వర్షిణి, మత్స్య శాఖ జె డి.  నాగేశ్వరరావు, సంగం, ఆత్మకూరు, చేజర్ల మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments