స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తాం
– రూ 70 లక్షలతో ఆధునీకరించిన గదులను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
– ఆరు నెలల్లోపు ఎమర్జెన్సీ నూతన భవనాల నిర్మాణం పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశం
తిరుపతి 27 జనవరి (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
స్విమ్స్ నెఫ్రో ప్లస్ బ్లాక్ లో రూ 70 లక్షలతో ఆధునీకరించిన పేయింగ్ రూం లను గురువారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. గదుల్లో వసతులను పరిశీలించారు.
అనంతరం శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసి స్విమ్స్ను టిటిడికి అప్పగించిందని చెప్పారు.
పేద ప్రజలను అదుకోవడానికి టిటిడి ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. టిటిడి అనేక రూపాలలో ఇప్పటికే స్విమ్స్కు సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా స్విమ్స్ నెఫ్రో ప్లస్ బ్లాక్ లో ఉన్న 95 గదులకు ఆక్సిజన్ సహా అన్ని వసతులు సమకూర్చి పేయింగ్ రూమ్లుగా ఆధునీకరిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు ఆధునీకరించిన 30 గదులను ప్రారంభించామని చైర్మన్ చెప్పారు. మిగిలిన 65 గదులను టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువస్తుందని ఆయన వివరించారు.
30 గదుల ఆధునీకరణ కోసం టిటిడి రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు.
రాబోవు రోజుల్లో అన్ని విధాలుగా స్విమ్స్ను అభివృద్ధిపరిచి రోగులకు ఆధునిక వసతులతో కూడిన మరింత మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. స్విమ్స్లో దేశంలోనే అతిపెద్ద డయాలసిస్ కేంద్రం ఇప్పటికే అందుబాటులో ఉందన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ, వైద్యం అందించే విధానానికి సంబంధించి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్(ఎన్.ఏ.బి.హెచ్) సర్టిఫికెట్ లభించడం పట్ల ఆసుపత్రి వైద్యులు, అధికారులు, సిబ్బందిని చైర్మన్ అభినందించారు.
స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా స్విమ్స్ విశేష సేవలందిస్తోందన్నారు.
నూతనంగా నిర్మిస్తున్న స్విమ్స్ అత్యవసర ( ఎమర్జెన్సీ) బ్లాక్ భవనాల నిర్మాణం ఆరునెలల్లోగా పూర్తి చేయాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ఓపి లో రద్దీ తగ్గించి రోగులు, వారి సహాయకులకు ఇబ్బంది లేకుండా చేయడానికి కొన్ని విభాగాల ఓపిని ఈ భవనం లోకి మారుస్తామని చెప్పారు. ఈ మేరకు అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. రోగుల సహాయకులు సేద తీరేందుకు ప్రత్యేకంగా షెడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
స్విమ్స్ అత్యవసర విభాగం నూతన భవనాల నిర్మాణం పరిస్థితిని చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి స్వయంగా పరిశీలించారు.
టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర బ్రహ్మం, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి,స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, వైద్యాధికారులు డాక్టర్ రామ్, టీటీడీ ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర్లు, టీటీడీ విజిఓ శ్రీ మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment