నేటి నుంచి పిల్లల‌కూ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు

 


*నేటి నుంచి పిల్లల‌కూ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు


*


*3 నుంచి 5వ తేదీ వ‌ర‌కూ ప్రత్యేక వ్యాక్సినేష‌న్‌ డ్రైవ్*


*స‌చివాల‌యాలు, పి.హెచ్‌.సిల్లో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు*


*15 - 18 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల‌ 1.18 లక్షల మందికి వ్యాక్సిన్‌*


*అర్హులైన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి  : జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి సూర్యకుమారి*


 


విజ‌య‌న‌గ‌రం, జ‌న‌వ‌రి 02 (ప్రజా అమరావతి):


*దేశంలో కోవిడ్ వ్యాప్తిని నిరోధించ‌డంలో భాగంగా జిల్లాలో 15 నుంచి 18 సంవ‌త్సరాల లోపు వ‌య‌స్సు గ‌ల వారంద‌రికీ జ‌న‌వ‌రి 3 నుంచి వ్యాక్సిన్ వేయాల‌న్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమ‌లు ప‌ర‌చేందుకు జిల్లా యంత్రాంగం స‌మాయ‌త్తమ‌య్యింది. దీనిలో భాగంగా 15 నుంచి 17 సంవ‌త్సరాల వ‌య‌స్సు క‌లిగిన విద్యార్ధులు, యువ‌త‌కు సోమ‌వారం నుంచి తొలి డోసు వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసిన‌ట్లు జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి వెల్లడించారు. జ‌న‌వ‌రి 3 నుంచి 5 వ తేదీ వ‌రకు ప్రత్యేక వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వహించి ఈ వ‌య‌స్సుల వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో అర్హులైన ఈ వ‌య‌స్సు వారంద‌రికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేస్తార‌ని, అర్హులైన వారంతా త‌ప్పనిస‌రిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొని ర‌క్షణ పొందాల‌ని క‌లెక్టర్ సూచించారు.*


        *వ్యాక్సిన్‌కు అర్హత గ‌ల విద్యార్ధులు, యువ‌త త‌మ వ‌య‌స్సును నిర్ధారించేందుకు అవ‌స‌రమైన గుర్తింపు కార్డులు లేదా ఆధార్ కార్డులు త‌మ వెంట తీసుకువెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవ‌చ్చన్నారు. ఆయా కేంద్రాల్లో ఏ.ఎన్‌.ఎం.ల ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేస్తార‌ని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్ధులు, యువ‌త‌కు కోవాక్జిన్ వ్యాక్సిన్ ఇస్తార‌ని పేర్కొన్నారు.*


 


*1.18 ల‌క్షల మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు*


 


        *జిల్లాలో ఈ వ‌య‌స్సుల వారు 1.18 ల‌క్షల మంది వుంటార‌ని అంచ‌నా వేసిన‌ట్లు జాయింట్ క‌లెక్టర్‌(గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు) డా.ఆర్‌.మహేష్ కుమార్ వెల్లడించారు. ఇందులో జిల్లాలోని విద్యా సంస్థల్లో ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ మొద‌టి సంవ‌త్సరం చ‌దువుతున్న వారంతా క‌ల‌సి 80 వేల మంది వుంటార‌ని వారంద‌రికీ ఈ మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో వ్యాక్సిన్ వేయించే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, క‌ళాశాల ప్రిన్సిపాల్‌ల దేన‌ని చెప్పారు. ఆయా విద్యాసంస్థల బాధ్యులు త‌మ స‌మీపంలోని పి.హెచ్‌.సి. వైద్యాధికారిని సంప్రదించి ఎన్ని డోసులు అవ‌స‌ర‌మో తెలియ‌జేసి వ్యాక్సిన్ వేసే ఏర్పాట్లు చేయాల‌న్నారు. విద్యాసంస్థల్లో వంద శాతం విద్యార్ధుల‌కు వ్యాక్సినేష‌న్ జ‌ర‌గాలని, ఏ ఒక్క విద్యార్ధి వ్యాక్సిన్ వేసుకోకుండా మిగిలినా అందుకు ఆయా విద్యాసంస్థల అధిప‌తులే బాధ్యత వ‌హించాల్సి వుంటుంద‌న్నారు.*


 


        *కోవిడ్ వ్యాక్సిన్‌పై విద్యార్ధుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కూ ఎలాంటి అపోహ‌లు, ఆందోళ‌న అవస‌రం లేద‌ని, ఈ వ్యాక్సిన్ పూర్తి సుర‌క్షిత‌మైన‌ద‌ని ఆదివారం ఆయా విద్యాసంస్థల బాధ్యుల‌తో నిర్వహించిన టెలి కాన్పరెన్సులో జె.సి. డా.మ‌హేష్ కుమార్ చెప్పారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎలాంటి త‌దుప‌రి ఆరోగ్య ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం లేద‌ని, ఒక‌వేళ జ్వరం వంటివి వ‌చ్చినా వెంట‌నే వారిని కేవ‌లం 15 నిముషాల్లో స‌మీప సి.హెచ్‌.సి.కి త‌ర‌లించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు.*


 



Comments