కొవ్వూరు (ప్రజా అమరావతి);
ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూముల రీ సర్వేకు విఆర్వో లు , సర్వేయర్లు పోటీతో, సమన్వయం తో పని చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు.
స్థానిక మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కొవ్వూరు డివిజన్ లోని సర్వేయర్లు, డిటి లకు, ఆర్ ఐ లకు విఆర్వో లు, లకు రీసర్వే, సెటిల్మెంట్ పై ఆర్డీవో , అసిస్టెంట్ డైరెక్టర్(సర్వే) తో కలిసి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, భూముల సర్వే, సేట్టిల్మెంట్ రికార్డుల ను రూపొందించే సందర్భంలో ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను, సూచనలను 100 శాతం అవగాహన చేసుకుని , క్షేత్రస్థాయిలో రిసర్వే చేపట్టిన తదుపరి రికార్డుల ను తయారు చెయ్యాల్సి ఉంద
న్నారు. ఇటువంటి శిక్షణ తరగతులకు హాజరయ్యే సమయంలో చర్చించిన అంశాలను వ్రాసుకొని, ఇంటికి వెళ్ళాక రెండు మూడు సార్లు చదువుకోవడం చాలా ముఖ్యం అన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చేపట్టిన రీ సర్వే లో లోపాలను గుర్తించి సర్వే శాఖ నివేదిక ఇచ్చారని, దానిని అధ్యాయనం చేసి భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షా పథకం పేరుతో చేపట్టే భూములు రీ సర్వే మూడు దశల్లో సర్వే జరుగుతుందని, దీనికి నిర్దిష్టకాల పరిమితి విధించారని చెప్పారు. ఏ దశలో ఆగినా వెనకబడి పోవడం ఖాయమని గుర్తించాలన్నారు. రెవెన్యూ చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని చెప్పారు. రీ సర్వే పథకం కింద భూముల స్వచ్ఛీకరణ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, మనసా వాచా పనిచేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించాలని, సభల్లో సర్వే వివరాలను.. సర్వే ప్రక్రియను.. దాని లాభాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు. ప్రజల నుంచి ఎటువంటి అర్జీ పెట్టకపోయినా సంపూర్ణమైన సర్వే చేయాలని చెప్పారు. మొదటి విడతలో గ్రామాల్లో సర్వే జరుగుతుందని, గ్రామ సరిహద్దులను ముందుగా నిర్ధారించాలన్నారు. భూ యజమాని సమక్షంలోనే ఖచ్చితమైన కొలతలు వేసి సర్వే చేయాలని, ఉచిత హద్దు రాళ్లను వేయాలని తెలిపారు. ప్రతి కమతానికి మ్యాప్, ఆధార్ మాదిరి విశిష్ట సంఖ్య ఇవ్వడం జరుగుతుందన్నారు. శాశ్వత హక్కుల కల్పన, ఖచ్చితమైన భూ రెవెన్యూ రికార్డుల సమోదు చెయ్యాల్సి ఉంటుందని మల్లిబాబు చెప్పారు. శిక్షణ తరగతులకు హాజరైన వారు గ్రామాల్లో సంబంధించిన సిబ్బందికి సమగ్రంగా శిక్షణ అందించడంలో సహాయకారిగా ఉండాలని ఆదేశించారు..
addComments
Post a Comment