సచివాలయం. వెలగపూడి (ప్రజా అమరావతి);
ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ, శ్రీ పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి:
ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం
ఉద్యోగులూ ప్రభుత్వంలో ఒక భాగమే
అందుకే ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం
27న మళ్లీ చర్చలకు ఆహ్వానించాం
ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి
ఉద్యోగుల సంక్షేమంపై సీఎంగారి నిరంతర దృష్ఠి
అందుకే అడక్కుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారు
అంగన్వాడీలు, ఇతర ఉద్యోగుల వేతనాలు పెంచారు
ఉద్యోగుల కోసం ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుంది
సచివాలయంలో మీడియాతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రెస్మీట్లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..:
వారు వాటిని ప్రస్తావించారు:
నిన్నటి మాదిరిగా ఇవాళ కూడా మంత్రివర్గ సభ్యులు కూర్చున్నారు. ఇవాళ ఆర్థిక మంత్రిగారు కూడా వచ్చారు. ఉద్యోగుల కమిటీ సభ్యులుగా నామినేట్ చేసిన వారు రావడం కొంత ఆలస్యం అయింది. వారు ప్రధానంగా రెండు మూడు అంశాలు ప్రస్తావించారు. పీఆర్సీ కమిటీ నివేదిక ఇవ్వాలని, పీఆర్సీపై జారీ చేసిన జీఓలు పెండింగ్లో పెట్టాలని, హెచ్ఆర్ఏ సవరించాలని కోరారు.
అందుకు మేము ఏమన్నామంటే, ఇప్పటికే జీఓలు ఇచ్చారు కాబట్టి పాత పాత వేతనాలు ఇవ్వడం సరికాదని చెప్పాం. ఇంకా ఏమైనా ఉంటే చర్చిద్దామని తెలిపాం. ఒకవేళ అవి మా పరిధిలో లేకపోతే పైస్థాయికి తీసుకుపోతామని మంత్రులు వివరించారు.
వారు ప్రభుత్వంలో భాగం:
ఉద్యోగులందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు పడకపోతే ఉద్యోగులు బాధ పడాలి. ఈ ముఖ్యమంత్రిగారికి ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఒక భాగం అనే కాకుండా.. వారు ప్రజల్లోనూ భాగస్వాములని, అందుకే ప్రజా సంక్షేమం కోసం ఏమేం చేశామో, ఉద్యోగులకు అలా చేయాలనే సంకల్పంతో అడక్కుండానే ఐఆర్ ఆ విధంగా ఇచ్చారు. అంతే కాకుండా అంతకు ముందు అతి తక్కువ వేతనాలు వస్తున్న అంగన్వాడీలు, ఇతర ఉద్యోగుల వేతనాలు పెంచడం, అలాగే సచివాలయాల ఉద్యోగుల నియామకం, వారి ప్రొబేషన్ డిక్లేర్ చేయనుండడం.. ఇవన్నీ ఏదీ కూడా అడక్కుండానే, తన దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగారు డైరెక్షన్ ఇచ్చారు.
ఆలోచించమని కోరాం:
ఈ నేపథ్యంలో ఇంత కాలం ఇంత కసరత్తు జరిగిన దానిపై మళ్లీ తిరగతోడడం కరెక్టు కాదేమో ఆలోచించమని విజ్ఞప్తి చేశాం. మళ్లీ అదే విజ్ఞప్తిని ఇప్పుడు మీ ద్వారా చర్చలకు రాని ఉద్యోగుల నాయకులకు, జిల్లాల నాయకులకు, ఉద్యోగులకు అందరికీ చేస్తున్నాం.
ఫ్రెండ్లీ ప్రభుత్వం:
ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి చేయగలిగిందంతా చేస్తుంది. ఇప్పుడు కూడా ఏమైనా అపోహలు ఉంటే తొలగిస్తుంది. ఎవరికీ ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూస్తుంది. ఏ అపోహలు ఉన్నా తొలగిస్తుంది. అందుకే 27వ తేదీన మళ్లీ రమ్మన్నాం. ఆరోజు వస్తే మళ్లీ చర్చిస్తాం.
పీఆర్సీ అనేది ఎప్పటికైనా తప్పదు. అందువల్ల మళ్లీ పాత వేతనాలు అనేది సరికాదు. ఎప్పుడు కూర్చున్నా అదే అంశం చర్చకు వస్తుంది. ఈ విషయం మాకూ తెలుసు. ఉద్యోగులకూ తెలుసు. ఫిట్మెంట్ అనేది ఖరారై పోయింది. దానిపై ఎవరికీ విభేదాలు లేవు. ఇంకా ఏమైనా అంశాలు ఉంటే చర్చిద్దామన్నాం.. అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
addComments
Post a Comment