రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి.


నెల్లూరు, డిసెంబర్ 17 (ప్రజా అమరావతి): రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఎరువులను రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని



జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు  అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 230 కస్టం హైరింగ్  సెంటర్లు (సిహెచ్సిలు) మంజూరయ్యాయని, రైతులను గ్రూపుల వారీగా త్వరితగతిన ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను ఈ కేంద్రాల ద్వారా సమకూర్చాలని సూచించారు. ఈసారి పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ ప్రక్రియను రైతు భరోసా కేంద్రాల్లోని ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే చేపడుతున్నామని,  రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా  వసూలు చేయకుండా ధాన్యం సేకరణకు సంబంధించి గోతాములు, రవాణా, హమాలీల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పంట వేసిన వారంలోగా ఈ క్రాప్ నమోదును పూర్తి చేయాలన్నారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులను రైతుల అవసరాలను బట్టి రైతు భరోసా కేంద్రాల్లో ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ఏ మట్టిలో ఏ పంట వేయాలి... ఎంత దిగుబడి వస్తుంది.. ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలను రైతుకు అర్థమయ్యేలా రైతు భరోసా కేంద్రాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు, మండల స్థాయిలో నిర్వహించే వ్యవసాయ సలహా మండలి సమావేశాలకు ఇరిగేషన్ అధికారులు హాజరై రైతులు తెలిపే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇటీవల వరదలకు దెబ్బతిన్న చెరువులు, కాలువలకు మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఎన్ డి సి సి చైర్మన్ శ్రీ కామిరెడ్డి సత్య నారాయణ మాట్లాడుతూ సులూరుపేట, నాయుడుపేట మండలాల పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఉన్న సిబ్బంది వారికి కేటాయించిన పనులకు పరిమితం అవుతున్నారని, అదనంగా సిబ్బందిని నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అలాగే యూరియా, పొటాషియం కొరత ఎక్కువగా ఉందని, వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలకు చాలాచోట్ల పంట కాలువలు దెబ్బతిన్నాయని, రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండటం లేదని, ఇసుక మేటలు వేసిన పొలాలకు నష్టపరిహారాన్ని పెంచాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిరప్రసాద్ వివరించారు. 

 ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఆనంద కుమారి, జిల్లా పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ శ్రీమతి పద్మ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ ఏడి శ్రీమతి రమమ్మ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ జె డి లు శ్రీ నాగేశ్వరరావు, శ్రీ మహేశ్వరుడు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ప్రసాదరావు, శివన్నారాయణ, ఏడి శ్రీమతి అనిత, పలువురు రైతులు పాల్గొన్నారు. 


Comments