టిటిడి కళా ఖండాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం క‌ల్పించాలి

 టిటిడి కళా ఖండాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం క‌ల్పించాలి



– విద్యార్థుల‌ కళాత్మక నైపుణ్యం కోసం శిల్పకళాశాల‌లో వ‌ర్క్ షాప్‌ల నిర్వ‌హ‌ణ‌

– శిల్ప‌ క‌ళా ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభం

– జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి ( విద్యా, ఆరోగ్యం)

తిరుపతి,  ఫిబ్ర‌వ‌రి 26 (ప్రజా అమరావతి): టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర సంప్ర‌దాయ ఆల‌య నిర్మాణ శిల్ప శిక్ష‌ణ సంస్థ‌లో విద్యార్థులను భారతీయ సంస్కృతి మరియు వారసత్వంకు “దిశా నిర్దేశ‌కులుగా ” తీర్చిదిద్ధాల‌ని జెఈవో శ్రీమతి సదా భార్గవి ( విద్యా, ఆరోగ్యం) అధ్యాప‌కుల‌కు పిలుపునిచ్చారు. విద్యార్థుల హస్త కళ‌ల నైపుణ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల‌న్నారు.

తిరుపతి అలిపిరి వ‌ద్ద గ‌ల శిల్ప క‌ళాశాల‌లో విద్యార్థులు ఆరు రోజుల పాటు నిర్వహించే వివిధ కళాఖండాల‌ ప్రదర్శన మ‌రియు విక్రయాలను శనివారం స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మతో కలిసి జెఈవో ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో ( విద్యా, ఆరోగ్యం) మాట్లాడుతూ టిటిడి మాత్ర‌మే ఆలయ వాస్తు నిర్మాణం, శిల్పకళ మరియు పెయింటింగ్ వంటి సాంప్రదాయ కళలను గుర్తించి, ప్రోత్సాహాన్ని ఇస్తున్న‌ట్లు తెలిపారు. టిటిడి శిల్ప క‌ళాశాల‌ను 1960లో ప్రారంభించింద‌ని, గత ఆరు దశాబ్దాలుగా ఈ ప్రతిష్టాత్మక సంస్థ నుండి దాదాపు 760 మంది విద్యార్థులు తమ నాలుగేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేసి వివిధ రంగాలలో స్థిరపడ్డార‌న్నారు. ఇంత‌టి గొప్ప సంస్థ మ‌రెంద‌రో కళాకారులను ప్ర‌పంచానికి అందించాలని కోరుకుంటున‌ట్లు చెప్పారు. రాబోయే తరాలకు సుసంపన్నమైన ఆలయ సంస్కృతిని, వాస్తు శిల్ప‌ సంప‌ద‌ను అందించేందుకు ఈ సంస్థ కృషి చేయాల‌న్నారు.

ఇందులో ఆల‌య నిర్మాణ విభాగ‌ము, శిలా, సుధా, లోహ‌ మరియు దారు (చెక్క‌) శిల్ప విభాగ‌ములు, సంప్ర‌దాయ వ‌ర్ణ చిత్ర‌లేఖ‌న, సంప్ర‌దాయ కలంకారి క‌ళ వంటి కోర్సులను అందిస్తున్న‌ట్లు తెలిపారు. విద్యార్థుల‌ను తమ కళాత్మక నైపుణ్యంతో చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, దీని కోసం వారికి వ్యాపార మెళకువలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ కళాఖండాలను ప్రోత్సహించేందుకు వారి వ్యాపార నైపుణ్యాలను పెంపొందించేందుకు వర్క్‌షాప్‌లు మరియు సెమినార్‌లను నిర్వహించాలని కూడా ఆమె అధికారుల‌కు సూచించారు.

శిల్ప‌క‌ళాశాల విద్యార్థులు రూపొందించిన దేవాల‌య విమానాలు, మండ‌పాలు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, దారుశిల్పాలు, పంచ‌లోహ శిల్పాలు, సంప్ర‌దాయ వ‌ర్ణ‌చిత్రాలు, సంప్ర‌దాయ క‌లంకారి వ‌ర్ణ‌చిత్రాలను ప్ర‌ద‌ర్శించ‌డంతోపాటు విక్ర‌యిస్తార‌న్నారు.

ముందుగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ ప్రసంగిస్తూ భారతీయ వారసత్వ సంపదగా నిలిచే సంప్రదాయ కళలకు సంబంధించిన ప్రత్యేక కోర్సులను ప్రోత్సహిస్తూ టిటిడి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

తిరుపతిలో సహజ రంగులతో కలంకారి చీరలను ప్రోత్సహించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి మమత రెడ్డిని కూడా ఈ సంద‌ర్భంగా జెఈవో సత్కరించారు.

అంతకుముందు ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచిన సాంప్రదాయ కళాఖండాల‌ ప్రాముఖ్యతను, దాని తయారీ ప్రక్రియను ఆయా విభాగాల‌ విద్యార్థులు జెఈవోకు వివరించారు.

దేవస్థానం విద్యాశాఖాధికారి శ్రీ సి.గోవిందరాజన్, ప్రిన్సిపాల్ శ్రీ వెంకట్ రెడ్డి, సీనియర్ అధ్యాపకులు శ్రీ జి.సాగర్, టిటిడి విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Comments